Huzurabad: “దేశం మొత్తానికి రాజకీయ పాఠం నేర్పిన ఫలితం ఈ రోజు వచ్చింది. సాధారణంగా ఎన్నికలు, ఓట్లు అంటేనే డబ్బులు పెట్టి కొనుగోలు చేయవచ్చు అని భావిస్తున్న రాజకీయ నాయకులు ఉన్న తరుణంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్ని కోట్లు కుమ్మరించినా.. ఓటుకు భారీ ధర ఇచ్చినా.. ఫలితం ప్రతికూలంగానే వచ్చింది.. ఇది ఒక పాఠమే. దేశంలో రాజకీయ విజ్ఞత బతికే ఉంది అని నేర్పించిన పాఠమే..! హూజూరాబాద్ ఎన్నికల ఫలితం ఏపిలో జగన్మోహనరెడ్డి సహా మిగిలిన రాష్ట్రాల నేతలకు, పాలకులకు కూడా ఒక పాఠం అని చెప్పవచ్చు. ఈ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ 23 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ మనం గమనించాల్సింది హూజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలుపు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిందో అందరికీ తెలుసు.
Huzurabad: కేసీఆర్ పంచతంత్రం మంత్రం..!
కేవలం ఒకే ఒక్క నియోజకవర్గం, సుమారు 2 లక్షల ఓటర్లను ఆకట్టుకోవడం కోసం కేసీఆర్ చేయనిది అంటూ లేదు. ఒకరకంగా రాజకీయ పంచతంత్రం మంత్రం ప్రయోగించారు. కేసీఆర్ తనలో ఉన్న అస్త్రశస్త్రాలను, ఆయుధాలను, అధికారాన్ని మొత్తాన్ని ప్రయోగించారు.
1. రూ. వందల కోట్ల రూపాయలతో సీఎం కేసిఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా దళితుల్లో ఒక్కో ఇంటికి రూ. పది లక్షలు ఇచ్చారు. ఇది దేశ చరిత్రలోనే ఒక విశిష్టమైన పథకం. కేసిఆర్ ఈ పథకాన్ని ఏర్పాటు చేసిన ఉద్దేశం కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల గెలవకూడదు. మళ్లీ అసెంబ్లీ లో అడుగు పెట్టకూడదు అన్నది..! 2. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత పాడి కౌశిక్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీ పదవి ఖాయం చేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కౌశిక్ రెడ్డి 61 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఆ ప్రభావం పనికొస్తుందని భావించిన కేసీఆర్ కౌశిక్ ద్వారా కొంత గాలం వేశారు. కేవలం ఈటలను దెబ్బతీయడం కోసం కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకుని ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు ప్రకటించారు..! 3. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న ఎల్.రమణను టీఆర్ఎస్ లో చేర్చుకుంది. ఆయన కూడా హూజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తే, ఆయనకు కూడా రాష్ట్ర స్థాయిలో ఓ పదవికి హామీ ఇచ్చినట్లు సమాచారం. బీజేపీ నేతలు, సీనియర్ రాజకీయులు మోత్కుపల్లి నరసింహులు, పెద్దారెడ్డిలను కూడా టీఆరెస్ లో చేర్చుకున్నారు..! 4. వీటన్నింటికీ తోడు పోలీసులు, మంత్రులు ఇలా అధికార యంత్రాంగాన్ని మొత్తం హుజూరాబాద్ మీద ప్రయోగించింది..! 5. చివరి ప్రయత్నంగా ఓటర్లకు విపరీతంగా డబ్బు వెదజల్లింది. రూ. 3 వేలు మొదలుకొని కొన్నిచోట్ల రూ. 6, 7 వేలు వరకు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. ఇలా ఈటలను ఓడించడానికి అధికార టీఆర్ఎస్ పంచతంత్రం అనే మంత్రాన్ని వేసింది. ఈటలను అష్టదిగ్బంధం చేసే ప్రయత్నం చేసింది. కానీ హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి లొంగలేదు. అందుకే దళిత బంధు ఏ ఊరులో అయితే ప్రారంభించారో ఆ ఊరులోనే ఈటల రాజేందర్ కు మెజార్టీ వచ్చింది. సో..ఇది దేశానికి అంతా ఒక పాఠమేనని భావించవచ్చు..!
Huzurabad: ఏపీలో జగన్ అప్రమత్తం కావాల్సిందేనా..!?
ఏపి రాజకీయాన్నే చూసుకుంటే.., ప్రజలకు డబ్బులు ఇస్తే సరిపోతుందా..!? ఓట్లు వేసేస్తారా..!? 30 ఏళ్ళు సీఎంగా ఉండాలన్న జగన్ లక్ష్యం నెరవేరుతుందా..!? ఏమో.., పథకాలు ఎంత మేరకు పని చేస్తాయో..! సంక్షేమ పథకాలు ఇస్తే చాలు ఓట్లు వేస్తారు అని ఏపిలో అధికార పార్టీ ఉంది. అందుకే అభివృద్ధి విషయంలో కొంత వెనుకబడింది. మరోవైపు ప్రతిపక్షాలపై కక్షలు, కేసులు అనే ఆరోపణలు ఎక్కువ వస్తున్నాయి. కొత్త ఉద్యోగాలు లేవు, డీఎస్సీ లేదు, నియామకాలు లేవు. ఇలా చాలా ఇబ్బందులు కనబడుతున్నాయి, కొన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నది కాదనలేని వాస్తవం.. ఇక్కడ వైసీపీ, జగన్ నమ్మకం ఏమిటంటే సంక్షేమ పథకాలు విపరీతంగా ఇస్తున్నాం. ప్రతి కుటుంబానికి ఏడాదికి ఏదో ఒక పథకం పేరుతో రూ. లక్ష రూపాయల వరకూ లబ్ది చేకురుస్తున్నాం అని అనుకుంటున్నారు. కానీ అదే పని చేస్తే హూజూరాబాద్ లో కచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలవాలి.
చంద్రబాబు విఫలమయ్యారుగా..!
ఏపిలోనూ 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా పసుపు కుంకుమ కింద పదివేల చొప్పున పంపిణీ చేసింది… ఎన్నికలకు మూడు నెలల ముందు వరకు రూ. వేయి ఉన్న పింఛనును రూ. 2 వేలకు పెంచారు.. రుణమాఫీ చివరి విడత వదిలేశారు.. అయినప్పటికీ అప్పుడు ఆయన పార్టీకి ఓట్లు రాలలేదు. ఇప్పుడు తెలంగాణలోని హూజూరాబాద్ ఎన్నికల్లోనూ కేసిఆర్ పాచిక పారలేదు. హూజూరాబాద్ ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా నిస్కర్షగా తీర్పు ఇచ్చారు. అధికార టీఆర్ఎస్ ను ఢీకొట్టడానికి ఈటల రాజేందర్ కూడా తెరవెనుక చేయాల్సిన ప్రయత్నాలను చేశారు. బీజేపీ అండ తీసుకున్నారు. ప్రత్యర్ధులు పెద్ద ఎత్తున పంపకాలు చేసినా అంత కాకపోయినా కొంత చొప్పున అయినా పంపిణీలు చేశారని సమాచారం. కాంగ్రెస్ పార్టీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారు. అధికారంలో ఉంటే ఏదైనా చేయవచ్చు, ఎలాగైనా నెగ్గవచ్చు అనుకునే రాజకీయ పార్టీలకు హూజూరాబాద్ ఎన్నికల ఫలితం ఒక గుణ పాఠంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.