కథువా, ఉన్నావ్ అత్యాచారాలకు నిరసనగా ఢిల్లీలో 2018 ఏప్రిల్ 15న జరిగిన ప్రదర్శనలో పాల్గొన్న ఒక చిన్నారి, Photo Courtesy:Reuters
జాతీయ నేర గణాంకాల సంస్థ చివరిసారిగా బహిర్గతం చేసిన లెక్కల ప్రకారం భారతదేశంలో సగటున రోజుకి 293 బాలల మీద హింసకి సంబంధించిన కేసులు నమోదు అవుతున్నాయి. అందులో చాలా కొద్ది కేసులు మాత్రమే వార్తల్లో వస్తున్నాయి.
కానీ ఈ రోజుల్లో ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్నవి- ముఖ్యంగా సామాజిక మాధ్యమాలలో- ముస్లింలు ఆరోపణలు ఎదుర్కుంటున్న కేసులే. క్రితం వారం ఆలీఘడ్ లో జరిగిన రెండున్నర్ర సంవత్సరాల పాప హత్య ఉదంతం దీనికి తార్కాణం.
క్రితం ఏప్రిల్ నెలలో బాలీవుడ్ తారలు ఒక బాలికకి న్యాయం జరగాలి అని అడుగుతూ ప్లకార్డులు పట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కావడం హిందుత్వవాదుల కోపానికి కారణం అయ్యింది. జమ్మూలోని కథువా ప్రాంతంలో ఎనిమిది సంవత్సరాల బాలిక అత్యాచారం, హత్య కేసులో న్యాయవిచారణకి కొందరు సృష్టిస్తున్న అడ్డంకుల గురించి తెలియచేయడానికి బాలీవుడ్ తారలు ఆ ప్రచారోద్యమం చేపట్టారు.
ఆ బాలిక సంచార ముస్లిం బకర్వాల్ తెగకి చెందిన పాప. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కున్న ఎనిమిది మందీ హిందువులే; ఇందులో నలుగురు పోలీసులు. ఈ కారణంగా 2018 జనవరిలో ఒక గుడిలో జరిగిన ఈ నేరాన్ని మొదట్లో కప్పిపుచ్చారు.
అక్కడ భూమి వినియోగానికి, ఇతరత్రా విషయాలకి సంబంధించి స్థానికంగా ఉంటున్న హిందువులకి, బకర్వాల్ తెగవారికి మధ్య గొడవలు ఉండడంతో బకర్వాల్ తెగవారిని అక్కడ నుండి తరిమేసే వ్యూహంలో భాగంగా ఈ నేరానికి తెగబడ్డారు అని పోలీసులు అభియోగపత్రంలో పేర్కొన్నారు.
ఆ ప్రాంతంలో హిందూ ముస్లిం విబేధాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే అక్కడి హిందువులు చాలా మంది న్యాయవిచారణ వేగంగా జరగాలి అని కాకుండా నిందితులను విడుదల చెయ్యాలి అంటూ నిరసనలకు దిగారు. అప్పుడు రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు నిరసనలకారులకి తమ మద్దతు ప్రకటించారు కూడా.
చార్జ్ షీట్ దాఖలు చెయ్యకుండా హిందుత్వ సంస్థలకి చెందిన న్యాయవాదులు భౌతికంగా అడ్డుపడటంతో ఈ కేసు గురించి జాతీయ స్థాయిలో చర్చ మొదలయ్యింది. సామాజిక మాధ్యమాలలో ప్రచారానికి నాంది పలికింది.
బాలీవుడ్ తారలతో సహా అనేక మంది బాలిక పేరుని హాష్ ట్యాగ్గా వాడుతూ సందేశాలు ట్వీట్ చేశారు. ఒక పవిత్ర ప్రదేశంలో- దేవాలయంలో- ఈ నేరం జరిగడమేమిటని వాపోయారు. వీరు దేవాలయం గురించి ప్రస్తావించటం హిందుత్వవాదులకి మింగుడుపడలేదు. అయితే ఈ ప్రచారం రాజకీయ లక్ష్యంతో చేసింది కాదు: ఈ ప్రచారం దృష్టి మొత్తం పిల్లల, మహిళల భద్రత మీదనే.
అలీగఢ్ సంఘటనకు నిరసనగా ఆ నగరంలో జరిగిన ఒక ప్రదర్శన
కథువా ప్రచారోద్యమం హిందుత్వవాదులకి ఎక్కడలేని కోపం తెప్పించింది. అప్పటి నుండి బాలల మీద హింసకి సంబంధించి ముస్లింలు ముద్దాయిలుగా ఉన్న కేసుల విషయంలో ఆవేశపూరితంగా, ప్లకార్డులతో, హాష్ ట్యాగులతో మక్కీకి మక్కీ కథువా లాంటి ప్రచారాన్నే వాళ్ళూ మొదలపెట్టారు. ప్రతిసారీ ముద్దాయిల మతాన్ని ఎత్తిచూపడమే వారి పని.
బాలీవుడ్ తారలతో సహా చాలా మంది పలుకుబడి కలిగిన వారు కూడా ఈ ప్రచారాలకి తమ గొంతుకను ఇచ్చారు. కానీ వారు చూడదలుచుకోని విషయం ఒకటి ఉంది. కథువా లాగా ఈ కేసులకి ఎటువంటి మతోన్మాద నేపధ్యం లేదు. ఒక్క కేసులో కూడా బాధితుల తల్లితండ్రులు ఇది మతోన్మాద చర్య అని చెప్పలేదు. ముద్దాయిల మతం అక్కడ ప్రస్తావించదగ్గ అంశమే కాదు.
హిందుత్వవాదులు ఇంకొక ముఖ్యమైన తేడాని కూడా చూడదలుచుకోలేదు. కథువా కేసుని మొదట్లో నీరుగార్చే ప్రయత్నాలు జరగగా, ఈ కేసులలో పోలీసులు సత్వర చర్యలు తీసుకున్నారు. ముద్దాయిలని కాపాడటానికి రాజకీయ నాయకులు కానీ, ముస్లిం నిరనసనకారులు కానీ, ఎవ్వరూ కూడా ప్రయత్నించలేదు.
అంతేకాక క్రితం సంవత్సరం జూన్ నెలలో మధ్యప్రదేశ్ లోని మందసౌర్లో ఏడు సంవత్సరాల బాలికపై ఒక ముస్లిం వ్యక్తి అత్యాచారం చేస్తే అతనికి మరణ శిక్ష విధించాలని జరిగిన నిరసనలలో ఆ పట్టణం ముస్లింలు పాల్గొన్నారు. తమ శ్మశానంలో ముద్దాయి శవానికి చోటు లేదు అని కూడా తేల్చిచెప్పారు.
అయినా కూడా హిందుత్వవాదులు సామాజిక మాధ్యమాలలో ద్వేషపూరిత సందేశాల ద్వారా ఈ విషయానికి మతం రంగు పులమటానికి తమ వంతు ప్రయత్నాలు చేశారు.
అదే నెల రాజస్థాన్ లోని బర్మార్ లో ఒక సరిహద్దు గ్రామంలో ఏడు సంవత్సరాల బాలిక అత్యాచారానికి గురయ్యింది. ఆ బాలిక ఒక దళిత కులానికి చెందినది కాగా, ముద్దాయి ముస్లిం. కొన్ని గంటల్లోనే గ్రామస్తుల సహాయంతో- అందులో చాలామంది ముస్లింలే- పోలీసులు ముద్దాయిని అరెస్ట్ చేశారు.
విచారణ జరుగుతున్న తీరుతో బాలిక తల్లితండ్రులు సంతృప్తి వెలిబుచ్చారు: ఒక్క వారంలోనే అభియోగపత్రం దాఖలు చేశారు, దాని తరువాత ఐదు రోజులకే కోర్టులో న్యాయ విచారణ మొదలయ్యింది.
ఆ బాలిక పొరుగింటివారైన ముస్లింలు ఒక చిన్న నిరసన కార్యక్రమం చేపట్టి, ముద్దాయికి మరణ శిక్ష విధించాలి అని అర్జీ ఒకటి సమర్పించారు.
గ్రామంలో ఎటువంటి మత ఉద్రేకాలు లేకపోయినా బర్మార్ జిల్లా బిజెపి అధ్యక్షుడు ఒక నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసి ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నం చేశాడు. సరిహద్దు గ్రామాలలో దళితుల మీద ముస్లింలు భారీ స్థాయిలో అకృత్యాలకి పాల్పడుతున్నారు అని రాజస్థాన్ ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశాడు. దళిత నాయకులు ఈ ఆరోపణని కొట్టిపారేశారు: దళితులని అణిచివేస్తున్నది ముస్లింలు కాదు రాజ్పుట్లు అని వారు పేర్కొన్నారు.
క్రితం వారం ఉత్తర ప్రదేశ్ లోని అలీఘడ్లో రెండున్నర సంవత్సరాల బాలిక హత్యకి గురయినప్పుడు ఇదే పునరావృతం అయ్యింది. హిందుత్వవాదులు బాలిక పేరుని హాష్ ట్యాగ్గా వాడుతూ ఆవేశంగా ట్వీట్లు చేశారు. ముద్దాయి ముస్లిం అవడం చేత అతని మతం గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ తమ ట్వీట్ల పరంపరని కొనసాగించారు.
పాత్రికేయులు కూడా ఈ ఉచ్చులో పడ్డారు. టివి వార్తల వ్యాఖ్యత భూపేంద్ర చౌబే ముద్దాయి ముస్లిం అని చెబుతూ చేసిన ట్వీట్కి ప్రతిగా సేనియర్ పాత్రికేయుడు మృణాల్ పాండే ఈ కింది విధంగా ట్వీట్ చేశారు.
Bhupendra, a rapist is a rapist is a rapist. Period. As a senior, influential journalist, please desist from underscoring a rapist's religion. This sort of casual generalisation unfairly stigmatises a whole community in these edgy times and is totally uncalled for. https://t.co/VRy3uijEFO
— Mrinal Pande (@MrinalPande1) June 8, 2019
ఈ ద్వేషపూరిత ప్రచారాలు సామాజిక మాధ్యమానికే పరిమితం కాదు. ఆలీఘడ్లో భజరంగ్ దళ్ లాంటి హిందుత్వ సంస్థలు ఇప్పటివరకు ఎటువంటి మత ఉద్రిక్తతలూ లేని బాధితుల కుటుంబం ఉండే గ్రామం తప్పల్లో మత ఉద్రేకాలు సృష్టించటానికి మహాపంచాయతీ నిర్వహించే ప్రయత్నం చేస్తున్నది.
బాలల మీద హింస భారతదేశంలో చాలా ఎక్కువ. అటువంటి నేరాలు చేసినవారు ఏ కులానికి చెందినా, ఏ మతానికి చెందినా మనం వారి సంగతి చూడాలి. అయితే మనం ఒకటి గుర్తుంచుకోవాలి: హిందుత్వవాదులకి బాలల మీద జరిగే హింస గురించి ఎటువంటి పట్టింపు లేదు. వాళ్ళ దృష్టి అంతా ముస్లిం ముద్దాయిల మీదనే.
ఇదంతా కూడా గత శతాబ్దం మొదటి భాగంలో అమెరికాలో వ్యాప్తిలో ఉన్న “బ్లాక్ రేప్ స్కేర్” ని గుర్తుకుతెస్తుంది. అమెరికాలో అక్కడక్కడ తెల్ల మహిళాల మీద నల్ల జాతి పురుషులు జరిపిన లైంగిక హింస కేసులని తీసుకుని, దేశంలో జాతి విద్వేషాన్ని మరింత పెంచే లక్ష్యంతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు జరిగిన ప్రయత్నాలని బ్లాక్ రేప్ స్కేర్ అంటారు.
ఇక్కడ కూడా హిందుత్వవాదుల ఆలోచన అదే. మతపరమైన మైనారిటీల మీద మెజారిటీ మతస్తులలో ద్వేషాన్ని పెంచి పోషిస్తూ మత ఉద్రిక్తతలని కొనసాగించటం.
సుప్రియా శర్మ
‘స్క్రోల్’ వెబ్సైట్ సౌజన్యంతో