(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లు (ఇవిఎంలు) నమ్మదగినవి కావన్న వాదన చాలామంది నోట వింటున్నాం. ఇవిఎంలను ఇప్పటికే కొందరు హ్యాక్ చేసి చూపించారు. పలువురు నిపుణులు సవాలు విసురుతున్నప్పటికీ భారత ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించడం లేదు. ఇవిఎంల సాంకేతికత ప్రశ్నించలేనంత గొప్పదని కమిషన్ అంటున్నది.
ఈ నేపధ్యంలో రెండు స్వచ్ఛంద సంస్థలు 2019 ఎన్నికల వోట్ల లెక్కింపులో కనబడిన వ్యత్యాసాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్కు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. పోలయిన వోట్లకూ, లెక్కింపులోకి వచ్చిన వోట్లకూ మధ్య 347 లోక్సభ నియోజకవర్గాలలో వ్యత్యాసం కనబడిందని ఆ పిటిషన్లో ఆరోపించారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్, కామన్ కాజ్ అనే రెండు సంస్థలు ఈ పిటిషన్ దాఖలు చేశాయి.
ఈ వ్యత్యాసం ఎందుకువచ్చిందీ ఎన్నికల కమిషన్ వివరించలేకపోయింది. పైగా కమిషన్ వెబ్సైట్నుంచి కొంత డేటాను తొలగించారనీ, ఫలితంగా ఎన్నికల ప్రక్రియపై ప్రజల మనసుల్లో చాలా అనుమానాలు పేరుకుపోయాయని ఈ సంస్థలు పేర్కొన్నాయి. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, నేహా రాఠీ ఈ పిటిషన్ తరపు వాదిస్తున్నారు.
ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో సమాచారాన్నీ, మై వోటర్స్ టర్నౌట్ యాప్లో సమాచారాన్నీ విశ్లేషించగా ఈ వ్యత్యాసాలు కనబడ్డాయని ఆ స్వచ్ఛంద సంస్థలు పిటషన్లో పేర్కొన్నాయి. ఈ వ్యత్యాసాలు ఒక వోటు నుంచి 1,01,323 వోట్ల వరకూ ఉన్నాయని పేర్కొన్నారు. ఆరు నియోజకవర్గాలలో గెలిచిన అభ్యర్ధి ఆధిక్యత కన్నా ఈ వ్యత్యాసం అధికంగా ఉందని పేర్కొన్నారు. అన్ని వ్యత్యాసాలూ కలిపి మొత్తం 7,39,104 వోట్ల తేడా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఎన్నికల కమిషన్కు నోటీసు జారీ చేసింది.
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు మళ్లీ బ్యాలెట్ పద్ధతికి వెళ్లేందుకు ప్రతిపక్ష పార్టీలు శాయశక్తులా ప్రయత్నించాయి. 23 ప్రతిపక్షాలు కలిసి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాయి. అక్కడ కూడా ప్రతిపక్షాలకు ఊరట లభించలేదు. ఇవిఎంలలో పోలయిన వోట్ల లెక్కతో వివిప్యాట్లో నమోదయిన వోట్ల లెక్కను సరిపోల్చే ప్రక్రియ కనీసం 50 శాతం పోలింగ్ కేంద్రాలలో జరగాలని ప్రతిపక్షాలు కోరాయి. కమిషన్ అందుకు అంగీకరించలేదు. ఒక అసెంబ్లీ సీటుకు అయిదు కేంద్రాలకు మించి సరిపోల్చాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అయితే అలా సరిపోల్చినపుడు ఎక్కడన్నా వ్యత్యాసం వస్తే ఏం చెయ్యాలన్న దానిపై సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వలేదు. అనంతరం కేంద్ర ఎన్నికల కమిషన్ ఇలా వ్యత్యాసం కనబడిన సందర్భాలలో వివిప్యాట్ లెక్కను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది. నిజానికి సమస్యకు ఇది పరిష్కారం కాదు. కంప్యూటర్లలో ఉపయోగించే చిప్పులనే ఇవిఎంలలో, వివిప్యాట్లలో ఉపయోగిస్తారు. వీటిలో ఒక వోటు తేడా కనబడినా, లక్ష వోట్లు తేడా కనబడినా సూత్రప్రకారం ఒకటే. ఒక వోటు తేడా వచ్చినా ఇవిఎంల విశ్వసనీయతపై అనుమానం లక్ష వోట్ల తేడా వచ్చిన దానితో సమానం. ఇప్పుడు సుప్రీంకోర్టులో దాఖలయిన పిటిషన్ ద్వారా ఈ వ్యత్యాసం లోగుట్టు బయటపడుతుందేమో చూడాలి.