జగన్ పాలన ఒకే (అది బాధ్యత)..! సంక్షేమం ఒకే (అది భవిష్యత్తు)..! పేదలకు వరాలు ఒకే (అది ఓట్ల వేట)…! ప్రత్యర్థులకు చెక్ పెట్టాలనుకోవడం ఒకే (అది రాజకీయం)…! టిడిపిపై ప్రతీకారం తీర్చుకోవడం ఒకే (అది నాటి చంద్రబాబు చేసిన దానికి రెట్టింపు అప్పగించడం)…!
కానీ….!
ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం నాట్ ఒకే ..! ఎంపీలకు కూడా దొరక్కపోవడం నాట్ ఒకే …! మంత్రులకు కూడా కలవనీయకపోవడం అసలు నాట్ ఒకే ..! కీలక పంచాయతీలకు.., పెత్తనాలకు సజ్జల, విజయసాయిరెడ్డి లాంటి వాళ్లకు అప్పగించడం నాట్ ఒకే ..!
అందుకే…!
వైసీపీలో కొందరు రగిలిపోతున్నారు. లోలోపల అగ్గిరవ్వలా మండిపోతున్నారు. అవకాశం కోసం చూస్తున్నారు. అవకాశం ఉంటె ఆ అగ్గిపై గుగ్గిలం వేసుకుని మరీ తిరుగుబాటు చేసేందుకు స్కెచ్ వేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు ఇలా ఒక్కో స్థాయిలో కొందరు ఉన్నారు. జగన్ పాలన నచ్చింది, జగన్ రాజకీయం నచ్చింది…, కానీ జగన్ వ్యవహారశైలి నచ్చడం లేదు. కలవనీయకపోవడం నచ్చట్లేదు. మంత్రుల్లో ఆరుగురికి తప్ప మిగిలిన వారికి కనీసం నెలకోసారి కూడా జగన్ ని కలిసే అవకాశం ఉండదు. ఏదైనా ఉంటే సీఎం కార్యాలయంలో ఐఏఎస్ లకు చెప్పుకోవాలి, లేదా సజ్జల లాంటి పెద్దలకు చెప్పుకోవాలి.
నివురు గప్పిన నిప్పు…!
పార్టీలన్నాక ఇవి సహజమే. ప్రాంతీయ పార్టీలు అంటే అధినేత భజన తప్పదు. కానీ మరీ కావాలనీయకపోవడం, చిన్న చిన్న పనులకు సజ్జల లాంటి వారి దగ్గర చేతులు కట్టుకోవడం… ఆబ్బె నచ్చట్లేదు. అసలు నచ్చట్లేదు. కానీ జగన్ పాలన ఇష్టం, జగన్ అనే బ్రాండ్ ఇష్టం. కానీ జగన్ వ్యవహారం బాలేదు. అందుకే అందరి విషయం పక్కన పెడితే ఒక ఎంపీ మాత్రం నివురు గప్పిన నిప్పులా ఉన్నారు. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి గెలిచినా సదరు ఎంపీకి గడిచిన ఏడాదిలో ఒక్కసారి కూడా జగన్ ని కలిసే అవకాశం రాలేదట. ఒక్కసారైనా కలిసి తన వ్యక్తిగత (వ్యాపార) సమస్యలు చెప్పుకుందాం అంటే నో ఛాన్స్ అంటున్నారట. అందుకే ఆయన అలిగారు. మామూలుగా కాదు. ఏ క్షణమైనా బరెస్ట్ అయ్యేలా ఉన్నారు. జగన్ ని, పార్టీని కడిగేసి బీజేపీ లోకి జంపయ్యేలా ఉన్నారు. మనసులో అంత కసి పెట్టేసుకున్నారు.
కానీ…!
తనకు కీలక వ్యాపారం ఉంది. ప్రభుత్వం తో లావాదేవీలు ఉన్నాయి. రూ. వందల కోట్లు పైబడి చెల్లింపులు జరగాల్సి ఉంది. ఇదొక్కటే ముడిపడి ఉంది. పార్టీ మారితే ఇవి రావు. జగన్ ని పన్నెత్తి మాట అనినా ఇవేమీ రావు. బీజేపీ కి ఖాళీ చేతులతో వెళ్ళాలి. ఆపై వ్యాపారం పై దెబ్బలు పడుతుంటాయి. అందుకే సదరు ఎంపీ గడిచిన ఆరు నెలలుగా పక్క రాష్ట్రంలో వ్యాపార లావాదేవీలపై ఎక్కువగా దృష్టి పెట్టారట. అందుకే మనసులో ఏమైనా కోపం, కసి, ఆక్రోశం, ఆగ్రహం ఎన్ని ఉన్నా… అవన్నీ ఆవేదన రూపంలో బయటకు తీసుకువచ్చి మరోసారి జగన్ అపాయింట్మెంట్ కోరి తన బాధని చెప్పుకోవాలని అనుకుంటున్నారట. పాపం, ఎంపీ. అన్నట్టు… ఆ ఎంపీకి జిల్లాలోని మంత్రి.., మరో కీలక నాయకుడి వర్గాల నుండి ఆటుపోటీలు రావడం, నియోజకవర్గాల్లో పనులు జరగకపోవడం కూడా ఇబ్బందిగా మారిందట. ఏమో ఈయన కూడా రఘురామకృష్ణంరాజు – 2 అయినా ఆశ్చర్యం అవసరం లేదు. అయితే రఘు వ్యాపారాలు ఢిల్లీ, సో, రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్ని గిల్లికజ్జాలు, కయ్యాలు అయినా పెట్టుకోవచ్చు.., కానీ ఈ ఎంపీ ఆర్ధిక మూలాలు, వ్యాపారాలు అన్నీ రాష్ట్రంలోనే ఎక్కువ. అందుకే జాగ్రత్తగా డీల్ చేయాలి.