ఇక నరుక్కోవడం, అమ్ముకోవడమే అడ్డు లేదు హద్దు లేదు. శేషాచలంలోకి మార్గం తెలిస్తే చాలు, ఎర్ర చందనం చెట్లు ఎక్కడుంటాయో కనుక్కుంటే చాలు, పదిమంది ఎర్ర చందనం కూలీలలను తీస్కుని వెళ్లడం అంతే పని అయిపోయినట్లే. కోట్ల రూపాయలు రోజుల్లో జేబులో వేసుకోవచ్చు. అదేంటి ఎర్ర చందనం నరుక్కోవడం రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చట్ట బద్దం చేసిందా అనుకోకండి…… అంతకు మించి….
పట్టుకోవాల్సిన వాణ్ణి పక్కకు తప్పిస్తారట
ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తిరుపతి కేంద్రంగా ఉన్న టాస్క్ ఫోర్స్ ను ఎత్తివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగా టాస్క్ ఫోర్స్ మొత్తాన్ని ఇటీవల మద్యం, ఇసుక రవాణా అరికట్టే నిమిత్తం ఏర్పాటు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ టీమ్ కు అటాచ్ చేసేలా ఇటీవల కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. రేపో మాపో జిఓ వచ్చిన వెంటనే ఎర్ర చందనం అక్రమ రవాణా నిరోధకదళం అంత ఒక చిన్న సెట్ అప్ లోకి వెళ్ళిపోతుంది. అంటే దాని పరిధి, పని తీరు చిన్నగా మారిపోతాయి. దీని తర్వాత టాస్క్ ఫోర్స్ టీమ్ లోని వారిని డిప్యూటేషన్లు వేసి, క్రమముగా దాన్ని ఒక వ్యూహం ప్రకారం తప్పిస్తారు అని ప్రచారం జరుగుతోంది. అంటే ఎర్ర చందనం అక్రమ రవాణా అడ్డుకునే నిమిత్తం ఏర్పాటు అయినా ఒక విభాగాన్ని ప్రభుత్వమే నిర్వీర్యం చేయడం అన్న మాట.
అద్భుతమైన పని తీరు
2013 లో ఎర్ర చందనం అక్రమ రవాణా అరికట్టేందుకు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు జిఓ ఇచ్చారు. ఒక అడిషనల్ ఎస్పీ విభాగపు హెడ్ గా, 4 డిఎస్పీలు, అటవీ శాఖను దీనికి సంయుక్తంగా ఫోర్స్ తో పటు నిధులు ఇచ్చి దీన్ని ఏర్పాటు చేసారు.
* తర్వాత ముఖ్యమంత్రి గా చంద్రబాబు వచ్చిన తర్వాత టాస్క్ ఫోర్స్ కు కొల్లం గంగిరెడ్డి అనే ఎర్ర చందనం స్మగ్లేర్ పెట్టుకునేలా ప్రత్యేక టాస్క్ ఇస్తూ జిఓ ఇచ్చారు. చంద్ర బాబు మీద అలిపిరి బాంబు బ్లాస్ట్ సమయంలో గంగిరెడ్డి పేరు బయటకు వచ్చింది. పలు ఎర్ర చందనం కేసుల్లో ఉన్న గంగిరెడ్డి వై ఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో దగ్గరగా ఉంటారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొల్లం గంగిరెడ్డి ని విదేశాల్లో అరెస్ట్ చేసి తీసుకురావడంలో టాస్క్ ఫోర్స్ బలంగా పనిచేసింది.
* తర్వాత ఫోర్స్ స్థాయి పెంచి ఐజీ స్థాయి అధికారిని విభాగానికి హెడ్ చేసారు. దింతో వరంగల్ డిఐ జి గా పని చేసి పదోన్నతిపై మాగంటి కాంతారావు ఐజీ స్థాయిలో టాస్క్ ఫోర్స్ కి రావడంతో పటు ఏటా 80 కోట్ల నిధులను ఈ విభాగానికి కేటాయించడంతో ఇది బలం పుంజుకుంది. 2015 లో శేషాచలం అడవుల్లో 20 మంది తమిళ స్మగ్లర్లు ఎన్కౌంటర్ లో మృతి చెందటం జాతీయ ఇష్యూ అయ్యింది. అక్కడి నుంచి స్మగ్లర్లు శేషాచలం అడవుల్లోకి రావాలంటేనే భయ పడే పరిస్థితి వచ్చింది.
* అక్కడినుంచి తిరిగి చూసుకున్న పని లేకుండా టాస్క్ ఫోర్స్ పని చేసింది. ఏడాదికి సుమారు 500 కేసులు నమోదు చేసే వరకు పని తీరు వెళ్ళింది. సుమారు 3 వేల టన్నుల ఎర్ర చందనం టాస్క్ ఫోర్స్ కాపాడింది. ఇదంతా వేలానికి అటవీ శాఖకు ఇచ్చింది.
దేని కోసం?
ఇంత మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఈ విభాగాన్ని ఎప్పుడు అకస్మాత్తుగా ఎస్ఐబి లో కలుపుతాం అనడం వెనుక అసలు మర్మం అంతుబట్టడం లేదు. ఇప్పటికే ఎస్ఐబి లో చేసేందుకు పని లేదు. కేవలం మద్యం కోసం తిరుగుతున్నా రాష్ట్రంలోకి మద్యం వస్తూనే ఉంది. ఇసుక పట్టుబడిన దాఖలాలు లేవు. చప్పగా సాగుతున్న ఎస్ఐబి లోకి పటిష్టమైన టాస్క్ ఫోర్స్ కలపడం ద్వారా ఇలాంటి ఫలితం ఉండదు. ఇది ప్రభుత్వ పెద్దలకు తెలిసిన కొందరిని సంతృప్తి పరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా చిత్తూర్, కడప జిల్లలో ఎర్ర చందనం రవాణా ఎక్కువ. ఈ మధ్య కాలంలో అసలు ఎర్ర చందనం స్మగ్లర్లు దొరికిన జాడే లేదు. కానీ చక్కగా స్మగ్లింగ్ మాత్రం సాగుతుంది. దీనికి ఈ రెండు జిల్లాలో ప్రజా ప్రతినిధులు, వారి అనుచరులే ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ ఎర్ర చందనం బాధ్యతలు చూడాల్సిన ఒక ప్రభుత్వ పెద్దకు అటు వైపు చూడొద్దని 20 కోట్ల పారితోషకం ముట్ట జెప్పినట్లు సమాచారం.