గవర్నర్ లేఖ నిమ్మగడ్డకి అనుకూలం కాదు..! ప్రభుత్వానికి ప్రతికూలము కాదు..! నిమ్మగడ్డని ఎన్నికల కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించమని కాదు..! ఇది జగన్ ఓటమి కాదు, నిమ్మగడ్డ (అనుకూల పార్టీల) విజయమూ కాదు…! చాలా ట్విస్టులున్నాయ్, అనేక ఆసక్తులున్నాయ్, జగన్ బృందానికి అనేక దారులున్నాయ్, నిమ్మగడ్డకి అనేక చిక్కులున్నాయ్, వెరసి ఈ వ్యవహారం మొదటి ఫాలో అవుతున్న వారికి అనేక మలుపుల వార్తలున్నాయ్…!!
సీన్ -1 : గవర్నర్ లేఖలో ఏం రాశారు…??
“హైకోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోండి” అని మాత్రమే అన్నారు. అంటే తానేమి “నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఎన్నికల కమీషనర్ గా నియమించండి” అంటూ ఎక్కడా సూటిగా ఆదేశాలివ్వలేదు. తన తప్పు లేకుండా, న్యాయపరంగా తనకు చిక్కులు లేకుండా.., తన వరకు మళ్ళీ రాకుండా చేతులు దులిపేసుకున్నారు. దీనిలో ఎవరు ఎలా అయినా అర్ధం చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వానికి, జగన్ బృందానికి మాత్రం కావాల్సిన స్టఫ్ దొరికింది. సరుకు ఉంది. ఆయుధం అందింది.
సీన్ – 2 : కోర్టు ఏం చెప్పింది…??
కనగరాజ్ ని ఎన్నికల కమీషనర్ గా నియమిస్తూ.., నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం తగ్గిస్తూ ఇచ్చిన ఆర్డినెన్సులు చెల్లవని చెప్పింది. ఆ ఆర్డినెన్సులు ఇవ్వడానికి చూపించిన రాజ్యాంగంలోని ఆర్టికళ్ళను, ప్రభుత్వ ఉద్దేశాన్ని తప్పు పట్టింది. కానీ సూటిగా రమేష్ కుమార్ ని ఎన్నికల కమీషనర్ కమీషనర్ గా నియమించామని అక్కడా చెప్పలేదు. ఆ తర్వాత కూడా “మీరు గవర్నర్ ని కలవండి” అంటూ రమేష్ కుమార్ ని ఆదేశించింది.
(అంటే… ఈ రెండు కలిపి చుస్తే కోర్టు సూటిగా రమేష్ కుమార్ ని కమీషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వలేదు. గవర్నర్ కూడా సూటిగా చెప్పలేదు. కోర్టు గవర్నర్ ని కలవమంటే.., గవర్నర్ కోర్టు ఆదేశాల ప్రకారం చేయాలని ప్రభుత్వానికి చెప్పారు..! మే 29 న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ఎక్కడా నిర్ణీత గడువు పేర్కొనలేదు. పైగా ఆ కేసు సుప్రీం లో పెండింగ్ లో ఉంది.)
ప్రభుత్వం చేతిలో ఉన్న ఆయుధాలివె…!
ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది..? నిమ్మగడ్డని ఎలా అడ్డుకుంటుంది..? ఆయన మళ్ళీ ఎన్నికల కమీషనర్ గా రావడం బొత్తిగా ఇష్టం లేని జగన్ ఎటువంటి ఆయుధాలు ప్రయోగించనున్నారు..? అనేది ఆసక్తికరం. అవేమిటో చుడండి..!
* కేసు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది. అక్కడి నుండి పూర్తిస్థాయిలో ఆదేశాలు రాలేదు. వచ్చాక చూస్తాం అంటూ సింపుల్ గా తప్పించుకోవచ్చు. “అయ్యా! గవర్నర్ గారు, తమరి లేఖ అందింది, కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోమన్నారు. కానీ ఇదే విషయంపై కేసు సుప్రీం లో పెండింగ్ లో ఉంది. కాబట్టి కొద్దీ రోజులు ఆగాల్సిందే” అంటూ మెలికలు పెట్టవచ్చు.
* రమేష్ కుమార్ ని ఎన్నికల కమీషనర్ గా కొనసాగించాలి అంటే ఇప్పుడున్న కనగరాజ్ ని తప్పించాలి. అంటే నాటి ఆర్డినెన్సులు రద్దు చేయాలి. అందుకు కొంత సమయం పడుతుంది. ఇది కరోనా సమయం. కరోనా సమయంలో ఆ ఆర్డినెన్సులు రద్దు చేయడం, కొత్త ఉత్తర్వులు ఇవ్వడం కుదరని పని” అంటూ సింపుల్ గా వాయిదా వేయవచ్చు. మరో తొమ్మిది నెలలు (అంటే వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు) వాయిదా వేస్తే… నిమ్మగడ్డని అడ్డుకున్నట్టే.
* ఈ లోగా “హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని కలిసిన వీడియోలు.., ఆ వ్యవహారాన్ని పెద్దది చేసే వీలుంది. రాజ్యాంగ బద్ధమైన హోదాలో ఉన్న ఒక అత్యున్నత అధికారి కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఇలా రాజకీయ నాయకుల్ని కలవడం వెనుక ఆంతర్యం ఏమిటి..?? అంటూ కొత్త మెలికలు పెట్టి సాగదీయొచ్చు.
* ఇలా ప్రభుత్వానికి అనేక దారులున్నాయి. నిమ్మగడ్డని కొన్ని నెలలు అడ్డుకుంటే జగన్ నైతికంగా గెలిచినట్టే. అదే దారిలో జగన్ బృందం ఉంది. మరోవైపు నిమ్మగడ్డ వర్గం కూడా చేసేదేం లేదు. మహా అయితే మళ్ళీ కోర్టుకి వెళ్తారు. మళ్ళీ గవర్నర్ ని కలుస్తారు. కోర్టులు, గవర్నర్ లాంటి రాజ్యాంగ వ్యవస్థలు విషయాన్నీ సూటిగా తేల్చేలా ఆదేశాలు ఇవ్వడం అరుదు. కొన్ని పాయింట్లు చెప్తారు.. వాటిలో ఎవరికీ అనుకూలంగా ఉన్నవి వారు తీసుకుని విషయాన్నీ పంచుకోవడమే పని.