Electricity Crises: దేశంలో విద్యుత్తు కొరత ఎక్కువవుతుంది.. ఏపీ సహా చాలా రాష్ట్రాల్లో విద్యుత్తు సంక్షోభం నెలకొంది.. దీనికి అనేక కారణాలున్నాయి. కారణాలు వెతికి, మూలాల్లోకి వెళ్లి కొరతని తీర్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది.. కాకపోతే ఈ లోగా రానున్న రెండు, మూడు నెలల్లో తీవ్రమైన కరెంటు కోతలు ఉండనున్నాయి.. గ్రామాలూ, పట్టణాలు, నగరాలు తేడా లేకుండా రానున్న రోజుల్లో కరెంటు కోతలు ఉంటాయి. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో మొదలవ్వగా.., ఏపీలో కూడా విడతల వారీగా మొదలు పెట్టారు..!
నిన్ననే ఏపీ ప్రభుత్వం నుండి ఒక ప్రకటన వచ్చింది. “ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగదారులు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏసీలు వాడొద్దని ఏపీ ప్రభుత్వ ఇంధనశాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ సూచించారు. “పీక్ లోడింగ్ సమయంలో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోందని, కాబట్టి కరెంటును జాగ్రత్తగా వాడుకోవాలని” ప్రభుత్వ సలహాదారు సజ్జల సూచించారు. రాబోయే రోజుల్లో ప్రజలపై సర్దుబాటు ఛార్జీల భారం తప్పదని కూడా శ్రీకాంత్ హెచ్చరించారు. అయితే ఏసీలు ఆపినంత మాత్రాన విద్యుత్ సరఫరాలో సమస్యలు తగ్గిపోతాయా? అసలు సమస్య ఏంటి? ప్రభుత్వం ఎందుకిలా చెబుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి..!
Electricity Crises: థర్మల్ పైనే ఆధార పడడమే ప్రధాన సమస్య..!!
ప్రస్తుతం దేశంలో బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా థర్మల్ విద్యుత్ ఉత్పాదనకు ప్రాధాన్యత తగ్గుతోంది. ఇతర మార్గాల్లో వెళ్తున్నారు. కానీ మన దేశంలో మాత్రం థర్మల్ పవర్దే పెద్దవాటా. ఏపీలో కూడా థర్మల్ పవర్ వాటా 45 శాతంగా ఉంది. సాధారణంగా థర్మల్ పవర్ ప్లాంట్లలో 12 రోజుల ఉత్పత్తికి సరపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకుంటారు. కానీ ప్రస్తుతం మనకు రెండు రోజుల కంటే ఎక్కువ నిల్వలు లేవు. ఏపీలో జెన్కో ఆధ్వర్యంలో రెండు థర్మల్ పపర్ స్టేషన్లు ఉన్నాయి. ఒకటి విజయవాడలో నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్, రెండోది కడపలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్.. ఇవి కాకుండా కృష్ణపట్నం వద్ద దామోదరం సంజీవయ్య పవర్ ప్లాంట్ను ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ నడుపుతుండగా.., విశాఖ పరవాడలో సింహాద్రి పవర్ ప్లాంట్ను ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నడుపుతున్నారు. వీటిలో రానున్న రెండు రోజులకు మాత్రమే సరిపడా బొగ్గు నిల్వలు ఉండడంతో సమస్య నెలకొంది. ఈ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం పవర్ ప్లాంటులో 2 యూనిట్లు, రాయలసీమ పవర్ ప్లాంటులోని 3 యూనిట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది.
విద్యుత్ ఉత్పత్తి పరిస్థితి ఏంటి?
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజుకు 185 మిలియన్ యూనిట్ల నుంచి 190 మిలియన్ యూనిట్ల వరకు ఉండగా… ఉత్పత్తి మాత్రం 120 నుండి 135 మిలియన్ యూనిట్లు ఉంటోంది. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో కేవలం 65 శాతం విద్యుత్ను మాత్రమే ఏపీ జెన్కో ద్వారాఇస్తుండగా.., రానున్న రెండు, మూడు రోజుల్లో 40 శాతం కూడా ఇవ్వడం కష్టమే. మొన్న ఒక్కరోజు ఉదాహరణ చూసుకుంటే.., ఈనెల 10న ఆదివారం నాడు ఏపీ జెన్కో ద్వారా 75.2 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. అందులో థర్మల్ పవర్ స్టేషన్ల నుంచి 38 మిలియన్ యూనిట్లు, ఏపీపీడీసీఎల్ ద్వారా 12.25 మిలియన్ యూనిట్లు, 1.865 మిలియన్ యూనిట్లు సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా వచ్చింది. మరో 23.076 మిలియన్ యూనిట్లు హైడల్ పవర్ వచ్చింది. ఇక కేంద్రం వాటాగా వచ్చే విద్యుత్తో పాటు బహిరంగ మార్కెట్లో కూడా అధిక ధరకు విద్యుత్ను కొనుగోలు చేయాల్సి వస్తోంది. అందుకే ఇక కష్టంగా కనిపిస్తుంది.
ఉత్పత్తి తగ్గింది.. వాడకం పెరిగింది..!!
కరోనా తర్వాత దేశం మొత్తం వాడకం పెరిగింది. అందుకు అనుగుణంగా ఉత్పత్తి తగ్గింది. రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గత ఆరు నెలల్లోనే విద్యుత్ డిమాండ్ 15శాతం పెరిగింది. ముఖ్యంగా రెండో వేవ్ నుంచి కోలుకుని వ్యాపార, వాణిజ్య సంస్థలు తిరిగి సాధారణ స్థితిలో నడుస్తున్న నేపథ్యంలో ఈ డిమాండ్ పెరుగుతోంది. గడిచిన ఒక్క నెలలోనే 20 శాతానికి పైగా అదనపు విద్యుత్ అవసరం అవుతోందని ప్రధానికి రాసిన లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రధానంగా థర్మల్ పవర్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. ఏపీ జెన్కో థర్మల్ పవర్ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 90 మిలియన్ యూనిట్లు. ప్రస్తుతం అందులో 50 శాతం కూడా ఉత్పత్తి జరగడం లేదు. దీంతో ఓవైపు డిమాండ్ పెరుగుతుండగా, రెండోవైపు ఉత్పత్తి తగ్గడం ప్రభుత్వ వర్గాల్లో ఆందోళనకు కారణమవుతోంది. డిమాండ్ పెరగడం, ఉత్పత్తి తగ్గడంతో పాటుగా బహిరంగ మార్కెట్లో కూడా విద్యుత్ అవసరమైన స్థాయిలో లభించడం లేదు. 15 రూపాయలకు ఒక్క యూనిట్ కొనుగోలు చేద్దామన్నా కూడా విద్యుత్ అందుబాటులో లేదంటే డిమాండ్ ఎంతగా ఉందో తెలియవస్తుంది.
కోతలు తప్పవు.. దారుణంగా..!!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా గ్రామాల్లో 3 గంటల పాటు విద్యుత్ కోత అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. పవర్ గ్రిడ్ ట్రిప్ కాకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అనేక చోట్ల పట్టణ ప్రాంతాల్లోనూ స్వల్పంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఈ కోతలు ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని ఏపీఈపీడీసీఎల్ అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్రం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల విద్యుత్తు శాఖ మంత్రులు, ఆయా నిపుణులతో కేంద్రం ఒక దఫా సమావేశమైంది. దేశంలో వనరుల లభ్యత, ఉత్పత్తి పెంచడంపై దృష్టి పెట్టింది. దీంతో పాటూ రానున్న రెండు నెలల వరకు కోతలు ఎక్కువగా ఉంటె.. వాడకం తగ్గుతుందని కేంద్రం సూచిస్తుంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో రోజుకి 10 గంటలకు పైగా.., పట్టణాల్లో ఆరు గంటలకు పైగా కోతలు ఉందనున్నట్టు సమాచారం..!