‘ద వైర్’ వెబ్ సైట్ ప్రత్యేక కథనం
జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఆరోపణ
తీవ్రంగా ఖండించిన జస్టిస్ గొగోయ్
20 ఏళ్లు నిస్వార్థ సేవలని వెల్లడి
తనను తొలగించే కుట్రని అనుమానం
జస్టిస్ రంజన్ గొగోయ్ తనను లైంగికంగా వేధించారని సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహిళ (35) ఆరోపించారని, ఈ మేరకు కోర్టులో ఉన్న మొత్తం న్యాయమూర్తులందరికీ ఓ అఫిడవిట్ పంపారని ద వైర్ తెలిపింది. ఆయన నివాసంలో ఉండే కార్యాలయంలోనే జస్టిస్ గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు దిగారని సదరు మహిళ ఆరోపణలు చేసినట్లు వైర్ తెలిపింది. ద వైర్ సుదీర్ఘంగా ఇచ్చిన కథనంలోని వివరాలు క్లుప్తంగా ఇలా ఉన్నాయి..
ఈ వేధింపులు 2018, అక్టోబర్ 10-11 తేదీల్లో చోటుచేసుకున్నాయని బాధితురాలు తెలిపింది. ‘‘ ఆరోజు జస్టిస్ రంజన్ గొగోయ్ వెనుక నుంచి నా నడుము చుట్టు చేయివేసి నన్ను గట్టిగా పట్టుకున్నారు. చేతులతో నా శరీరమంతా తడిమారు. అనంతరం గట్టిగా హత్తుకున్నారు. ‘నువ్వు కూడా నన్ను కౌగిలించుకో’ అని కోరారు. దీంతో ఆయన నుంచి తప్పించుకోవడానికి నేను పెనుగులాడాను. నేను గట్టిగా తోసేసరికి ఆయన తల వెళ్లి పుస్తకాల అల్మారాకు తగిలింది. ఆ సమయంలోనే నేను ఆయన నుంచి ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డాను. ఇది జరిగిన 2 నెలలకే నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. అనుమతి లేకుండా ఒకరోజు సెలవు తీసుకున్నందుకు నన్ను సర్వీసు నుంచి తొలగించారు. ఈ వేధింపులు అక్కడి నుంచి ఆగిపోలేదు. నా భర్త, నా బావ ఢిల్లీ పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరినీ 2012 లో జరిగిన ఓ కాలనీ వివాదంలో గతేడాది డిసెంబర్ 28న సస్పెండ్ చేశారు. నేను నా భర్తతో కలిసి రాజస్థాన్ లో ఉండగా ఓ చీటింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నేను సుప్రీంకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి నుంచి 50 వేలు తీసుకున్నట్లు తప్పుడు ఫిర్యాదు చేయించారు. మా ఇద్దరిని మాత్రమే కాకుండా మా బావ కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకుని అవమానించారు’’ అని ఆ మహిళ తన అఫిడవిట్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు ‘ద వైర్’ తన కథనంలో పేర్కొంది.
తనకు 24 గంటల పాటు కనీసం నీళ్లు ఇవ్వకుండా చేతులకు బేడీలు వేసి, దూషించడంతో పాటు భౌతికంగానూ దాడిచేశారని, తాను క్షమాపణ చెప్పాలని జస్టిస్ రంజన్ గొగోయ్ భార్య డిమాండ్ చేశారని బాధితురాలు అన్నట్లు తెలిపింది. ఆమె చెప్పినట్లే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పినా తనపై వేధింపులు ఆగలేదని, దివ్యాంగుడైన తన బావ సుప్రీంకోర్టులో తాత్కాలిక జూనియర్ అటెండెంట్ గా పనిచేస్తుంటే, ఆయన్ను అకారణంగా సీజేఐ గొగోయ్ తప్పించారని ఆమె ఆరోపించినట్లు వైర్ కథనం పేర్కొంది.
అయితే ఈ ఆరోపణలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తీవ్రంగా ఖండించారు. తనపై ఆరోపణలు రావడాన్ని నమ్మలేకపోతున్నానన్నారు. 20 ఏళ్లు నిస్వార్థంగా సేవలందించానని, తననుసీజేఐ పదవి నుంచి తొలగించే ప్రయత్నంలో భాగంగానే ఇలా బురద జల్లుతున్నారని ఆయన అనుమానించారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ప్రమాదం పొంచి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.