రాజా స్టైలే వేరు
గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ బాగా దెబ్బతిన్నా… ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని విజయం సాధించాడు రాజా సింగ్… ఓల్డ్ సిటీలో బీజేపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ… అటు పార్టీలోనూ… ఇటు హిందూ సమాజంలోనూ చెరగని ముద్రవేశాడు. బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా ఎదుగుతున్న రాజా సింగ్.. తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ నిత్యం వార్తల్లో ఉంటాడు. దేశంలోనే గణేశ్ ఉత్సవాలకు పెట్టింది పేరైన హైదరాబాద్ వేడుకల విషయంలో సర్కారుకు రాజాసింగ్ ఓ డిమాండ్ పెట్టారు. గణేశ్ విగ్రహాలకు సంబంధించి ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలను రాజా సింగ్ తప్పుబట్టారు. పండుగకు నాలుగు రోజుల ముందు… ఇళ్లల్లో జరుపుకోవాలంటూ సూచించడమేంటని ప్రశ్నించారు. ఒకవేళ ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ముందుగానే చెబితే… తగిన విధంగా గణేశ్ తయారీదారులు నిర్ణయం తీసుకునేవారన్నారు.
ముందస్తుగా ఎందుకు చెప్పలేదు
కరోనా వైరస్ మార్చి నుంచే దేశంలో ప్రభావం చూపిస్తున్నప్పుడు ముందుగా ఎందుకు తయారీదారులకు సూచనలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ముందస్తుగా గణేశ్ తాయారీదారులకు సూచనలు చేసి ఉంటే ఇప్పుపడు ఇలాంటి పరిస్థితులు తలెత్తేవి కాదన్నారు. ప్రభుత్వం కరోనా నియంత్రణ చేస్తున్నప్పుడు పండుగ గురించి క్లారిటీ ఇస్తే అది తయారీదారులతోపాటు… పేద ప్రజలకు మేలు జరిగేదన్నారు. ధూల్ పేటలో కార్మికులు ఆరు నెలల ముందు నుంచి గణేశ్ తయారు చేస్తున్నారని… ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పర్యావరణానికి ఇబ్బంది కలగని విధంగా ఒక అడుగు నుంచి పది అడుగుల విగ్రహాలను తయారు చేశారని… ఇప్పుడు అందరూ ఇళ్లలోనే గణేశ్ పండుగ చేసుకోవాలంటే.. ఆ విగ్రహాల అమ్మకం ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. ధూల్పేట్లో గణేశ్ తయారీదారులంతా బయట నుంచి అప్పులు తీసుకొచ్చి విగ్రహాలను తయారు చేశారని… ఇప్పుడు వారి పరిస్థితేంటని ప్రశ్నించారు. వారి జీవితాలను ప్రమాదంలో పడేయవద్దని కోరారు.
ప్రభుత్వమే విగ్రహాలు కొనుగోలు చేయాలి
ప్రభుత్వం లక్ష గణేశ్ లు పంచుతామంటూ ప్రకటనలు ఇస్తుందని… ధూల్ పేట తయారీదారుల వద్ద నుంచి విగ్రహాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రాజాసింగ్. ధూల్ పేట తయారీదారులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే అందుకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే తయారీదారుల వద్ద నుంచి గణేశ్ విగ్రహాలు కొనుగోలు చేసి… పంపిణీ చేయాలన్నారు రాజాసింగ్. ప్రభుత్వం ధూల్ పేటలో గుడుంబా నిషేధిస్తే… ఇక్కడ ప్రజలు పూర్తిగా సహకరించి… బతుకుదెరువు కోసం గణేశ్ విగ్రహాల తయారీపై ఆధారపడ్డారన్నారు. ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం వారి బతుకుదెరువు లేకుండా చేస్తారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గణేశ్ విగ్రహాల అమ్మకాల ద్వారా ధూల్ పేటలో చాలా మంది ఏడాదిగా జీవనం సాగిస్తారు. అలాంటి వారికి పండుగ ముందు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అశనిపాతమవుతుందన్నారు. కరోనా విషయంలో జాగ్రత్తలుతీసుకోవాల్సిందేనని… ఇప్పుడప్పుడే తగ్గి పరిస్థితి లేదని… బక్రీద్ సమయంలో ప్రభుత్వం ఏవిధంగా సహకరించిందో చూశామని…. ఇప్పుడు ఎందుకు హిందువుల విషయంలో పక్షపాతం ఎందుకుని ఆయన ప్రశ్నించారు.