జగన్ కి అత్యంత ఆప్తుడైన ఐఏఎస్ అజయ్ కల్లం కి ఈరోజు కళ్లెం పడింది. ఆయన సీఎం కార్యాలయంలో కొన్ని శాఖలపై గుత్తాధిపత్యం చెలాయించేవారు. కానీ ఈరోజుతో బ్రేక్ పడింది. ఎందుకో..? ఏమిటో..? లోపలి వెళదాం. కానీ ఉన్నట్టుండి… ఐఏఎస్ లలో ప్రవీణ్ ప్రకాష్ కి పూర్తి ఆధిపత్యం వచ్చేసింది. ఎన్నికల ముందు నుండి సీఎం జగన్ కి నీడగా, తోడుగా ఉన్న… ఐఏఎస్ లు అధికారం వచ్చాక కూడా అలాగే ఉంటారనుకున్న ఐవైయార్ కృష్ణారావు ముందుగానే బిజెపి లోకి వెళ్లిపోగా, ఎల్వీ సుబ్రహ్మణ్యం మధ్యలోనే వెళ్లిపోగా, తాజాగా అజయ్ కల్లం రెడ్డికి కత్తిరింపు పడింది. దాదాపు ఏడాది పాటు సీఎం కార్యాలయంలో చక్రం తిప్పిన ఈయన నేటితో పగ్గాలు వదులుకున్నట్టే. కాకపోతే కార్యాలయంలో హోదాలో మాత్రం కొన్నాలు కొనసాగుతారేమో.
ఈరోజు జరిగిన మార్పులేమిటంటే…??
సీఎం కార్యాలయం బాధ్యతలు నుంచి అజేయ్ కల్లాం, పీవీ రమేష్, జే. మురళి తప్పించిన సీఎం జగన్. ఆ ముగ్గురి బాధ్యతలను ప్రవీణ్ ప్రకాష్, సాల్మాన్ ఆరోఖ్య రాజ్, ధనుంజయ్ రెడ్డిలకు బదలాయింపు చేసారు. ప్రవీణ్ ప్రకాష్ పరిధిలో… జీఏడీ, హోం, రెవెన్యూ, ఫైనాన్స్, న్యాయ శాఖ, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, సీఎం డ్యాష్ బోర్డ్…! సాల్మన్ ఆరోఖ్య రాజ్ పరిధిలో… రవాణ, ఆర్ అండ్ బి, ఆర్టీసీ, గృహ నిర్మాణం, పౌర సరఫరాలు, పీఆర్, సంక్షేమం, విద్యా, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ, గనులు, కార్మిక శాఖ…! ఇక ధనుంజయ్ రెడ్డి పరిధిలో… జలవనరులు, అటవీ, మున్సిపల్, వ్యవసాయం, వైద్యారోగ్యం, ఇంధనం, టూరిజం, మార్కెటింగ్, ఆర్ధిక శాఖ ఉంటాయి.
అజయ్ కల్లం ప్రాధాన్యత తగ్గుతూ…!
నిజానికి అజయ్ కల్లం రెడ్డి ఎన్నికలకు ఆరు నెలల ముందు నుండి జగన్ కి సన్నిహితుడుగా మారారు. నాడు చంద్రబాబు పాలనలో కీలక అధికారిగా పని చేయడంతో లోగుట్టు మొత్తం తెలుసుకున్నారు. అవన్నీ ఎన్నికలకు ముందు చంద్రబాబుపై విమర్శల రూపంలో బయట పెట్టారు. తద్వారా జగన్ కి చేరువయ్యారు. అందుకే అధికారం వచ్చిన వెంటనే జగన్ అజయ్ కల్లం కి బహుమానం గా “సీఎం కి ప్రత్యేక కార్యదర్శి” గా కుర్చీ వేశారు. నెల్లకు రూ. లక్షల్లో జీతాలిప్పించారు. కొన్ని శాఖలపై పూర్తి ఆధిపత్యం ఇచ్చారు. కొన్ని శాఖల నిర్ణయాల్లో అజయ్ ని దాటి చేయడానికి వీల్లేదు. అటువంటి అజయ్ కల్లం రెడ్డికి కళ్లెం పడడంలో ఆయన స్వీయ తప్పులు కొన్ని… మరో ఇద్దరు ఐఏఎస్ ల లాబీయింగులు కొన్ని పని చేశాయని సమాచారం. ముఖ్యంగా అజయ్ కల్లం కొన్ని ఆర్ధిక వ్యవహారాల్లో తలదూర్చారని జగన్ కి పిర్యాదులు వెళ్లాయి. దీంతో అంతర్లీనంగా అంటారో ఐఏఎస్ చేత విచారణ చేయించి, కొన్నాళ్ళు ఆ వ్యవహారాలకు దూరంగా పెట్టారు. కానీ పరిస్థితిలో మార్పు రాలేదు. అలా అలా ప్రాధాన్యత తగ్గిస్తూ.., చివరికి పక్కన పెట్టే స్థితి వచ్చింది.