జూనియర్ కు కలిసొచ్చిన కొత్త జిల్లాల నిర్ణయం కొత్త మంత్రుల ఎంపికలో అసలు ఏం జరిగింది…!
ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన 15 నెలల తరువాత తొలి కేబినెట్ విస్తరణ జరిగింది. సామాజిక సమీకరణాల్లో భాగంగా తొలి సారి గెలిచిన ఇద్దరికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఇద్దరు బీసీల స్థానంలో తిరిగి బీసీలతోనే ఆ స్థానాలను భర్తీ చేయాలని తొలుత ముఖ్యమంత్రి నిర్ణయించారు.
అందు కోసం ఆయన కొందరి పేర్లను పరిశీలించినట్లు తెలిసింది. కానీ, సీఎం కోరుకున్న వారిలో ఒకరు ప్రస్తుతం కీలకమైన పదవిలో ఉన్నారు. ఆయన అదే జిల్లాకు చెందిన సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా నిలవటంతో..ఆ ప్రముఖుడి పేరు చివరికి మారిపోయి..జూనియర్ కు అవకాశం దక్కింది. ఇద్దరు మంత్రులను రాజ్య సభకు పంపిన తరువాత ముందుగా ముఖ్యమంత్రి కేబినెట్ లోకి తీసుకోవాలనుకున్న వారి పేర్లు చివర్లో ఏ రకంగా మారాయి. అసలు వైసీపీ అధినాయకత్వం వద్ద కేబినెట్ విస్తరణకు ముందు జరిగిన చర్చ ఏంటి. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ఇద్దరు మంత్రులకు ఏ రకంగా అవకాశం దక్కింది. మొత్తంగా..అసలు ఏం జరిగింది…
ఆ వ్యాఖ్యలే ఆయనకు అడ్డుగా నిలిచాయా…!!
సీఎం జగన్ తన కేబినెట్ లో ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్..మోపిదేవి వెంకట రమణను రాజ్యసభకు ఎంపిక చేసిన సమయంలోనే వారిద్దరిలో స్థానంలో ఎవరిని నియమించాలనే దాని పైన ఒక అంచనాకు వచ్చారు. రకరకాల పేర్లు తెర మీదకు వస్తుండటంతో ఆ ఇద్దరూ బీసీలే కావటంతో తిరిగి బీసీలతోనే ఆ రెండు స్థానాలు ఎంపిక చేయాలని డిసైడ్ అయ్యారు. అందు కోసం ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో కీలక ప్రతిపాదనలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అందులో భాగంగా..ప్రస్తుత స్పీకర్ తమ్మినేనిని కేబినెట్ లోకి తీసుకోవాలని భావించారని..డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కోన రఘపతిని స్పీకర్ గా ప్రమోట్ చేయాలని భావించినట్లు విశ్వసనీయ సమాచారం. దీని ద్వారా మోపిదేవి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లకు చెందిన వారికి స్పీకర్ పదవి ఇచ్చి…శ్రీకాకుళం..తూర్పు గోదావరి జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి తొలి చర్చల్లో వ్యక్తం చేసిన అభిప్రాయంగా తెలిసింది. కానీ, అదే సమయంలో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాలను పెంచాలనే చర్చ రావటం..ఆ సమయంలో ధర్మాన ప్రసాద రావు అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేయటం..దానికి అదే సభలో ఉన్న తమ్మినేని సైతం మద్దతిచ్చే విధంగా వ్యాఖ్యానిస్తూనే..ముఖ్యమంత్రికి మద్దతుగానూ సర్ధిచెప్పే ప్రయత్నం చేయటం పైన చర్చ సాగింది. దీంతో..మంత్రివర్గ విస్తరణకు కొద్ది రోజుల ముందు జరిగిన ఈ పరిణామంతో కేబినెట్ కొత్త బెర్తుల సమీకరణాలు మారిపోయినట్లు పార్టీ ముఖ్యులు ఆఫ్ ది రికార్డు చెబుతున్నారు.
చివరి నిమిషంలో అప్పలరాజుకు ఛాన్స్..
తొలి నుండి తనకు అండగా నిలిచిన ధర్మాన క్రిష్ణదాస్ కు ముఖ్యమంత్రి జగన్ తన తొలి కేబినెట్ లోనే మంత్రిగా అవకాశం కల్పించారు. ధర్మాన ప్రసాద రావు సీనియర్ అయినా…క్రిష్ణదాస్ కే ప్రాధాన్యత లభించింది. ఇక, శ్రీకాకుళం జిల్లాలో కళింగ సామాజిక వర్గం బలంగా ఉండటంతో ఆ వర్గానికి చెందిన తమ్మినేనికి స్పీకర్ హోదా కల్పించారు. కానీ, ఆయనను కేబినెట్ లోకి తీసుకొని..పిల్లి బోసు నిర్వహించిన శాఖలను ఇవ్వాలని తొలుత చర్చ జరిగినట్లు సమాచారం. ఇక, గుంటూరు జిల్లాకు స్పీకర్ పదవి ఇస్తుండటంతో..శ్రీకాకుళంకు మంత్రి పదవి..పిల్లి స్థానంలో వేణు లేదా పొన్నాడ సతీష్ పేర్ల మీద చర్చ జరిగింది. అదే సమయంలో ధర్మాన సోదరుల మధ్య సైతం కోల్డ్ వార్ ఉన్నట్లు జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోది. దీంతో..ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యల పైన ఆగ్రహంగా ఉన్న సీఎం..ధర్మాన క్రిష్ణదాస్ కు ప్రమోషన్ ఇచ్చారనే ప్రచారం నడుస్తోంది. ఇక..చివరి నిమిషంలో సమీకరణాలు మారి..మొత్తంగా గతంలో పని చేసి రాజ్యసభకు ఎంపికైన వారి సామాజిక వర్గాలకే తిరిగి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో..జూనియర్ అయినా డాక్టర్ అప్పలరాజుకు గెల్డెన్ ఛాన్స్ తగిలింది. అదే విధంగా గుంటూరు జిల్లాకు స్పీకర్ పదవి ఆ విధంగా నిలిచిపోయిందనే చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.