మొదట, హాని చెయ్యవద్దు ( Primum non nocere)- డాక్టర్ అవ్వటానికి మూల సూత్రం అయిన ఈ మాట వైద్య కళాశాలలలో తరుచూ వినపడుతుంది.
కోల్కతా నగరంలోని వైద్య కళాశాలలలో నేడు నడుస్తున్న ‘రక్షకులని రక్షించండి’ ( Save the Saviours) ఉద్యమంలో ఇది అప్రకటిత నినాదం.
కాకపోతే ఈ సిద్ధాంతాన్ని ఇప్పుడు రోగులకి అన్వయించి రోగులు ఎటువంటి దుశ్చర్యలకి పాల్పడకూడదు అని ఇక్కడ సమ్మెలో ఉన్న వైద్యులు రోగులకి ఉద్భోదిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వైద్యుల మీద జరుగుతున్న దాడుల నేపధ్యంలో వైద్యులకి ఇది అవసరం.
జూన్ పదవ తేదీన కోల్కతా లోని నీల్ రతన్ సర్కార్ వైద్య కళాశాలలోని హౌస్ సర్జన్ పరిబాహ ముఖర్జీ మీద జరిగిన దాడి, బుర్ద్వాన్ వైద్య కళాశాలలో విద్యార్ధులు, వైద్యుల మీద కురిసిన రాళ్ళ వర్షం నేపధ్యంలో వైద్యాలయాలలో వైద్యులకి రక్షణ అంశం ప్రాముఖ్యతని సంతరించుకుంది.
ఇలా జరగటం ఇదే మొదటి సారి కాదు.
ఈ శతాబ్దం మొదటి నుండి వైద్యుల మీద దాడులు పెరుగుతూ వస్తున్నాయి. భారతదేశంలో పరిస్థితి మరింత దిగజారింది.
ఇటువంటి సంఘటనలు ఎక్కువగా పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరాది రాష్ట్రాలలో చోటుచేసుకుంటున్నాయి. 2017లో ఆర్.జి.కర్ వైద్య కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్ధి శుభదీప్ మీద రోగి బంధువులు దాడి చేశారు. ఇంకొక సంఘటనలో పశ్చిమ బెంగాల్ లోని దేబ్రాలో ఒక స్థానిక నర్సింగ్ హోంలో స్థానిక గూండాలు మలం పూశారు.
వైద్య వర్గాలలో తమవైపు నుండి తప్పేమన్నా జరుగుతున్నదా అనే చర్చ నడుస్తున్నది. వైద్య విద్యలో విలువలు, కమ్మ్యూనికేషన్, ఫిర్యాదులు, సహానుభూతి గురించిన పాఠాలు ఉండటంతో వైద్య వర్గాలు ఈ విషయాలని చర్చించడం వింతేమి కాదు.
ఎన్ఆర్ఎస్ వైద్య కళాశాలలో జరిగిన సంఘటనలు లాంటివి తమలో తప్పులు ఏమైనా ఉన్నాయా అన్న మీమాంసంలో ఉన్న వైద్య వర్గాలని మరింత అయోమయంలోకి నెడుతున్నాయి. అక్కడున్న వైద్య విద్యార్ధులు చెప్పినదాని ప్రకారం పరిబాహ ముఖర్జీ, యాష్ టెక్వాని ఆ రోజున ఆ రోగికి వైద్యం చేసిన వైద్యులు కాదు. తమకి కలిగిన బాధకి ఎవరు కనిపిస్తే ఆ డాక్టర్ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనే పద్ధతిలో చేసిన దాడి ఇది.
ఈ దేశంలో అనేక చోట్ల జరుగున్నట్టే ఇది కేవలం ఒక గుంపు ఉన్మాదపు చర్య.
మొదట వైద్యులు పొరపాటు చెయ్యరు అనే భావనని తొలగించాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా డాక్టర్లు కేవలం తమ శక్తి మేరకే చెయ్యగలరు, చనిపోయిన వ్యక్తికి ప్రాణం పొయ్యలేరు అనే విషయాలని బిగ్గరగా చెప్పవలసిన అవసరం ఉంది.
ఇలాంటి పరిస్థితులు రాకుండా చెయ్యాలన్న చిత్తశుద్ధి రాజకీయ నాయకులకు లేకపోవడం, విషయం ప్రాముఖ్యత గురించి సరిగా అర్ధం చేసుకోలేకపోవడం వల్ల కాబోలు మీడియా కూడా దీని గురించి మాట్లాడింది తక్కువ. ఫలితంగా డాక్టర్ల సమస్య మరింత జటిలంగా మారింది. అంతేకాక ఎటువంటి నియమ-నిబంధనలు లేని గుంపుకి ఇది మరింత ప్రోత్సాహం అందించినట్టు అయ్యింది.
ఇందులో కొన్ని లోతైన విషయాలు కూడా చర్చించాల్సినవి ఉన్నాయి.
మొదటగా, తగినన్ని వసతులు లేకపోవడంతో, అవసరమైన సంఖ్యలో డాక్టర్లు లేకపోవడంతో సరైన చికిత్స అందచెయ్యలేని పరిస్థితి. పాశ్చాత్య దేశాలలో అత్యవసర పరిస్థితికి స్పెషలిస్టు వైద్యులు ఉంటారు. ఎమర్జెన్సీ రూంలో రోగులని మొదట వీళ్ళే చూస్తారు.
దేశంలోని చాలా ప్రభుత్వ వైద్యాలయాలలో ఇలాంటి పరిస్థితే కనబడుతుంది
ఇక్కడ మాత్రం, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో, ఆ బాధ్యత అంతా చదువు ముగిసిన తర్వాత ఒకటి రెండేళ్ల అనుభవం ఉన్న జూనియర్ డాక్టర్ల మీదనో, లేక హౌస్ సర్జన్ల మీదనో ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది హౌస్ సర్జన్లకి స్వతంత్రంగా ప్రాక్టీస్ చేసే అవకాశం లేదన్న విషయం. వాళ్ళు ఇంకా నేర్చుకునే ప్రక్రియలోనే ఉన్నారు. ఇప్పుడు ఎన్ఆర్ఎస్ వైద్య కళాశాలలో నడుస్తున్న ‘రక్షకులని రక్షించండి’ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నది వీరే. కుర్ర డాక్టర్లే అందరికీ తమ అక్కసు వెళ్లకక్కటానికి అనువుగా కనిపిస్తారు.
రెండవది, వైద్య సేవలపై సామర్ధ్యానికి మించిన బరువు. కోల్కతాలోనయినా, ఈ దేశంలో ఎక్కడయినా డాక్టర్లు ఎక్కువ గంటలు పని చెయ్యటం అనేది సర్వసాధారణం. ప్రైవేటు ఆసుపత్రులతో పోల్చుకుంటే ప్రభుత్వ ఆసుపత్రులలో రోగుల సంఖ్య ఎక్కువ. చాలా మంది కింద స్థాయి ఆరోగ్య కేంద్రాల నుండి వస్తారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే చాలా మంది రోగులకి వైద్యం చెయ్యడం అనేది జూనియర్ డాక్టర్లకి సర్వసాధారణం.
జిల్లా స్థాయిలో మరిన్ని తృతీయ స్థాయి ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చెయ్యడం ద్వారా ఈ పని భారాన్ని తగ్గించే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలది. వైద్య సేవల మీద డబ్బులు ఖర్చుపెట్టడం ఇష్టం లేని రాజకీయ అలసత్వం కారణాన ఒక పక్క రోగులకి సరైన సేవలు అందటం లేదు, మరొక పక్క ఉన్న కాసిన్ని ఆరోగ్య కేంద్రాలకే అందరూ రావలసిన పరిస్థితి.
మూడవది, డాక్టర్ల పాత్ర గురించి జనాలలో ప్రచారం చెయ్యవలసిన అవసరం ఉంది. డాక్టర్లు కూడా మనుషులే. వాళ్ళు కూడా పొరపాట్లు చేస్తారు. డాక్టర్ల నుంచి ప్రజలు ఆశించేదానికీ, క్షేత్ర స్థాయిలో ఉన్న వాస్తవికతకూ నేడు పొంతనే లేదు. అత్యవసర చికిత్స విభాగానికి, వార్డులలోకి, మిగతా అనుమతి అవసరమైన ప్రదేశాలకి ఎంతమంది రోగులు, వాళ్ళ బంధువులు రావొచ్చు అనే ఖచ్చితమైన ప్రోటోకోల్ ని ఆసుపత్రి వర్గాలు అమలు చెయ్యాలి. భద్రత ప్రధానాంశంగా ఉండాలి.
నేటి పరిస్థితి చూసుకుంటే పైన పేర్కొన్న అంశాలేవి రాజకీయ వర్గాలకి పట్టటం లేదు. వివిధ రాజకీయ పక్షాలు కోల్కతాలో జరిగిన దానిని తమకి అనుకూలంగా మలుచుకోవటానికి మతం రుంగు పులుముతున్నాయి. అలాగే డాక్టర్ల కనీస అవసరాలని కూడా రాజకీయం చేస్తున్నాయి. డాక్టర్లని విధుల నుండి తొలగిస్తాం అని జారీ చేస్తున్న హెచ్చరికలు తొందరపాటుతో కూడుకున్న చర్య. అటువంటి నిర్ణయాన్ని అటు డాక్టర్ల కానీ ఇటు ప్రజల కానీ హర్షించరు.
‘రక్షకులని రక్షించండి’ ఉద్యమంలో ఉన్న జూనియర్ డాక్టర్లు తాము వైద్య సేవలని పూర్తిగా బహిష్కరించటం లేదు అని స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రిలో అడ్మిట్ అయిన రోగులకి వైద్యం చేస్తున్నారు, అడ్మిట్ అవ్వటానికి వస్తున్న రోగులని వైద్య సేవలు అందుబాటులో ఉన్న ఆసుపత్రులకి రిఫర్ చేస్తున్నారు.
వాళ్ళ ఉద్యమం పైన పేర్కొన్న, ‘మొదట హాని చెయ్యవద్దు’ సూత్రం ఆధారంగా నడుస్తున్నది. వైద్యునికి, రోగికి మధ్య ఉండవలసిన ఒక నమ్మకం గురించే ఈ గొడవ అంతా కూడా. విద్యార్ధులు అందచేసిన డిమాండ్ల జాబితా మీద ఇప్పటివరకైతే ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
2019 జూన్ 14 నాడు దేశంలోని డాక్టర్లు అందరు బయట రోగులని చూసే విభాగాన్ని బహిష్కరించారు. నల్ల చొక్కాలు, చేతి బ్యాండ్లు, రిబ్బన్లు ధరించి తమ నిరసనని తెలియచేశారు. కొంతమంది తాము రోజూ అనుభవిస్తున్న హింసను తెలియచేసే బ్యాండులు ధరించారు. దేశవ్యాప్త వైద్య వర్గాలలో చాలా అరుదుగా కానవచ్చే ఐక్యత ఈ నిరసనలలో కనిపించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మేనల్లుడు డాక్టర్ అబేష్ కూడా కెపిసి వైద్య కళాశాలలో తన నిరసన తెలియచేశారు.
పశ్చిమ బెంగాల్ లో వైద్య సేవల గురించి చర్చించటానికి అందివచ్చిన ఈ అవకాశాన్ని రాజకీయ ప్రతీకారాలకు ఉపయోగించుకుంటున్నారు.
రితోబాన్ దత్తా
వ్యాసకర్త మణిపాల్, కస్తూర్బా మెడికల్ కాలేజిలో చివరి సంవత్సరం విద్యార్ధి
‘ద వైర్’ వెబ్సైట్ సౌజన్యంతో