అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కమిటి ప్రభుత్వానికి నివేదిక
ప్రభుత్వ అనుమతులు లేకుండానే కోవిడ్ సెంటర్
పది మంది ప్రాణాలు పోవటానికి కారణమైన రమేష్ ఆస్పత్రి కోవిడ్ సెంటర్ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కమిటి ప్రభుత్వానికి నివేదిక అందించింది. అందులో విస్తుపోయే అంశాలను కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. రమేష్ ఆస్పత్రి అన్ని రకాలుగా ప్రభుత్వ నియమాలను, నిబంధలను పూర్తిగా ఉల్లంఘించించిందని తేల్చింది. రమేష్ ఆస్పత్రి ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇస్తున్న నిబంధనలను పట్టించుకోలేదని కమిటీ పేర్కొంది. కోవిడ్ సోకిన వారికి వైద్య చికిత్ కోసం నిర్దేశించిన ప్రోటోకాల్ ను సైతం ఆస్పత్రి ఉల్లంఘించిందని కమిటీ నిర్ధారించింది. అవసరం ఉన్నా, లేకున్నా ఖరీదైన రెమ్డెసివర్ అన్ని కేటగిరీల పేషెంట్లకూ వాడారని గుర్తించింది. అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం..కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఇప్పుడు కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటంతో రమేష్ ఆస్పత్రిలో ఉల్లంఘనలపైన తేల్చటంతో..ఇప్పుడు ప్రభుత్వం కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.
అన్నీ ఉల్లంఘనలే..ప్రమాదం సమయంలోనూ..
స్వర్ణప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కమిటి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో అనేక కీలక అంశాలను ప్రస్తావించింది. కోవిడ్ కేర్ సెంటర్ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనలను ఉల్లంఘించింది. అన్ని విషయాలు తెలిసి కూడా.. ఉద్దేశ పూర్వకంగా కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా, డబ్బు సంపాదించాలనే యావతోనే నియమాలను, చట్టాలను పట్టించుకోలేదని పేర్కొంది. ఎలాంటి అనుమతి లేకుండానే రమేశ్ ఆస్పత్రి ప్లాస్మా థెరఫీ నిర్వహించిందని తేల్చి చెప్పింది. హోటల్ స్వర్ణ ప్యాలెస్లో అగ్నిమాపక భద్రతా నియమాలు ఉన్నాయా? లేవా? అన్నది పరిశీలించకుండానే కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటులో నిర్లక్ష్యం వహించిందని కమిటీ నిర్ధారించింది. మెట్రోపాలిటిన్ హోటళ్లలో ఎలాంటి అనుమతులు లేకుండానే కోవిడ్ కేర్ సెంటర్లను రమేశ్ ఆస్పత్రి నిర్వహించిందని కమిటీ తన నివేదిక లో ప్రభుత్వానికి వివరించింది. మున్సిపల్ కార్పొరేషన్కు కట్టాల్సిన పన్నులు కూడా కట్టలేదు. రూ.33.69లక్షల పన్ను బకాయిలు కట్టని విషయాన్ని ఇప్పుడు కమిటీ నివేదికలో బహిర్గతం అయింది.
ఆక్యెపెన్సీ సర్టిఫికెట్ సైతం లేకుండానే..
అగ్ని ప్రమాదాలను నివారించే పరికరాలు గాని, నిరభ్యంతర పత్రంగాని, అలాగే ప్రమాదాలు వచ్చినప్పుడు నివారించే వ్యవస్థలుగాని స్వర్ణప్యాలెస్లో లేవని అధికారులు నిర్ధారించారు. గత పన్నెండున్నర సంవత్సరాలుగా 19.4 మీటర్ల ఎత్తులో, అత్యంత రద్దీ ప్రదేశంలో ఈ హోటల్ కొనసాగుతోంది. ప్రభుత్వ నియమాలను, నిబంధనలు ఉల్లంఘిస్తూ నడుపుతున్నారు. బిల్డింగుకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా లేదని కమిటీ గుర్తించింది. దీని ద్వారా గత ప్రభుత్వ హాయంలో వీరికి ఉన్న అండదండల కారణంగానే ఇలా నిబంధనలు ఉల్లంఘించి హోటల్ ను కొనసాగించినట్లుగా ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఇప్పుడు నివేదికలో పూర్తిగా రమేష్ ఆస్పత్రి నిర్లక్ష్యమే ఆ పది మంది ప్రాణాలు పోవటానికి కారణంగా తేలటంతో..ప్రభుత్వం దీని పైన చర్యల దిశగా అడుగులు వేస్తోంది. రమేష్ ఆస్పత్రితో పాటుగా స్వర్ణ ప్యాలెస్ పైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖతో పాటుగా ఫైర్..మున్సిపల్..పోలీసు శాఖలు ఈ దిశగా ప్రభుత్వానికి చర్యలు సిఫార్సు చేయనున్నాయి. మరో వైపు రమేష్ ఆస్పత్రి ఎండీ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.