ఎక్కడో అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే ఇంటికి ప్రస్తుత ఎమ్మెల్యే కత్తి పట్టుకుని వెళ్లొచ్చు..! అది వారి మధ్య తరతరాల గొడవ కావచ్చు గాక..!! కానీ @
ఎక్కడో కడప జిల్లా పొద్దుటూరులో ఒక చేనేత వర్గీయుడిని స్థానిక ఎమ్మెల్యే మనుషులు ఎవరో కొట్టి చంపేయొచ్చు..! అది అక్కడి రాజకీయ వివాదం కావచ్చు గాక..! కానీ @
ఎక్కడో విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీ రాముడి విగ్రహం తల తీసేసి పక్కనున్న కోనేటిలో పడేసేయొచ్చు..! అది అక్కడ ఎవడో తుంటరి వాడు చేసే వెధవ పని కావచ్చు గాక..! కానీ @
డాక్టర్ సుధాకర్ అనే సగం పిచ్చోడిని నడిరోడ్డుపై షర్టు లేకుండా చేసి అరెస్టు చేసినా.. అంతర్వేది రథం కాల్చేసినా.., ఏదైనా కావచ్చు..! కానీ @ ఇది నీ రాష్ట్రం, నీ రాజ్యం, నీ పరిపాలన..!! చట్టం ఎక్కడుంది..? శాంతి భద్రతలు ఎక్కడున్నాయి..? సోషల్ మీడియా.., రాజకీయ చైతన్యం ఇంత చురుకుగా ఉన్న ఈ రోజుల్లో కూడా గుడ్డిగా అధికార పార్టీ లోపాలు, తప్పులు కనిపిస్తుంటే ఎవరూ ఏమి మాట్లాడకుండా..? ఎవరూ ఏమి అనకుండా..? చివరికి నిన్ను నిందించకుండా ఎందుకు ఉంటారు..? జగనూ చూస్తున్నావా..!? ఇది నీ రాజ్యమే, నీ రాష్ట్రమే..!!
మంచి తీసుకుని చెడు వదిలేస్తావా..!?
జగనన్న ఇళ్ల పట్టాలు.., జగనన్న తోడు.., జగనన్న విద్యాకానుక.., జగనన్న విద్యాదీవెన.., జగనన్న చేనేత నేస్తం.. ఇలా ప్రతీ పథకానికి జగనన్న అని నామాన్ని తగిలించుకోవడం తప్పు కాదు. అంటే గ్రామ స్థాయిలో.., క్షేత్రస్థాయిలో అంతిమ లబ్ధిదారుడికి కూడా ఇది “మా సీఎం జగన్” ఇచ్చిన కానుక అని తెలియాలి. అందుకే పథకాలను ఆ పేర్లు, ఆ ఫోటోలు. ఇది ఏమాత్రం తప్పు కాదు..! కాకపోతే ఇదే తరహాలో చెడు కూడా ఆలోచించాలిగా..! రాష్ట్రంలో ప్రతీ ఊరిలో, ప్రతీ ఇంటిలో నీ ప్రభుత్వ మంచి అందుతున్నప్పుడు…, రాష్ట్రంలో ఏం జరిగినా.. ఎక్కడ ఏ నరుకుళ్లు.., దేవుడి విగ్రహాల ధ్వంసాలు.., దాడులు జరిగినా అది కూడా జగన్ బాధ్యతే అవుతుందిగా. మంచి మాత్రమే కాదు, చెడు కూడా సీఎం ఖాతాలోనే వేయాలి, ప్రజలు కూడా వేస్తారు. అందుకే నీ రాజ్యంలో ఈ ఘోరాలు చూసి, అప్రమత్తం కాకపోతే నువ్వు ఇస్తున్న “సంక్షేమ ఆనందాలు ఆవిరిలో కలిసిపోయి.. ఈ ఘోరాలు తలదన్నేస్తాయి.., ఈ దారుణాలు ఆవహిస్తాయి”
ప్రతిపక్షాన్ని తట్టి లేపుతున్నట్టుగా..!!
ప్రతిపక్షం పడుకుంది. దాన్ని శాశ్వతంగా పడుకునేలా చేయొచ్చు. ఆ అవకాశం ఓటర్లు జగన్ కి ఇచ్చారు. కానీ ఆ పడుకున్న ప్రతిపక్షాన్ని నిద్రలేపి పోరాటాలకు ఉసిగొల్పుతున్నది అధికార పక్ష నాయకులే. వారికి పని కల్పిస్తున్నది ఈ వైసీపీ ఎమ్మెల్యేలే. ఈ ప్రభుత్వ వైఫల్యాలే. అక్కడున్నది చంద్రబాబు.., అతని డాబు మీడియా. చీమని చాప అంతగా చేసి చూపించగల దిట్టలు. అటువంటి వారిని ప్రత్యర్థులుగా పెట్టుకుని కూడా ఈ దారుణాలు ఎలా జరగనిస్తున్నట్టు..? అప్పుడెప్పుడో ఆరు నెలల కిందట జరిగిన ఆలయం దాడి ఘటనలో మొదటి సారి జరిగిన ఘటనలో నిందితున్ని పట్టుకుని.., గట్టిగా శిక్షిస్తే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇలా జరిగేవి కాదు. నేడు విజయనగరం ఘటన మామూలుది కాదు. ఇక్కడ బీజేపీ చేవలేక.., తొత్తులా ఉంది కాబట్టి పర్వాలేదు.. లేకపోతే విజయనగరం జిల్లా రామతీర్ధం ఘటన ఇప్పటికే జాతీయస్థాయిలో మార్మోగేది. ఆ రిపబ్లిక్ టీవీ కూడా లైవ్ లో చూపించేది. ఈ ఘటనలు ఏవైనా.., నీ నాయకులే చేస్తున్నా వారికి సంతోషాన్ని ఇస్తున్నా… వీటి దుష్ఫలితాలు అనుభవించాల్సింది నువ్వే జగనూ..! ఇది నీ రాజ్యం, ఇది నీ రాష్ట్రం, వీళ్ళు నీ జనం..!!