హైకోర్టులో హోం శాఖ అఫిడవిట్ దాఖలు… చట్టసభల్లో చర్చపై ప్రస్తావన
ఏపీ మూడు రాజధానుల వ్యవహారంలో కేంద్ర క్లారిటీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఏపీ బీజేపీ నేతలు తాము అమరావతికి అనుకూలమని చెబుతూనే..రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదంటూ భిన్న ప్రకటనలతో అయోమయానికి కారణమయ్యారు. ఇప్పుడు మూడు రాజధానులు..సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేయటంలో టీడీపీ నేతలు ఈ ప్రక్రియనే తప్పు బట్టారు. దీని పైన అమరావతి జేఏసీ నేతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో..అసలు రాజధాని వ్యవహారం కేంద్రం పరిధిలోనా..రాష్ట్రం పరిధిలోకి వస్తుందా స్పష్టత ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రం ప్రభుత్వం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దీని మేరకు కేంద్ర హోం శాఖ ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో ఈ మోత్తం వ్యవహారం పైన కేంద్రం పాత్ర గురించి వివరించింది. అదే సమయంలో సీఎం జగన్ కు రిలీఫ్ ఇచ్చే విధంగా వైసీపీ ప్రభుత్వ వాదనకు సమర్దిస్తూ కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు కేంద్రం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ పైన చర్చ మొదలైంది.
రాజధాని రాష్ట్ర పరిధిలోనిదే..
హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఏపీ మూడు రాజధానుల వ్యవహారంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని వ్యవహారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని అఫిడవిట్ లో స్పష్టం చేసింది. కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని తేల్చి చెప్పింది. కేంద్ర హోం శాఖ దాఖలు చేసిన ఈ అఫిడవిట్ లో మరిన్ని కీలక అంశాలు ఉన్నాయి. చట్ట సభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చలను న్యాయ స్థానాలు సమీక్షించ లేవనే విధంగా అఫిడవిట్ లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు కేంద్రం జోక్యం చేసుకోవాలనే టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ కు ఈ అఫిడవిట్ ద్వారా సమాధానం ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. మూడు రాజధానుల వ్యవహారం పైన ఇటు హైకోర్టుల..అటు సుప్రీం కోర్టులో పిటీషన్లు పెండింగ్ లో ఉన్నాయి. హైకోర్టులో దాఖలైన పిటీషన్లకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చే వరకూ అంటే ఈ నెల 14 వరకు మాత్రం స్టేటస్ కో మెయిన్ టెయిన్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో కేంద్రం హైకోర్టులో దాఖలు చేసిన ఈ అఫిడవిట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రకంగా మద్దతు లభించిన ట్లుగా భావించాల్సి ఉంటుంది. అసలు ఏ అధికారంతో రాజధాని మారుస్తున్నారని ప్రశ్నిస్తున్న చంద్రబాబుకు సైతం ఇప్పుడు ఇదే సమాధానంగా వైసీసీ నేతలు చెబుతున్నారు.
కేంద్రం క్లారిటీ…వాట్ నెక్స్ట్..
రాజధానుల అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని కేంద్రం హైకోర్టులోనే అఫిడవిట్ లో దాఖలు చేయటంతో..ఇప్పుడు తరువాతి పరిణామాలు ఏంటనే చర్చ మొదలైంది. ఈ నెల 14వ తేదీ లోగా రాష్ట్ర ప్రభుత్వం సైతం హైకోర్టులో ఇప్పటికే దాఖలైన పిటీషన్ల పైన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయనుంది. తొలి సారి శాసన వ్యవస్థలో ప్రవేశ పెట్టిన బిల్లుల పైన అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తం కావటంతో రాష్ట్ర ప్రభుత్వం రెండో సారి రెండు సభల్లోనూ ఈ రెండు బిల్లులను ప్రవేశ పెట్టింది. ఆ తరువాత వీటికి గవర్నర్ ఆమోదం సైతం లభించింది. అయితే, వీటి పైన హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. ఇక, తాజాగా చంద్రబాబు సైతం కేంద్రం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని..అమరావతి రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేసారు. ఇప్పుడు కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ ద్వారా రాజధాని మార్పు వ్యవహారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే అంటూ కేంద్రం అధికారికంగా స్పష్టత ఇచ్చినట్లు అయింది. అమరావతి ఇంచు కూడా కదల్లేదు.. కేంద్రానికి జోక్యం చేసుకొనే అధికారం ఉంది…సరైన సమయం లో కేంద్రం జోక్యం చేసుకుంటుందంటూ వ్యాఖ్యానాలు చేసిన టీడీపీ నుండి బీజేపీలోకి చేరిన రాజ్యసభ సభ్యులు ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి.