చంద్రబాబు లేఖకు కౌంటర్
ఏపీలో ఫోన్ ట్యాపింగ్ రాజకీయాలు తారా స్థాయికి చేరాయి. ఏపీలో న్యాయ వ్యవస్థతో పాటుగా కొందరిని లక్ష్యంగా చేసుకొని ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారంటూ చంద్రబాబు అనుకూల మీడియాలో కధనాలు వచ్చాయి. దీని పైన సీరియస్ అయిన ఏపీ ప్రభుత్వం ఆ కధనాలు ప్రచురించిన మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు జారీ చేసింది. ఇక, ఇదే అంశం పైన చంద్రబాబు నేరుగా ప్రధానికి లేఖ రాసారు. ప్రధానిని ప్రశంసిస్తూ ఏపీ ప్రభుత్వం పైన తీవ్ర ఆరోపణలు చేసారు. దీంతో..ప్రభుత్వం నుండి స్పందన మొదలైంది. ఈ వ్యవహారం పైన ధీటుగా తిప్పి కొట్టాలని నిర్ణయించింది. ఒక వైపు రాజకీయంగానే సమాధానం ఇస్తూ .. మరో వైపు దీనిపైన చేసే విచారణకు మీ వద్ద ఉన్న సమాచారం ఇవ్వాలని కోరుతూ డీజీపీ నేరుగా చంద్రబాబుకు లేఖ రాసారు. ఇదే సమయంలో బీజేపీ నేతలు సైతం టీడీపీ నేతలకు షాక్ ఇచ్చారు. మోదీని ప్రసన్నం చేసుకొనేందుకే చంద్రబాబు లేఖ రాసారని వ్యాఖ్యానించారు. డీజీపీ నేరుగా చంద్రబాబుకు లేఖ రాయటాన్ని బీజేపీ మాస్టర్ స్ట్రోక్ గా కామెంట్ చేసింది.
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సీరియస్..
ఏపీలో కొద్ది రోజులుగా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని మొదలైన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల పైన ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారం హైకోర్టు ముందుకు వెళ్లటంతో కోర్టు ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇదే సమయంలో చంద్రబాబు నేరుగా ప్రధానికి లేఖ రాసి అందులో ఏపీలో కొందరిని లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని..ప్రభుత్వం పైన కేంద్ర సంస్థలతో విచారణ చేయించాలని కోరారు. దీని పైన రాజకీయంగా వైసీపీ కౌంటర్ ఇచ్చింది. హోం మంత్రి సుచరిత సైతం ఈ ఆరోపణలను తిప్పి కొట్టారు. డీజీపీ నేరుగా చంద్రబాబుకు లేఖ రాసారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్-1885, ఐటీ యాక్ట్-2000 కింద ఎవరు ఉల్లంఘనకు పాల్పడినా తామ ఉపేక్షించేది లేదని స్పష్టం చేసారు. అదే సమయంలో ఈ వ్యవహారంలో సాక్ష్యాధారాలు ఉంటే తమకు ఇవ్వాలని కోరారు. రాజ్యంగాన్ని..చట్టాలను పరిరక్షించటానికి లాము ఎప్పుడూ సిద్దంగా ఉంటామని..అవసరమైతే ఎలాంటి కఠిన చర్యలకైనా సిద్దమనని డీజీపీ తేల్చి చెప్పారు. ఈ అంశం పైన పూర్తి స్థాయిలో దర్యాప్తుకు సిద్దమని ప్రకటించారు..చంద్రబాబు ఈ దర్యాప్తుకు సహకరించాలని కోరారు.
మాస్టర్ స్ట్రోక్ ..బీజేపీ నేతల కామెంట్స్
చంద్రబాబు ప్రధానికి రాసిన లేఖ పైన వైసీపీ నేతలు సహజంగానే సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇక, ప్రధానిని ప్రసన్నం చేసుకొనేందుకే ఈ లేఖ రాసారంటూ బీజేపీ నేతలు కౌంటర్లు మొదలు పెట్టారు. తమ వద్ద ఆధారాలు ఉంటే టీడీపీ నేతలు బయట పెట్టాలని బీజేపీ నేతలు సైతం డిమాండ్ చేయటం టీడీపీ అంచనా వేయలేదు. చంద్రబాబు అనుకూల మీడియాలో కధనాలు రావటం..వాటిని అందిపుచ్చుకొని టీడీపీ నేతలు రాద్దాంతం చేయటం పరిపాటిగా మారిందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికే దీని పైన విచారణ చేయాలని.అ.వసరమైతే అందులో చంద్రబాబు వద్ద ఉన్న సమాచారం సైతం సేకరించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే..విచారణకు సహకరించాలని కోరారు. ఇక, డీజీపీ నేరుగా చంద్రబాబుకు లేఖ రాయటం పైన బీజేపీ నేత ..మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ క్రిష్ణారావు స్పందించారు. ఈ లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి చంద్రబాబుకు మాస్టర్ స్ట్రోక్ గా అభివర్ణించారు. దీనిని అసలు ఊహించలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరటంతో..ఇది మొత్తంగా ఎటువైపు టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.