Eetela Rajendar: తెలంగాణ రాజకీయాలు జోరెక్కుతున్నాయి.. రాజకీయాలు అనే కంటే టీఆరెస్ లో విబేధాలు జోరెక్కుతున్నాయి.. తెలంగాణ అన్నా.., టీఆరెస్ అన్నా అందరూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుని మాత్రమే చూసి ఉంటారు. కానీ ఈ ముగ్గురుతో పాటూ ఈటెల రాజేందర్, నాయిని నరసింహ రెడ్డి వంటి కీలక నేతలున్నారు. ఈ అయిదుగురు కలిస్తేనే టీఆరెస్. వారి నాయిని మరణించారు. ఇప్పుడు ఈటెలపై కేసీఆర్ కత్తి దూశారు. హరీష్ రావు కీలకంగా ఉన్నప్పటికీ ఎన్నాళ్లుంటారో చెప్పలేని పరిస్థితి..! కాకపోతే ఇప్పటికిప్పుడు టీఆరెస్ కి వచ్చే ఇబ్బంది ఏమి లేదు. అత్యంత కీలకమైన నేతలు ఆ పార్టీలో ఉన్నారు. కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తారు.. ఇక ఈటెల భవిష్యత్తు అడుగులు ఏంటి..? ఆయన మంత్రిగా దిగిపోయాక ఇక రాజకీయ అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి..!? అనేది అత్యంత చర్చనీయాంశంగా మారింది..!
Eetela Rajendar: కొత్త పార్టీ షురూ..!? తెరవెనుక ఎవరు..!?
తెలంగాణాలో టీఆరెస్ కాకుండా కాంగ్రెస్, బీజేపీ పెద్ద పార్టీలుగా ఉన్నాయి. టీడీపీ ఐసీయూలో ఉంది. షర్మిల కొత్తగా పార్టీ ప్రయత్నాలు చేస్తున్నా అది పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. ఈ నేపథ్యంలో తెలంగాణాలో ఓ కొత్త రాజకీయ పార్టీకి అడుగులు పడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. “న్యూస్ ఆర్బిట్” కీలక సోర్సుల ప్రకారం.. తెలంగాణాలో మరో ఆరు నెలల్లో కొత్త పార్టీ రాబోతుంది. ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలతో పాటూ మరో ముగ్గురు ప్రస్తుత మంత్రులు కూడా వీరితో జత కట్టనున్నట్టు తెలుస్తుంది. వీరికి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న ఒక ఎంపీ సూత్రధారిగా ఉన్నట్టు తెలుస్తుంది. కొండా సురేఖ దంపతులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఇద్దరు మాజీ మంత్రులు, టీఆరెస్ లోని కొందరు ఎమ్మెల్యేలు, కలిసి భారీగానే ప్లాన్ చేసినట్టు సమాచారం. పరిస్థితులు మొత్తం చూసుకుని సదరు కాంగ్రెస్ ఎంపీ కూడా ఈ పార్టీతో జత కలిసి తెలంగాణాలో రాజకీయ పోరాటానికి దిగే అవకాశాలున్నట్టు చర్చలు జరుగుతున్నాయి.
కేసీఆర్ తీరుతో కొందరు మంత్రుల్లో అసహనం..!?
తెలంగాణ సీఎం కేసీఆర్ మొండి మనిషి. ఆయన ఒకటి అనుకుంటే అదే చేసి తీరుతారు. కానీ టీఆరెస్ లో కానీ.., తెలంగాణ రాజకీయాల్లో కానీ ఈటెల రాజేందర్ కీలక నేత. మంచి మాస్ లీడర్. నియోజకవర్గంలో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఆయనపై పెద్దగా ఆరోపణలు లేవు. ప్రస్తుతం ఇతర మంత్రులు కొందరితో పోలిస్తే ఈటెల కి క్లీన్ చీట్ ఇవ్వొచ్చు. కానీ ఆయనపై ఒక ప్రణాళిక ప్రకారం మచ్చ వేయడం, తొలగించడం.. చూస్తే ఈటెలని అవమానించి బయటకు పంపించారు అనే చర్చ జరుగుతుంది. ఇదే తీరులో ఇంకొందరు మంత్రులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఉమ్మడి కరీం నగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి.., మరో ఇద్దరు మంత్రులు, హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ మాజీ మంత్రి.., కొందరు ఎమ్మెల్యేలు కూడా టీఆరెస్ అధినేత తీరుపై అసహనంతో ఉన్నట్టు తెలుస్తుంది..! మొత్తానికి ఈ విషయం ఈటెలతో ఆగదు. రానున్న కొన్ని రోజుల్లోనే కొందరిపై కత్తి వేలాడుతుంది. ఆ అందరూ కలిసి కత్తులు దూయడమూ ఖాయమే..!!