అసలే కార్తీక మాసం. రోజూ పూజలు చేయాలి. ఆ పూజకి పూలు కావాలి. హైదరాబాద్ లాంటి మహానగరంలో పూలకు కరవు వస్తుంది. అందుకే ఆ పూలు పార్టీలే ఇస్తుంటే.., పూలతో పాటూ పూజలు కూడా చేస్తుంటే ఆ కిక్కే వేరు కదా..! అందుకే హైదరాబాద్ లో పూలకు, పూజలకు ఇబ్బంది లేదట. ఈ పూజల్లో బీజేపీ ముందు వరుసలో ఉంటె.., టీఆరెస్ కూడా అదే ఆటలో పయనిస్తుంది..! ఆ పూలు ఏమిటో, పూజలు ఏమిటో.. చూద్దాం పదండి..!!
ముందుగా ఒక చిన్న లెక్క..!!
గ్రేటర్ లో మొత్తం బడ్జెట్ రూ. 6 వేల కోట్లు. గ్రేటర్ మొత్తం ఆదాయం రూ. 3 వేల కోట్లు. తిప్పి తిప్పి కొడితే.. పన్నులు, ఇతర వసూళ్లు పెంచేస్తే మరో రూ. 500 కోట్లు పెరుగుతుందేమో..! కానీ ఈ పార్టీలేమిటి..? రూ. లక్ష కోట్ల హామీలిచ్చేశాయి. సరే ఇచ్చాయి అనుకుందాం.., ఈ డబ్బు ఎవరిస్తారు..? ఎక్కడి నుండి తెస్తారు..? సరే రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది అనుకుందామ్.., కానీ ఏ ఖాతాలో ఇస్తుంది..? ఏ లెక్కల్లో ఇస్తుంది. ఇక్కడి జనాభా ప్రాతిపదికన మాత్రమే ఇవ్వాలి. అంతకు మించి ఇస్తే మిగిలిన ప్రాంతాలు ఏమవ్వాలి..? తెలంగాణ మొత్తం బడ్జెట్ లో సగం హైదరాబాద్ కె ఖర్చు చేస్తామన్నట్టు ఎన్నికల హామీలిచ్చేస్తే జనం చెవిలో పూలు కాక ఇంకేమంటారు..!??
ఇవి మరీ విడ్డూరం కదా..!?
బీజేపీ మేనిఫెస్టో ఒకసారి చూద్దాం..! లక్ష ఇల్లు కట్టిస్తారట. బడిలో పేద పిల్లలకు ఉచితంగా టాబ్స్, వైఫై ఇస్తారట. 100 యూనిట్లు లోపు కాలిస్తే కరెంటు ఫ్రీ గా ఇస్తారట. ఎల్ఆర్ఎస్ తీసేస్తారట. పాత బస్తీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారట. సెప్టెంబర్ 17 న అధికారికంగా తెలంగాణ విముక్తి దినంగా పాటిస్తారట..! ఇవి చెవిలో పూలు కాక మరేమిటి..? రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశాలను ఒక మునిసిపల్ కార్పొరేషన్ చేయగలదా..? ఒక వేళ చేసినా. డబ్బు ఎక్కడి నుండి తీసుకువస్తారు..? ఇవి కాకుండా బీజేపీ ఇచ్చిన హామీల్లో కాస్త అమలు సాధ్యమైనవి కూడా ఉన్నాయి. 24 గంటలూ నీటి సరఫరా.., కొత్త మెట్రో లైన్లు, మహిళలకు మెట్రో ప్రయాణం ఉచితం.., బైక్స్, ఆటోలకు చలాన్లు మాఫీ.., ప్రతి కిలోమీటర్ కి మహిళలకు ప్రత్యేక టాయిలెట్ నిర్మాణం..! ఇవి అమలు చేసే వీలుంది.
కానీ ముందు చెప్పుకున్న హామీలు కచ్చితంగా అమలు చేయాలంటే ఏడాదికి కనీసం రూ. 40 వేల కోట్లు కావాలి. బీజేపీ ఎక్కడి నుండి తీసుకువస్తుంది..!? ఇక టీఆరెస్ హామీల్లో విడ్డురంగా పెద్దగా ఏమి లేనప్పటికీ.. కొన్ని గాలి హామీలున్నాయి. ఇన్నాళ్లు నెరవేర్చని హామీలు కొత్తగా చెప్పినట్టు పాత అంశాలను చేర్చారు. 20 వేల లీటర్ల నీటి సరఫరా.., లాండ్రీలకు, సెలూన్లకు ఉచిత కరెంటు ఇవ్వడం కొత్త హామీలే. అయితే టీఆరెస్ , బీజేపీ హామీల అమలుకు మాత్రం గ్రేటర్ బడ్జెట్ సరిపోదు అనేది నూటికి నూరుశాతం వాస్తవం. అలాగే కొన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలను హామీల్లో చేర్చడమూ విడ్డురమే.
ఇది ఎలా సాధ్యం..!?
ఒకవేళ బీజేపీ హామీలు అమలు చేయాల్సి వస్తే ఏటా రూ. 50 వేల కోట్లు ఎక్కడి నుండి తీసుకువస్తారు..? గ్రేటర్ బడ్జెట్ మించి అప్పులు చేస్తారా..? అప్పులు కూడా ఎక్కడి నుండి చేస్తారు..? అనేది ప్రశ్న. ఇప్పుడు ఏపీ చీటికీ మాటికీ అప్పులు చేస్తున్నట్టుగా.. గ్రేటర్ కూడా అప్పులు చేయాలన్నా కుదరని పని. ఒక మునిసిపల్ కార్పొరేషన్ కి అప్పులు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ష్యురీటి ఉండాలి. అదీ ఏదో ఒక ఆస్తి తాకట్టు పెడితేనే. రాష్ట్రం కుర్హ్సీఈలో టీఆరెస్ ఉన్నప్పుడు గ్రేటారు లో బీజేపీ ఎలా ఈ వేల కోట్ల మాటల్ని అమలు చేస్తుంది అనేది ఆలోచిస్తే చెవిలో పూలు కాక మరేమిటి..? పోనీ టీఆరెస్ అంటే ఎంతో కొంత అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రంలో వారే అధికారంలో ఉన్నారు కాబట్టి.. ఏదో సర్దుబాటు చేసుకోగలరు. కానీ బీజేపీకి అలా సాధ్యం కాదు కదా..!? అందుకే జనం చెవిలో పూలు అనేది..!