తమ జీవనోపాధుల ప్రాంతాలలో పుట్టగొడుగులుగా పుట్టుకొస్తున్న పరిశ్రమలకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆదివాసీ ప్రతిఘటన పోరాటాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. పాలక వర్గాలు, మీడియా ఆదివాసీలని ‘అభివృద్ధి నిరోధకులు’ లేదా నక్సలైట్లుగా ప్రచారం చేస్తున్నాయి. అలాంటప్పుడు ప్రజలు తప్పకుండా ఒక ప్రశ్న వేస్తారు- ఆదివాసీలు అభివృద్ధికి ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు?
కానీ చాలా వ్యతిరేకత, ప్రతిఘటన తరువాత కూడా కొన్ని ఆదివాసీ ప్రాంతాలలో పరిశ్రమలు బలవంతంగా ఏర్పడ్డాక ఏమి జరుగుతుంది? ఈ అభివృద్ధి ఆదివాసీలకి కానీ వారి ప్రాంతాలకి కానీ ఏమన్నా లబ్ది చేకూరుస్తుందా?
ఇది అర్థం చేసుకోవటానికి వ్యతిరేకతను కాదని ప్రైవేటు పరిశ్రమలు ఏర్పడిన ప్రదేశాలకి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఈ బలవంతపు ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీస్ దళాల మద్దతుతో జరుగుతుంది. ఈ ప్రక్రియలో జనాలని జైళ్లలో కుక్కుతారు, ప్రజా ఉద్యమాలని నాశనం చేస్తారు.
అలాంటప్పుడు ఆ ప్రాంతాలలో ప్రజల జీవితం ఎలా ఉంటుంది? ఒడిశాలోని కాశీపూర్ తాలూకాలోని కుచాయిపదార్ గ్రామం దీనికి జవాబు ఇవ్వగలదు.
1992లో తీవ్ర ప్రజా వ్యతిరేకత కారణాన బాక్సైట్ గని, శుద్ధి కర్మాగారం నిర్మించాలనుకున్న ప్రణాళికని టాటా, బిర్లా కంపెనీలు విరమించుకున్నాయి. తరువాత ఉత్కళ్ అల్యూమిన(హిందాల్కో, ఒక కెనడియన్ సంస్థ వారి ఉమ్మడి సంస్థ) రంగంలోకి దిగింది. ఈసారి కూడా ప్రజలు వ్యతిరేకించినా రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీ ఏర్పాటుకి మార్గం సుగమం చేసింది. ప్రజల సమ్మతి అడిగింది ప్రభుత్వం అప్పుడు.
భగవాన్ మాఝీ 1992 నుండి ప్రజా ఉద్యమాలలో మమేకమై ఉన్నారు. 1996 నుండి 24 గ్రామాలలో ప్రభావం ఉన్న “ప్రకృతి సంపద పరిరక్షణ పరిషత్” సంస్థ సమన్వయకర్తగా ఉన్నారు. ఆయన ప్రకారం, అప్పుడు దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ఉత్కళ్ అల్యూమిన సంస్థ వైపే నిలబడ్డారు. పొలిసు దళాలని శాశ్వత ప్రాతిపదికన అక్కడ నియమించారు.
కొంతమంది గ్రామస్థులని తమవైపుకు తిప్పుకున్నారు; యువతని ఉద్యోగం, డబ్బు పేరు మీద వలలోకి లాగారు. కుటుంబంలో గొడవలు సృష్టించారు; అన్నదమ్ముల మధ్య, తండ్రీ కొడుకులమధ్య, మేనమామలు మేనల్లుళ్లు మధ్య. వాళ్ళు ఎర వేసిన ప్రయోజనాలకి ప్రభావితమై కొన్ని గ్రామాల ప్రజలు ఉద్యమం నుండి విరమించుకున్నారు. ఉద్యమం నీరుగారిపోయింది.
అప్పటికీ ఉద్యమిస్తున్న వాళ్ళని జైల్లో నిర్బంధించారు. జైలు నుండి తిరిగివచ్చాక వారికి కకావికలమైపోయిన తమ ఇళ్లనీ, కుటుంబాలని బాగుచేసుకోవడంతో సరిపోయింది. అతికొద్ది మంది మాత్రమే గని వ్యతిరేక ఆందోళనలో మిగిలారు.
చివరికి 2004 లో ఉత్కళ్ అల్యూమిన తమ శుద్ధి కేంద్రం కార్యకలాపాలని ప్రారంభించగలిగింది.
ఒక జీవన విధానం ఏ విధంగా నాశనం అయ్యింది
కొన్ని వందల సంవత్సరాలుగా కుచాయిపదార్ గ్రామంలో దొంగతనం , లైంగిక హింస అనే మాటలే వినపడలేదు. ఆత్మీయ సంబంధ బాంధవ్యాలతో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. చాలామటుకు వ్యవసాయం చేశారు. ఒంటరిగా అడవులలోకి, కొండలలోకి, నదులకి వెళ్ళటానికి మహిళలు ఏమాత్రం భయపడలేదు తమ పొలాలలో వరి పండించారు.
వారు ప్రకృతిని పూజించారు. ఋతుపండుగలని జరుపుకోవడానికి ఆడి పాడేవారు. ఒక ఇంటిలో ఇబ్బంది ఉంటే సమూహం మొత్తం వారికి సహాయం చెయ్యడానికి కదిలి వచ్చేది. ఆనందాలని గ్రామం మొత్తం కలిసికట్టుగా పంచుకునేది.
ఇళ్ళకి ఏనాడు తాళం వేసే వారు కాదు. ఒక రకమైన పరస్పర విశ్వాసం ఉండేది. ఉత్కల్ అల్యూమిన వచ్చాక గ్రామంలో లైంగిక హింస మొదలయ్యింది. దొంగతనాలు కూడా పెరిగాయి. తమ తమ పొలాలకు వెళ్ళటానికి ప్రజలు సంకోచించటం మొదలుపెట్టారు.నదులకి మహిళలు ఒంటరిగా వెళ్ళటం మానేశారు.
పగటి పూట కూడా మహిళలు, అమ్మాయిలు అపహరణకు కానీ వేధింపులకి కానీ గురి కావొచ్చు అనే భయం ప్రబలింది. నదులకి, పొలాలకు గుంపుగా వెళ్ళటం మొదలయ్యింది. పురుషులు కూడా అడవికి గుంపుగా వెళ్ళటం మొదలయ్యింది. తమ తమ ఇళ్ళకి తాళాలు వెయ్యటం మొదలుపెట్టారు.
వాళ్ళ జీవన విధానం పూర్తిగా మారిపోయింది. భయం అనేది నిత్యకృత్యం అయ్యింది.
సంస్కృతి ఏ విధంగా పూర్తిగా ధ్వంసం అవుతుంది
కుచాయిపదార్ గ్రామస్తులు కొండలని, అడవులని, నీటి ధారలని పూజిస్తారు. ఎన్ని కొండలు, అడవులు, నీటి ధారలు ఉన్నాయో అంతమంది దేవుళ్ళు ఉంటారు. అందరికీ పూజలు అందుతాయి.
శుద్ధి కర్మాగారం నిర్మాణం అయ్యాక కొంతమందికి వాళ్ళ దేవుళ్ళ మీద నమ్మకం పోయింది.
ఎక్కువ శక్తిమంతుడుగా వాళ్ళు భావించిన బయట నుండి వచ్చిన దేవుడిని పూజించడం మొదలుపెట్టారు. . కొత్త దేవుడిని పూజిస్తే అతనిని పూజిస్తున్న శక్తిమంతులులాగా తాము కూడా మారతామని వాళ్ళు భావించారు.
ఒక ఆదివాసీ ఇంటి ముందు తులసి మొక్క. Photo Courtesy: Jacinta Kerketta.
పక్కన ఉన్న పట్టణానికి వలస వెళ్లిన వారు తాము తిరిగి వచ్చేటప్పుడు తమతో పాటు తులసి మొక్కని తీసుకువచ్చారు. దానిని ఇంట్లో నాటారు. కొంతమంది మహిళలు గాయత్రి పూజ చెయ్యటం మొదలుపెట్టారు. మిగతవారు వాళ్ళని అనుసరించారు. ఈ రోజున గ్రామంలో అధిగ భాగం గాయత్రి పూజ చేస్తున్నారు. వాళ్ళ మనసులో ఆదివాసీ నమ్మకాలు, సంస్కృతి తక్కువ అనే భావం స్థిరపడిపోయింది.
ప్రజలు ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు
మల్టీ నేషనల్ సంస్థలు, ప్రభుత్వం గ్రామానికి కావాల్సిన పంట నీరు గురించికానీ, నీటిని సంరక్షించాల్సిన అవసరం గురించి కానీ ఎందుకు ఆలోచించవు అని శ్రీగుడ గ్రామానికి చెందిన మనోహర్ మాఝీ అడుగుతున్నాడు. “ఎవరి అభివృద్ధి గురించి వారు చర్చిస్తున్నారు? మేము ఈ దేశ ప్రజలం కాదా? మేము ప్రజలమే అయితే మా ప్రాధాన్యతలను అనుసరించే మా అభివృద్ధి వారికెందుకు అవసరం లేకుండా పోయింది?”
ఎక్కడికైనా ఒక కంపెనీ వెళితే అక్కడ ప్రభుత్వాన్ని ప్రజలకి వ్యతిరేకంగా మారుస్తుంది అని అన్నాడు. “కంపెనీకి మార్గం సుగమం చెయ్యడానికి ప్రభుత్వం పోలీసు దళాలతో వస్తుంది, అలాగే ఉద్యమకారులని జైళ్ళలోకి తోస్తుంది. కంపెనీ తనతో పాటు కిరాయిగూండాలని, కాంట్రాక్టర్లని తీసుకువస్తుంది. వాళ్ళకి పర్యావరణ నిబంధనలు పట్టవు, నీటి వనరులని, అడవులని,నదులని ధ్వంసం చేస్తారు. ప్రజల జీవితాలు ఆకస్మికంగా, పూర్తిగా మారిపోతాయి.” అని అన్నాడు.
బాక్సైట్ ఖనిజాన్ని గని నుండి శుద్ధి కర్మాగారానికి తరలించే ప్రక్రియలో 105 గ్రామాలు ప్రభావితం అవుతున్నాయని బగ్రిఝోలా గ్రామానికి చెందిన నాథో జాని పేర్కొన్నాడు. “ తవ్వకం జరుగుతున్న కొండ ప్రాంతంలో 85 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలకి పునరావాసం చూపకముందే ఇక్కడ తవ్వకాలు మొదలయ్యాయి. బహుశా వాళ్లు ఆనుకుని ఉంటారు ఇక్కడ తవ్వకాలు జరిగి పరిస్థితులు పూర్తిగా నాశనం అయితే వీళ్ళే పారిపోతారులే అని.”
బాక్సైట్ను శుద్ది కర్మాగారానికి మోసుకెళ్లే కన్వేయర్. ఇది 23 కిలోమీటర్ల పొడవున వెళుతుంది. Photo courtesy: Jacinta Kerketta.
శుద్ధి కర్మాగారం పెట్టినప్పటి నుండి ఇక్కడ వ్యవసాయం పూర్తిగా కుంటు పడింది అని పేర్కొన్నాడు. కాలుష్యం పెరిగే కొద్దీ భూసారం తగ్గిపోయింది. ఇంతటి దౌర్భాగ్యం అనుభవిస్తామని మేము ఎప్పుడూ అనుకోలేదు అని జాని పేర్కొన్నాడు.
అంతా నాశనం చేశేసాక వీళ్ళే వదిలివెళ్ళిపోతారు:
శుద్ధి కర్మాగారానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రజలని ఏ విధంగా విడకొట్టారో కుచాయిపదార్ గ్రామపెద్ద వివరించాడు. పోరాటంలో అగ్రభాగాన ఉన్నవారికి పోరాటం ఆపెయ్యమని కంపెనీ నెలకి 1800 రూపాయలు ఇచ్చిందంట. “ఒకరి తర్వాత ఒకరు గ్రామస్తులు ఈ వలలో పడ్డారు. తరువాత ఉద్యమం నీరుగారిపోయింది. డబ్బు బలంతో ప్రజలని వారికి కాకుండా చేశారు.”
“కొంతమంది కుర్రవాళ్ళు కంపెనీ దగ్గర ఒప్పంద ఉద్యోగం పొందారు. కాని వాళ్ళకి తెలుసు ఒకసారి ఖనిజం ఖాళీ అయ్యాక వాళ్ళని ఉద్యోగం నుండి తొలగిస్తారు అని. ఈ కుర్రవాళ్ళు వ్యవసాయం చెయ్యలేరు, ఆహారం పండించలేరు కాబట్టి పట్టణాలకి వలస వెళ్ళిపోతారు.”
“ఇంతకు ముందు అందరూ గ్రామానికి ఉపయోగపడే ఏ పనికైనా తమ వంతు సహకారం అందించేవారు. కానీ ఇప్పుడు ఏ మాత్రం కాదు. ఒకరోజు మొత్తం అంతా ధ్వంసం చేసేశాక ఇక్కడ వ్యర్ధాన్ని మిగిలించి కంపెనీ వెళ్ళిపోతుంది. ఒకప్పుడు ఉన్న అందాన్ని తిరిగి ఎవరు తీసుకువస్తారు? ఇంతక ముందు మేము జీవించిన జీవితాన్ని ఎవరు తిరిగి ఇస్తారు?”
జెసింతా కెర్కెటా
రచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
‘ద వైర్’ వెబ్సైట్ సౌజన్యంతో