Etela Rajendar Comments: తెలంగాణాలో ఏదో జరుగుతుంది. టీఆరెస్ లో ఏదో ఒక పెద్ద ప్లాన్ ప్రకారమే ప్రక్షాళన చేస్తున్నారు. పాతవారిని పొగ పెట్టి.., కొత్తవారిని తెచ్చుకుని పాలనలో కొత్త మొహాల కోసం సీఎం కేసీఆర్ ఒక పథకం ప్రకారమే వెళ్తున్నారు.. దీనిలో భాగంగా మూడు రోజులుగా మంత్రి ఈటెల రాజేందర్ విషయంలో వివాదం జరుగుతున్నా విషయం తెలిసిందే. ఆయనపై భూ ఆక్రమణల ఆరోపణలు రావడం.. జిల్లా అధికారులు విచారణ చేయడం.. కబ్జాలు జరిగినట్టు నిర్ధారించడం.. అతన్ని మంత్రివర్గం నుండి బహిష్కరించడం.. ఈ పరిణామాలన్నీ తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై ఈరోజు ఈటెల రాజేందర్ స్పందించారు. శామీర్ పెట్ లోని తన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. సుదీర్ఘ వివరణ ఇస్తూనే.. సంచలన కామెంట్స్ చేశారు..!
Etela Rajendar Comments: నన్ను చంపాలని చూసిన పోరాడాను..!!
నయీమ్ గ్యాంగ్ నన్ను చంపాలని చూసింది. నేను ఉద్యమం కోసం ప్రాణాలకు తెగించి పోరాడాను. ఒక చిన్న విషయంలో నన్ను చంపుతామని బెదిరించినా నేను భయపడలేదు. ఇప్పుడు కూడా భయపడను. కోర్టుకి వెళ్తాను, నా తప్పు లేదని నిరూపించుకుంటాను.. అంతే కానీ ఈ అధికారానికి లొంగను. “కేసీఆర్ గారూ మీకూ బిడ్డలున్నారు. రాజ్యం మీ చేతుల్లో ఉండొచ్చు.. అధికారులు మీరు చెప్పినట్లు చేయొచ్చు.. నాకు సంబంధం లేని భూములను నావే అని అంటగడుతున్నారు. నాకు ముందు నోటీసులిచ్చారా..!? వ్యాపారం చేసుకుంటున్న నా భార్యపై కేసు పెట్టడం తగునా..!? మీరు కొలతలు వేసుకున్న స్థలాలు నాకు సంబంధినవేనా..? నేను కనీసం అసైన్మెంట్ భూములు కూడా కొనలేదు. సీఎం గారూ మీకు కూడా బిడ్డలు ఉన్నారు. మీరు బాస్ కాబట్టి మీరు ఎం చెప్తే అదే జరుగుతుంది. మేము లేకుండా సర్వే చేసి తప్పులు తేల్చడం న్యాయమా సిఎం గారూ..!? 19 ఏళ్ళు పార్టీలో ఉంది పని చేసాను. నన్ను నాశనం చేయడానికి సీఎం తన పవర్ మొత్తం ఉపయోగిస్తున్నారు. రాజ్యం మీ చేతుల్లో ఉంది. అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చేస్తే చట్టం ఒప్పుకోదు” అంటూ సూటిగా సీఎం కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యే పదవి రాజీనామాపై ఆలోచిస్తాను..!
రాజీనామా చేయడం నాకు పెద్ద విషయం కాదు. ఆత్మాభిమానం నాకు ముఖ్యం. నాకు పదవులు, డబ్బు ముఖ్యం కాదు. తెలంగాణ ఉద్యమంలోనే అన్నీ వదిలేసి పోరాడాను. ఇప్పుడు నాకు ఏమి వద్దు. నా నియోజకవర్గం ప్రజలు, కార్యకర్తలు ఏమి చెప్తే అదే చేస్తాను. అందరితో మాట్లాడతాను. ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యే, మంత్రి పదవి ఆశించి రాలేదు. ఏమున్నా, లేకపోయినా ప్రజల కోసం మాత్రమే ఉంటాను. ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంపై అందరితో మాట్లాడి చెప్తాను. కేసీఆర్ గారితో కలిసి ఇన్నాళ్లు పని చేసాను, ఉద్యమం చేసాను. నాకు ఈ బహుమతి ఇచ్చి పంపించారు.నేను గులాబీ కండువాతోనే ఎదిగాను. ఇప్పుడు ఆలోచిస్తున్నాను. కారు గుర్తుపై గెలిచానంటే నేను రాజీనామా చేసేస్తాను. నేను, నా నియోజకవర్గ ప్రజలకు జవాబుదారీని.. నా భూములు, నా ఆస్తులు, నా లావాదేవీలపై విచారణ చేసుకోండి..! అంటూ ఆవేదనగా మాట్లాడారు.