మొహమ్మద్ సనావుల్లా విషయంలో మనం సంతోషించాలి. పోలీసుల అదుపు నుండి అతను విడుదల అయ్యాడు. కాకపోతే అతనికి లభించింది కేవలం మధ్యంతర జామీనే. అతని బయోమెట్రిక్ వివరాలు అస్సాం పోలీసులు తీసుకున్నారు. అలాగే కామరూప్ దాటి బయటకి వెళ్ళటానికి అతనికి అనుమతి లేదు.
తన గతం వేరే విధంగా ఉండి ఉండుంటే మొహమ్మద్ సనావుల్లాకి ఈ మాత్రం స్వేచ్ఛ కూడా లభించి ఉండేది కాదు. మొహమ్మద్ సనావుల్లా భారత సైన్యంలో పని చేశాడు. ఆగస్ట్, 2017లో ఎలెక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ కోర్ సుబేదార్గా పదవీ విరమణ పొందాడు. నాయబ్ సుబేదార్ ర్యాంకు అధికారిగా రెగ్యులర్ ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ అధికారిగా పదోన్నతి పొందడంతో రాష్ట్రపతి ప్రశంసా పత్రం కూడా లభించింది.
అయినా కూడా అతను దేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుడు అని నిర్ధారించి అతని సీనియర్లే సనావుల్లాను అరెస్ట్ చేశారు. ఒక ఆర్మీ మనిషిగా నియమ-నిబంధనలు తెలిసిన మొహమ్మద్ సనావుల్లా వారినేమీ తప్పుపట్టటం లేదు. విదేశీయువ ట్రిబ్యునల్ ఉత్తర్వులు రావటంతో వారు కేవలం “తమ పనిని నిర్వర్తిస్తున్నారు” అన్నది మొహమ్మద్ సనావుల్లా అభిప్రాయం.
“ జైలు గేట్లనుంచి లోపలికి వెళుతున్నప్పుడు ఏడుస్తూనే ఉన్నాను. “మూడు దశాబ్దాలు పాటు జమ్మూ-కశ్మీర్ లోని కుప్వారా వాస్తవాధీన రేఖతో సహా చాలా ప్రదేశాలలో మాతృభూమి సేవలో ఉన్న తర్వాత కూడా నేను ఏమి పాపం చేశానని ఒక విదేశీయుడి లాగా నన్ను అరెస్ట్ చేశారు?’” అంటూ ఈ మాజీ సుబేదార్ తాను అనుభవించిన నరకయాతన గురించి చెప్పాడు.
జమ్మూ-కశ్మీర్ లోనే కాకుండా మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, దిల్లీ, పంజాబ్, ఆంధ్ర ప్రదేశ్, అస్సాం, మణిపూర్ లలో కూడా పనిచేశానని చెప్పాడు. “ సరిహద్దుల దగ్గర ధైర్యంగా నిలబడి నేను నా దేశాన్ని కాపాడాను. నాకు నా దేశం అంటే ప్రేమ. నేను భారతీయుడిని. నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది.” అని చెప్పారు.
ఆయన ‘భారతీయత’ అనే పదం విరివిరిగా వాడటం మనకి స్పష్టంగా గోచరిస్తుంది. బహుశా మొహమ్మద్ సనావుల్లా లాంటి పేరు పెట్టుకున్నాక ఈరోజుల్లో అలా విరివిరిగా వాడటం అవసరమేమో.
మహమ్మద్ సనావుల్లాకు సైన్యంలో పనిచేసిన నేపధ్యం లేకుంటే ఏమయిఉండేది?
షరతులతో కూడకున్న జీవితం గడపాల్సి వచ్చినా మొహమ్మద్ సనావుల్లా అదృష్టవంతుడు అనే చెప్పాలి.
షఫీ మొహమ్మద్ అబ్బాసీ, అతని కుటుంబసభ్యులు పరిస్థితి కూడా ఇదే. ఉత్తర ప్రదేశ్ లోని ఆలీఘడ్ జిల్లాలో పూజా చౌహాన్ సమయానికి, ధైర్యంగా ఆదుకోవటంతో షఫీ మొహమ్మద్ అబ్బాసీ, అతని కుటుంబసభ్యులు ప్రమాదం నుండి బయటపడ్డారు. హర్యానాలోని బల్లబ్గఢ్ నుండి వాహనంలో బయలుదేరిన షఫీ మొహమ్మద్ అబ్బాసీ, అతని కుటుంబసభ్యుల మీద మోటార్ సైకిళ్ళపై వచ్చి దాడి చేస్తున్న హిందువుల నుండి పూజా చౌహాన్ కాపాడింది. అలీఘడ్ దగ్గరలోని తప్పాల్ లో రెండు సంవత్సరాల పాప హత్యోదంతం తరువాత ఈ దాడి చోటుచేసుకుంది. ఆ వాహనంలోని మహిళలు బురఖా వేసుకోవటంతో వీళ్ళు ముస్లింలు అని ఆ హిందువులకి తెలిసిపోయింది.
“తన వ్యాన్ లో నుండి బయటకి వచ్చి మాకు, ఆ దాడి చేస్తున్న వారికి మధ్య నా కూతురు లాంటి పూజ కనుక అడ్డుపడకుండా ఉండుంటే మమల్ని చంపేసి ఉండేవారు.” అని అబ్బాసీ పాత్రికేయులతో అన్నాడు.
ఈ ఉదంతం గురించి రాస్తున్న ఒక స్నేహితుడు అబ్బాసీ అదృష్టం (కిస్మత్) ఇది అని అన్నాడు. ఈ ప్రపంచంలో సనావుల్లా లాంటి పేర్లు ఉన్నవారికి, ఆ వాహనంలో మహిళలు ధరించిన బట్టలు లాంటి బట్టలు వేసుకునేవారికి ప్రమాదం ఎదురైనపుడు వారిని కాపాడేందుకు మిగిలింది ఇక ఈ కిస్మత్ఏనా అని అనిపించక మానదు.
ముప్పై సంవత్సరాల ఆర్మీ అనుభవం లేకపోతే సనావుల్లా పరిస్థితి ఏమయ్యి ఉండేది? తన జీవితాన్నే పణంగా పెట్టిన పూజా లాంటి వారు లేకపోతే అబ్బాసీ పరిస్థితి ఏమయ్యి ఉండేది?
ఆలీఘడ్లో జరిగిన రెండేళ్ల పాప హత్య కేసులోని వివరాలు అందరికీ తెలియచేయటానికి శ్రమ తీసుకున్న ఆకాష్ కుల్హరి లాంటి పోలీసు అధికారులు లేకపోతే మన పరిస్థితి ఏమిటి? హిందూ మత నాయకురాలు ప్రాచి ఆ రోజు తప్పాల్కి వచ్చిన రోజు ఆవిడని అక్కడికి అనుమతించకుండా నిలువరించిన పోలీసులు అ ఆరోజు అక్కడ లేకపోతే పరిస్థితి ఎలా ఉండేది? దాద్రీలోని ప్రజల లాగా అక్కడ హిందువులకి కూడా తమ ‘నిజమైన’ కోపాన్ని ప్రదర్శించే అవకాశం ఇచ్చిఉంటే పరిస్థితి ఎలా ఉండేది?
ఏమయ్యుండేది, ఎలా ఉండేది అన్న ఈ ప్రశ్నల జాబితా అనంతమైనది.
పూజా చౌహాన్ సాహసోపేతమైన జోక్యం గురించి చదివాక నా స్నేహితులతో అన్నాను: ముస్లింలు ప్రయాణం పెట్టుకుంటే తమతో పాటు ఒక ధైర్యవంతమైన హిందూ మహిళని తోడు ఉంచుకోవాలి అనే ట్రావెల్ ఎడ్వైజరీ జారీ చెయ్యవలసిన అవసరం ఉంది.
అప్పుడు ఒక స్నేహితుడు అన్నాడు- అప్పుడు ఆ ముస్లిం సంగతి ‘లవ్ జిహాద్’ పేరుతో తేలుస్తారు.
ఆ మిత్రుడు వేసిన జోకు చాలా క్రూరంగా అనిపించవచ్చు. కానీ ఇది నిజంగా జరిగే అవకాశం ఉందన్న విషయం మమ్మల్ని కలవరపరించింది. మతాంతర వివాహాల పట్ల పెళ్ళిళ్ళు నమోదు చేసే రిజిస్టార్లకి అంత సానుకూలత ఉండదన్న విషయం తెలుసు. ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుని, ఇస్లాం మతం స్వీకరించిన హిందూ యువతి హదియ ఏదో తప్పు చేసింది అని ఈ దేశపు కోర్టులు కూడా ఏ విధంగా నమ్మాయో మనకి తెలుసు.
ముస్లిం యువకుడిని వివాహమాడి మతం మార్చుకున్నందుకు హదియా ఎంత కష్టం అనుభవించిందీ చూశాం
ఒక ముస్లిం యువతి కనుక ఉంటే అదేమన్నా రక్షణగా ఉంటుందా అని నేను నా స్నేహితులు ఆలోచించాము. కానీ ముస్లింలు ఎవరైనా సరే తమ సంఖ్యని పెంచుకోవటానికి ఏమైనా చేస్తారు అనే ఒక కుట్రపూరిత వాదన రాగలదు అని వెంటనే మాకు తట్టింది.
అంటే ముస్లింల విషయంలో ఎలాంటి ముందు జాగ్రత్తలూ పనిచెయ్యవన్న మాట, తమ కిస్మత్ తప్ప
సనావుల్లా గురించి చదివినవారికి ఇంకొక సందేహం వచ్చి ఉంటుంది- సనావుల్లా అనే మనిషి మన శత్రు దేశం తరుపున ఈ దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి భారత సైన్యంలో చేరాడేమో, ఎవరికి తెలుసు. ఈ వార్తలు చదివేవారికి మానవత్వంతో పనిలేదు. కావలసిందల్లా కఠినమైన పరీక్షలే.
ఏమయ్యుండేది, ఎలా ఉండేది అనే ప్రశ్నలు వేసుకుంటూ ఉండొచ్చు. దానివల్ల ఈ దేశపు ముస్లింలకి నయాపైసా లాభం లేదు.
ఒకసారి ఓ చర్చలో పాత్రికేయ మిత్రుడోకడు అన్నాడు ఈ దేశంలోని ముస్లింలు, ఇతర మైనారిటీలకు తమ భద్రత, గౌరవం కోసం హిందువుల మంచితనం మీద ఆధారపడాల్సిన అగత్యం ఉండకూడదు.
మరైతే హిందువుల్లో తమ పట్ల వచ్చిన వివక్ష తొలగేవరకు ముస్లింలు వేచి చూడాలా? ముస్లిం వ్యతిరేక భావనతో పెద్ద సంఖ్యలో హిందువులు ఉన్నపుడు వారితో సహజీవనం చేయాల్సిన ముస్లింల పరిస్థితి ఏమిటి అనే సందేహం కూడా కూడా రాకమానదు.
పౌరులందరూ సమానులేనన్న భారత రాజ్యంగ సూత్రం ప్రకారం ముస్లింలకు భద్రత, గౌరవం సంక్రమించాయి తప్ప హిందువుల మంచితనం మీద ఆధారపడి కాదని మనకు తెలుసు. మరి రాజ్యంగానికే తిలోదకాలు ఇస్తే? మనం ఇప్పటికే ఆ దశకు చేరుకున్నామా లేక అందుకు ఇంకా కొన్నాళ్ల వ్యవధి ఉందా?
అపూర్వానంద్
వ్యాసకర్త ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపకుడు