Devineni Avinash: సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) పై టీడీపీ నేత పట్టాభి (Pattabhi Arrest) వ్యాఖ్యలు.. టీడీపీ కార్యాలయంపై (TDP Office Attack) దాడి.. తర్వాత రోజు టీడీపీ బందు.. ఆపై సీఎం జగన్ తనను తిట్టారంటూ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ కాక రగిలించాయి.. ఈ మొత్తం వ్యవహారంలో దోషి ఎవరు..? తప్పెవరిది..? అనేది డిసైడ్ చేయడం ఇప్పుడు అనవసరం.. ఎవరి వాదన వారిది, ఎవరి ప్రచారం వారిది.. ఎవరి సానుభూతి డ్రామా వారిది..! అయితే ఇక్కడ విషయం మొత్తం అగ్గి రాజుకోవడంలో ప్రధాన పాత్ర మాత్రం టీడీపీ ఆఫీస్ పై దాడి ఘటనే.. ఆ ఘటన ద్వారానే టీడీపీలో ఉలిక్కి లేచింది.. ఆ దాడిని కవర్ చేసుకునే ప్రయత్నంలో వైసీపీ “బొశీడీకే” (BoshiDK) అనే పదాన్ని హైలైట్ చేసి.. రాజకీయం మొదలెట్టింది..! దాడి వైసీపీని చేసినట్టు పరోక్షంగా అంగీకరించారు. సీఎంని తిడితే ఊరుకోమంటూ వైసీపీ నేతలు పదే పదే హెచ్చరికలు కూడా చేస్తున్నారు.. ఇప్పుడు ఆ దాడిలో వైసీపీ తరపున ఎవరెవరు పాల్గొన్నారు..? విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ (Devineni Avinash) బ్యాచ్ అది ప్రచారం దేనికి సంకేతాలిస్తుంది..? దేవినేని అవినాష్ ఉనికి పార్టీలో ఇంతగా పెరగాలని తాపత్రయం వెనుక కారణాలేమిటి..!? అనే అంశాలు కీలకంగా మారాయి..!
Devineni Avinash: ముందుగా అవినాష్ బ్యాచ్ ప్రచారం చూద్దాం..!!
“అవినాష్ అంటే ఏంటో ఇప్పటికైనా అర్థమై ఉంటుంది. మా యువ నాయకుడు తలుచుకుంటే ఎం జరుగతుందో బాగా తెలిసి వచ్చినట్లుంది. ఎవరు ఊహించని రీతిలో బాబుకి ఘలక్. పేరుకు ఒక పదవి ఎలక్షన్ ముందు ఇచ్చి ఎవ్వరు పోటీ చేయని గుడివాడకి పంపి, ఎలక్షన్లో ఓడిపోయాక మా యువనేత తిరిగే తిరుగుడికి లోకేష్ స్థానానికి ఏసరు పెట్టేలాగున్నాడని, పొమ్మనకుండా గన్నవరం పొగ పెట్టి పార్టీ నుంచి బయటకి వెళ్లే దాకా నిద్రపోని బాబు కొడుకులకి ఒక్క దెబ్బకు నిద్ర పట్టకుండా చేశాడు మా బెజవాడ సింహం దేవినేని అవినాష్. బాబు ఇంటి మీదకు వచ్చినప్పుడు రొమ్ము విరిచి అడ్డునుంచున్న ఇతనే ఈ రోజు పచ్చ కోటకు బీటలు వారెలా చేశాడా అన్న షాక్ లోనుంచి ఇంకా తేరుకొలేకపోతున్నారు పచ్చ తమ్ముళ్లు. ఎలా స్పందించాలో కూడా తెలియక, ప్రపంచమంతా తెలిసినా పేరు చెప్పడానికి కూడా జంకుతున్నారు పచ్చ తమ్ముళ్లు. మా అన్న దేవినేని అవినాష్ ని నమ్మితే ప్రాణం ఇస్తాడు ద్రోహం చేస్తే పునాదులు కదలిస్తాడు. మా అన్న ఒక్కసారి నమ్మితే, వారి కోసం ఎక్కడికైనా, ఎంత దూరమైనా వెళతాడని అందరికీ తెలిసొచ్చింది. ఒక్కసారి నమ్మితే దేనికైనా సిద్ధంగా ఉండే జగనన్న దారిలోనే పయనించే మా అవినాష్ అన్న జోలికి వస్తె దేనికైనా సిద్ధం. ఇప్పటికైనా మా దేవినేని అవినాష్ సత్తా తెలుసుకుంటారని ఆశిస్తూ ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాము” (ఇక్కడ ఒక కీలక పాయింటు.. గన్నవరం ఎమ్మెల్యే వంశీ 2020 మార్చిలో వైసీపీలో చేరారు. దేవినేని అవినాష్ 2019 నవంబరులో చేరారు. అంటే అక్కడ టీడీపీ నుండి ఎమ్మెల్యేగా వంశీ ఉండగా… చంద్రబాబు అవినాష్ ని గన్నవరం వెళ్ళమని పొగ పెట్టడమేమిటి..!?)
పైన వాక్యాలన్నీ దేవినేని అవినాష్ బ్యాచ్ చేసుకుంటున్న ప్రచారమే. దీన్ని వైసీపీలో కూడా ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. దాడి ప్లాన్ ఎవరిదీ..? పాత్ర ఎవరిది..? ఈ చిల్లర ప్రచారం ఎందుకు..? అంటూ పార్టీలో చర్చలు మొదలయ్యాయి..! నిజానికి పార్టీలో కొన్ని అంతర్గత సోర్సుల ప్రకారం… ఈ దాడి ఆకస్మికంగా ఆ రోజు ఉదయం పట్టాభి చేసిన వ్యాఖ్యలతో నొచ్చుకున్న ఎమ్మెల్సీ “లేళ్ల అప్పిరెడ్డి అనుచరులు.. అప్పిరెడ్డితో మాట్లాడారు. అందుబాటులో ఉన్న వాళ్ళతో కలిసి వెళ్లి దాడి చేయాలనుకున్నారు. దగ్గర్లో ఉన్న దేవినేని అవినాష్ అనుచరులు కొందరు, బాపట్ల ఎంపీ సురేష్ అనుచరులు కొందరు చేరుకున్నారు. అందరూ కలిసి ఈ దాడిలో తలో చేయి వేశారు. ఇది పార్టీ కోసం చేసింది, జగన్ కోసం చేసింది. ఏ ఒక్కరి క్రెడిట్, ఏ ఒక్కరి ప్రోపగాండా కోసమొ చేసిన దాడి కానీ కాదు..!
Devineni Avinash: అవినాష్ కి అంత సీన్ ఉందా..!?
నిజానికి దేవినేని అవినాష్ పూర్తిగా నాయకుడిగా ఎదగలేదు. కనీసం తనను తాను నిరూపించుకోలేదు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఇలాగే అతి ప్రచారాలు చేసుకుని.. కొడాలి నానికి సవాళ్లు విసురుతూ గుడివాడలో పోటీ చేశారు. అవినాష్ కి ఇష్టం లేకపోతే టీడీపీ యువత బాధ్యతలు తీసుకుంటారా..!? గుడివాడ నుండి పోటీ చేస్తారా..!? నాడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు భజన చేసి.. జగన్ ని తిట్టి.. వైసీపీ నేతలకు సవాళ్లు చేసిన అవినాష్ వైసీపీలో చేరిన తర్వాత తన ఉనికి కోసం తాపత్రయ పడుతున్నారు.
* విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని కుటుంబానికిసొంత వర్గం ఉంది.. సామాజిక పట్టుంది.. ఇదే నియోజకవర్గంలో వంగవీటి కుటుంబానికి గట్టి పట్టుంది. బలమైన పునాదులున్నాయి. ఈ కుటుంబాలకు మించి టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రజల్లో పట్టు పెంచుకున్నారు. 2019లో వైసీపీ గాలిలో కూడా 15 వేలకు పైగా మెజారిటీతో గెలిచారు. ఆ గెలుపులో వంగవీటి పనితనం.., దేవినేని వర్గం అన్నీ కలిసొచ్చాయి. అంతకు ముందు 2014లో కూడా గద్దె రామ్మోహన్ గెలిచారు. 2009లో ముక్కోణపు పోటీలో కొద్దిపాటి తేడాతో ఓడిపోయారు.
* ఈ నియోజకవర్గంలో కమ్మ, కాపు సామాజికవర్గాల ప్రాధాన్యత ఎక్కువ. సమంగానే ఓట్లు ఉన్నప్పటికీ.. వంగవీటి రంగ మరణం తర్వాత.. రత్నకుమారి రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసారు. ఆమెకు రెండు సామాజికవర్గాలు కలిసి పని చేశాయి. ఆ తర్వాత రాధాలో నిలకడ లేకపోవడంతో కమ్మ సామాజికవర్గ ప్రభావం ఎక్కువయింది. అందుకే 2009లో ప్రజారాజ్యం తరపున యలమంచిలి రవికుమార్, 20014, 2019లో గద్దె రామ్మోహన్ గెలుస్తూ వస్తున్నారు.
దేవినేని అవినాష్ కి ఈ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ఉంది. ఆ స్థానమే తనకు సొంత ఆస్థానంగా భావిస్తున్నారు. కానీ.. టీడీపీలో గద్దె రామ్మోహన్ స్ట్రాంగ్ గా ఉండడంతో 2019 ఎన్నికల్లో “గుడివాడ” నుండి పోటీ చేశారు. అక్కడ ఇల్లు కూడా తీసుకుని హడావిడి చేశారు. ఒకవేళ ఓడిపోయినా పార్టీ అధికారంలోకి వస్తే ఏదో పదవి ఇస్తానని చంద్రబాబు ఒప్పించారు. కానీ పార్టీ ఘోరంగా ఓడడం, తానూ గుడివాడ నుండి ఓడిపోవడంతో అవినాష్ ఆలోచనలో పడ్డారు.. తూర్పు నియోజకవర్గం దక్కలేదు.. గుడివాడలో కొడాలి నానిని ఎదుర్కొని ప్రతిపక్షంలో నిలదొక్కుకోవడం అసాధ్యం.. అందుకే వైసీపీలోకి వెళ్తే తూర్పు బాధ్యతలు దక్కుతాయి, అధికారం అనుభవించవచ్చు అనే ఆలోచనతో వచ్చారు. జగన్ పై వీరాభిమానమో.., వైసీపీ అంటే బీభత్సమైన ప్రేమతోనో అవినాష్ పార్టీ మారలేదు. తన కంఫర్ట్ చూసుకుని ఇటు వచ్చారు. ఈ నియోజకవర్గానికి అవసరం ఉండడంతో అటు కొడాలి నాని కోరిక/ సూచన మేరకు సీఎం జగన్ అవినాష్ ని పార్టీలోకి తీసుకుని.., తూర్పు బాధ్యతలు ఇచ్చారు. నిజానికి పై మెసేజ్ లో అవినాష్ బ్యాచ్ ప్రచారం చేస్తున్నట్టు అవినాష్ కి గన్నవరం వెళ్ళమనలేదు. టీడీపీలో పొగ పెట్టలేదు. తన స్థాయికి మించిన పదవులిచ్చారు.
డామినేషన్ కోసం.. తాపత్రయం..!
వైసీపీలో చేరినప్పటి నుండి అవినాష్ విపరీతమైన హడావిడి చేస్తున్నారు. తన వర్గం కూడా అతి ప్రచారం చేస్తూ వస్తుంది. తూర్పు నియోజకవర్గంలో బొప్పన భావన కుమార్ వర్గం బలంగా ఉండడం.., ఇటు వంగవీటి రాధా ఏ రోజైనా మళ్ళీ వైసీపీలోకి వస్తే తన సీటు గల్లంతేనని భయంతో ఉన్నారు. అందుకే విజయవాడ సిటీలో తాను గొప్ప లీడర్.. తనకు పట్టు ఉంది.. తనకు తిరుగులేదు… సామాజికవర్గానికి బ్రాండ్ అంబాసిడర్ అనేలా నిరూపించుకునే పనిలో సోషల్ మీడియా.., గోడ మీడియాపై హడావిడి చేస్తుంటారు.. ఈ నేపథ్యంలోనే మొన్న టీడీపీ ఆఫీసుపై దాడిలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వర్గానిదే ప్రధాన పాత్ర అయినప్పటికీ.. అవినాష్ వర్గం కూడా పాల్గొంది. పనిలో పనిగా… ఇది మొత్తం తన పనే అన్నట్టు.., తామే చేయించినట్టు.. అవినాష్ వర్గం ప్రచారం మొదలు పెట్టింది..! మరి దీనికి జగన్ నమ్మేసి అవినాష్ కి బీభత్సమైన మార్కులు వేసేస్తారా..!? చూద్దాం..!!