లాక్ డౌన్ జూన్ వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే పనులు లేవు. కొనుగోళ్లు లేవు. వ్యాపారాలు లేవు. మధ్యతరగతి, పేద వర్గాల ఆదాయానికి గండి పడింది. ఇదే కొనసాగితే ఏం జరగనుంది? పేద కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుంది? ఆర్థిక నిపుణులు లెక్కలు ఏం చెబుతున్నాయి? అనే ఒక సారి చూద్దాం. తాజాగా ప్రపంచ బ్యాంకు, దాని అనుబంధ సంస్ధల లెక్కలు చూస్తే కరోనా ప్రభావం దేశంపై ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా కేసులను ఎదుర్కోవడంతో పాటు, ఆర్థికాన్ని కాపాడుకోవడం దేశంపై పెద్ద సవాలుగా ఉన్న విషయం తెలిసందే. తాజాగా ప్రపంచ ఆర్థిక నిపుణులు, ప్రపంచ బ్యాంకు కూడా దేశానికి ఒక షాక్ ఇచ్చే విషయం చెప్పింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా నిరు పేదలు పెరుగుతారని, అన్ని దేశాల కంటే మన దేశంలోనే ఇటువంటి నిరుపేదలు ఎక్కువవుతారని ఒక నివేదిక రూపొందించింది.
దేశం పైనే ప్రభావం ఎక్కువ
ఆరు నెలల కిందట ప్రపంచవ్యాప్తంగా 63 కోట్ల మంది నిరుపేదలు ఉన్నారు. అంటే కరోనా ప్రభావం ప్రారంభం కాకముందు లెక్క ఇది. తర్వాత కరోనా తర్వాత అంటే ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రపంచవ్యాప్తంగా 70 కోట్లు నిరుపేదలు ఉంటారని ప్రపంచ బ్యాంకు అనుబంధ సంస్థ ఓ నివేదిక తయారు చేసింది. అంటే దాదాపు ఏడు కోట్ల మంది కొత్తగా నిరు పేదలుగా మారానున్నారు. కరోనా పేదలపై చేసిన గాయం ఇది. ఇక్కడ పేదరికం కొలమానం ఓ పెద్ద తతంగమేమి కాదు. ప్రపంచ బ్యాంకు రూపొందించిన ఈ నివేదిక ప్రకారం రోజుకు 150 రూపాయల సంపాదన, అంత కంటే తక్కువ ఉన్నవారిని లెక్కించారు. అంటే ఈ ఏడాది చివారినాటికి కరోనా పోతేనే ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మంది రోజుకి 150 కంటే తక్కువ తో బతకాల్సి వస్తోంది. ఒకవేళ ఈ వ్యాధి వెళ్లకపోతే సంఖ్య పెరుగుతుంది. ఈ లెక్క కూడా ప్రపంచమంతటా ఒకేలా ఉండదు. మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలు అధికంగా ఉన్న దేశాల్లోనే ఎక్కువ ప్రభావం ఉంటుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. అంటే ఉదాహరణకు ఇండియా, నైజీరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో వంటి దేశాలు లో నిరుపేదలు పెరుగుతారు. అలాగే చైనా, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో సంపద తగ్గుతుంది.. కానీ పేదరికంపై పెద్దగా ప్రభావమే ఉండదు.
- ఉద్దీపనలు చాలవు…!
మనదేశంలో కొత్తగా కోటిన్నర అ మంది నిరుపేదలు తయారవుతారు. ఇప్పటికే దేశ జనాభాలో 17 శాతం మంది నిరుపేదలు ఉన్నారు. ఆ సంఖ్యకు ఈ కోటిన్నర అదనం. ఈ లెక్క కూడా కరోనా ఈ ఏడాది చివరికల్లా వెళ్లిపోతేనే. లేకపోతే సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీనికి తక్షణ చర్యలు గా కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకోవలసిన రక్షణ చర్యలను కూడా ప్రపంచ బ్యాంకు అనుబంధ సంస్థలు సూచించాయి. దేశీయంగా ఎక్కువగా ఆదాయం ఉన్న పెట్రోలియం, మద్యం, వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా దేశ జి.డి.పి కాపాడుకుంటూనే పేదలకు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తే… కొంతవరకు ఇబ్బందులు తొలగుతాయని ఆ సంస్థల సూచించాయి. ఇప్పటికే దేశంలో మొదటి విడతగా 1.7 లక్షల కోట్లు ప్యాకేజీ ఇచ్చారు. రెండో విడతలో కూడా వలస కార్మికులకు ఇవ్వడానికి ప్రతిపాదనల్లో ఉంది. ఇదే కాకుండా పేదరికం పెరక్కుండా ఏ చర్యలు తీసుకోవాలి ఆ సంస్థ సూచించింది. మొత్తానికి ప్రపంచ ఆర్థికం, పేదరికం మూడేళ్ళ వెనక్కు వెళ్లినట్టు సంస్థ అంచనా వేసింది.