Corona virus in India : దేశంలో కారోనా Corona virus in India డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గతేడాది వ్యాక్సిన్ కూడా లేని సమయంలో వేలల్లో మహా అయితే లక్ష దాటకుండా కేసులు వచ్చేవి. వైరస్ ఎలాంటిదో.. ఎంత తీవ్రత ఉంటుందో.. వ్యాక్సిన్ కూడా లేదు.. అనే భయాలతోనే అనేక జాగ్రత్తలు తీసుకుంటూ గడిపేశాం. 2020 ఎప్పుడు వెళ్లిపోతుందా అని ఎదురు చూశాం కూడా. మొత్తానికి 2020 వెళ్తూనే నిజంగానే కోవిడ్ తీవ్రతను భారత్ లో తగ్గించింది. వ్యవస్థలు గాడిలో పడుతున్నాయి. ప్రజలు ఆర్ధిక స్థితిగతులు మెరుగుపడే దిశగా వెళ్తున్నాయి. దేశ ఆర్ధిక పరిస్థితి మునుపటిలా మారే అవకాశాలు కనిపించాయి. కానీ.. ఇంతలోనే మళ్లీ కుదుపు. అలా.. ఇలా కాదు.. ఏం చేయాలిప్పుడు? అనేంతగా..!
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఇప్పుడేం చేయాలి? ఇలా అయితే ఎలా? ఎప్పటికి తేరుకుంటాం? అనే భయాలు ప్రజల్లోనే కాదు.. ప్రభుత్వాల్లో కూడా కనిపిస్తోంది. వాస్తవానికి గతేడాది ఇంతకంటే ఎక్కువే భయపడ్డాం. జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ.. ప్రస్తుతం దేశంలో కోవిడ్ మహోగ్రరూపం చూస్తుంటే గతేడాది జరిగిందంతా లైట్ అనేలా.. దానికే అంత భయపడ్డామా? అనిపించక మానదు. పైగా.. ఈ ఏడాది కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి. రెండు వ్యాక్సిన్లు తయారుచేసి భారత్ ప్రపంచం చేత శెభాష్ అనిపించుకుంది. కానీ.. ఏం లాభం..? బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాల్లో సెకండ్ వేవ్ కంటే తీవ్రంగా భారత్ లో సెకండ్ వేవ్ అత్యంత ప్రమాదకరంగా మారిపోయింది. రోజుల్లెక్కన కేసులు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ రెండు లక్షలకు తక్కువ నమోదు కావడం లేదు.
గతేడాది మర్కజ్ యాత్రికుల వల్ల కరోనా వ్యాప్తి జరిగిందని ఆరోపణలొస్తే.. ఇప్పుడు కుంభమేళాలో లక్షలాది మంది సాధువులు గుమిగూడిపోయారు. వాళ్లలో 2వేల మందికే కరోనా వచ్చినట్టు ప్రభుత్వం చెప్తున్నా.. ఆ సంఖ్య లక్షల్లోనే ఉంటుందని అంచనా. గతేడాది కరోనా నెపాన్ని చైనా మీద తోసేసాం. కానీ ఇప్పుడు అదే చైనాలో భారత్ కు విరుద్దంగా కరోనా అనే పదమే తెలీనట్టు ఉంది. కరోనా నిబంధనలు, మాస్కులు, భౌతికదూరం పాటించాలని చెప్పే ప్రభుత్వాలే ఎన్నికల సభలు, ర్యాలీలు నిర్వహించి కరోనాకు కారణమవుతున్నాయి. హైదరాబాద్ నిన్న జరిగిన ఇఫ్తార్ విందులోనూ భౌతికదూరం లేదు. భారతీయుల నిర్లక్ష్యమే ప్రస్తుత పరిస్థితికి కారణమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ ఎలా.. ఎప్పుడు కోలుకుంటుందో..!?