ఎమ్మెల్యేల షాక్ ల నుండి తేరుకోలేని చంద్రబాబుకి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పెద్ద షాక్ ఇవ్వనున్నారా..? పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారా..? మోడీ ప్రత్యేక ఆశీస్సులతో అతి త్వరలోనే బీజేపీలోకి వెళ్లేందుకు తెరవెనుక మొత్తం సిద్ధం చేసేసుకున్నారా..? ఇవన్నీ అతి పెద్ద ప్రశ్నలు, చర్చనీయాంశాలు. అన్నిటికీ మించి ఒక ప్రత్యేక సోర్సు ప్రకారం.., కొన్ని వర్గాల ప్రచారం మేరకు ఆయన ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబుకి తన రాజీనామా లేఖను పంపించినట్టు కూడా తెలుస్తుంది. బాబు దాన్ని ఆమోదించకుండా మాట్లాడదాం అంటూ బుజ్జగింపులు దిగుతున్నట్టు తెలిసింది. కానీ గల్లా పట్టు వీడడం లేదు. అధికారికంగా ఖరారు కావాల్సింది.
రాజకీయంగా పునర్జన్మ ఇచ్చిన ప్రసంగం..!!
నిజానికి 2018 వరకు గల్లా జయదేవ్ సాధారణ ఎంపీ. మిగిలిన టీడీపీ ఎంపీల లాగానే ఆయన కూడా ఒకరు. కానీ ఎన్డీయే నుండి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత.., బీజేపీకి, టీడీపీకి పూర్తిగా చెడిన తర్వాత గల్లా జయదేవ్ తనలోని రాజకీయుణ్ణి, సిసలైన టీడీపీ వాదిని బయటకు తీశారు. పార్లమెంటులో “మిస్టర్ పీఎం” అంటూ పదే పదే మాట్లాడుతూ దేశం దృష్టిని, మీడియా దృష్టిని తన వైపునకు తిప్పారు. 15 నిమిషాల పాటు పీఎం మోడీని, బీజేపీని కడిగేసి ఏపీలో ఒక్కసారిగా హీరోగా మారిపోయారు. అదే ఊపుతో వరుసగా రెండోసారి.., వైసీపీ గాలిలో కూడా ఎంపీగా గెలిచేశారు. నిజానికి గుంటూరు ఓటర్లు, కొందరు టీడీపీ నేతల్లో అతని పట్ల చాలా అసంతృప్తి నెలకొంది. “వ్యాపారాలు తప్ప పార్టీని పట్టించుకోరు అనీ, కార్యకర్తల బాగోగులు చూడట్లేదు అనీ, అందుబాటులో ఉండడం లేదు” అంటూ చాలా అసంతృప్తి నెలకొన్నా ఆ పార్లమెంటులో 15 నిమిషాల ప్రసంగం అతనికి మళ్ళీ ఊపునిచ్చింది. గెలిచేలా చేసింది. మరోవైపు బీజేపీలో కూడా చాలా మంది దృష్టిలో పడ్డారు.
మోడీ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చాకే..!
ఇప్పుడు ఆయన టీడీపీని వీడి బీజేపీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. మోడీని తిట్టి, అన్ని మాటలని బీజేపీలోకి ఎలా వెళ్తారు? మోడీ ఎలా రాణిస్తారు..? అనే అనుమానాలు రావచ్చు…! మోడీ నుండి జయదేవ్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు చెప్తున్నారు. టీడీపీ పార్టీ, చంద్రబాబు అజెండాను అనుసరించి జయదేవ్ అలా మాట్లాడారని… నిజానికి ఆ ప్రసంగం పట్ల మోడీ కూడా ముగ్దుడయ్యారని చెప్పుకుంటారు. అందుకే టీడీపీని, బాబుని వదిలేసి వస్తాం అంటే బీజేపీలోకి వచ్చేయవచ్చని మోడీ కూడా చెప్పారని కొన్ని వర్గాల్లో చేర్చ జరుగుతుంది. అందుకే ఆయన గడిచిన మూడు నెలల నుండి పూర్తిగా దూరమయ్యారు. అమరావతి రైతుల తరపున, రాజధాని తరపున, పార్టీ తరపున ఏమి మాట్లాడడం లేదు.
టీడీపీని వీడడానికి కారణాలు అనేకం..!!
గల్లా జయదేవ్ బద్ధ టీడీపీ వాది. సామజిక వర్గం పరంగా చూసుకున్నా ఆయన పార్టీని వీడే టైపు కాదు. కానీ టీడీపీ చేస్తున్న కొన్ని తప్పులు, లోకేష్ వ్యవహార శైలి, గుంటూరు జిల్లాలో కొందరు నాయకుల కారణంగా ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయినా లోకేష్ కొన్ని నెలల నుండి గుంటూరు ఎంపీ వ్యవహారాల్లో, జిల్లా రాజకీయ, పార్టీ వ్యవహారాల్లో పూర్తిగా లీనమవుతున్నారట. జయదేవ్ కి తెలియకుండా కొన్ని చేస్తుండడంతో ఈయన నొచ్చుకున్నారని సమాచారం. అదీ కాక…!
* జయదేవ్ కంపెనీ అమర్ రాజా బ్యాటరీ కంపెనీకి చెందిన భూములను జగన్ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. నాడు వైఎస్ కేటాయిస్తే నేడు జగన్ వెనక్కు తీసుకున్నారు. దీనిపై పార్టీ మద్దతు కరవయిందని, పోరాటానికి కూడా పిలుపునివ్వలేదని అందుకే గల్లాలో అసంతృప్తి పెరిగినట్టు చెప్పుకుంటున్నారు.
* మరోవైపు పార్టీ భవిషయ్త్తుపై ఆందోళన.., లోకేష్ వ్యవహార శైలి, భావి నాయకత్వంపై కొంత ఆందోళన ఇవన్నీ ఆలోచించిన జయదేవ్ పార్టీని వీడడమే మంచిదని భావించి… కేంద్రం మద్దతుతో జగన్ ప్రభుత్వంపై పోరాడవచ్చు అనే ఉద్దేశంతో టీడీపీకి దూరమవుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికి ఆయన వీడడం, బీజేపీలో చేరడం ఖరారు కానప్పటికీ అతి త్వరలోనే ఇది జరిగే అవకాశాలు మాత్రం పుష్కలమని ఆయన వర్గీయులు చెప్తున్నారు.