ఎవరేమనుకుంటే… నాకేంటి? ఇదీ తెలంగాణ సీఎం కేసీఆర్ ఫిలాసఫీ. అవును కరోనా తెలంగాణలో లేదు లేదంటూ నెల రోజుల క్రితం చెప్పుకొచ్చిన అక్కడి మంత్రులు.. ఇప్పుడు రోజూ వస్తున్న కేసులతో బేజారైపోతున్నారు.
కర్నూల్ వెళ్లొద్దు… గుంటూరు వెళ్లొద్దు కరోనా ప్రమాదం వస్తుందని చెప్పిన ఆ నేతలు ఇప్పుడు తెలంగాణలో అంతకంతకూ పెరుగుతున్న కేసులతో తలపట్టుకుంటున్నారు. ఇప్పుడెందుకు కరోనా లెక్కలా అనుకుంటున్నారా… కరోనా ఇంతలా రెచ్చిపోతుంటే.. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న ఓ నిర్ణయం రాజకీయంగా కాకరేపుతోంది.
తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తుంటే సీఎం కేసీఆర్ మాత్రం… తన దృష్టంతా తన ప్లానింగ్ పైనే పెడుతున్నారు. అవును ఇక్కడ చర్చిస్తున్న అంశం తెలంగాణ సచివాలయం గురించే. తెలంగాణ సచివాలయం ఉమ్మడి రాష్ట్రానికి ఒక కాంతి పుంజం. 13 మంది ముఖ్యమంత్రులు ఇక్కడ పాలన సాగించారు. అంతటి ఘన చరిత్ర ఉన్న సచివాలయాన్ని కూల్చి ఇప్పుడు కొత్త సచివాలయాన్ని నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. 132 ఏళ్ల చరిత్ర ఉన్న సచివాలయాన్ని రాత్రికి రాత్రే నెలకూల్చేస్తోంది.
హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యమన్నట్టుగా చకచకా పనులు కానిచ్చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ నిర్ణయం బ్లాక్ డే అంటూ విపక్ష కాంగ్రెస్
నిప్పులు చెరిగితే… కరోనా వ్యవహరాన్ని దారి మళ్లించేందుకే ఈ నిర్ణయమంటూ బీజేపీ నేతలు సౌండ్ చేస్తున్నారు.
మొత్తంగా ఎవరెన్ని చెప్పినా కేసీఆర్ సారూ మాత్రం తన మాటను నెగ్గించుకోవాలన్న పంతంతో ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా… ఒకరకంగా చెప్పాలంటే ఇండియాలోనే ఒక ఐకానిక్ సింబల్ గా తెలంగాణ సచివాలయాన్ని నిర్మించాలని తలపెట్టారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే బ్లూప్రింట్స్ కూడా తయారైపోయాయ్.
అధికార పగ్గాలు చేపట్టాక సీఎం కేసీఆర్ సచివాలయానికి పెద్దగా వచ్చిందీ లేదు. రివ్యూలు జరిపింది లేదు.
2016 నవంబర్లో చివరిసారిగా కేసీఆర్ వచ్చారు. 2019 జూన్ 27న కొత్త సెక్రటేరియేట్ శంకుస్థాపన సందర్భంగా అడుగు పెట్టారు. ఇక కొత్త సచివాలయంలోనే కేసీఆర్ కాలుపెడతారనుకోవాలి. సచివాలయాన్ని కూల్చేయాలన్న సంగతి సీఎంకు అత్యంత నమ్మకమైన ఓ స్వామిగారు చెప్పారని విపక్షాల నేతలు విమర్శలు గుప్పిస్తుంటారు. వాస్తు లేకుండా ఇష్టానుసారం సచివాలయం కట్టారన్న అభిప్రాయం వచ్చిందని… భవిష్యత్ లో టీఆర్ఎస్ ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే కూల్చివేత నిర్ణయమన్న అభిప్రాయం కూడా విన్పిస్తోంది.
ఆయనంతే…ఎవరెన్ననుకున్నా… ఆయన చేయాల్సిందే చేస్తారు. విమర్శలను పట్టించుకోరు. ప్రజల ఆమోదం లేని నాయకులు మట్లాడితే ఎంత… మాట్లాడకుంటే ఎంత అంటారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసే నిర్ణయం తీసుకుంటే విమర్శలెందుకన్నది ఆయన చతురత. మిగతా రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణ సచివాలయం ఉంటే అది రాష్ట్రానికి, తద్వారా టీఆర్ఎస్ పార్టీకి అఖండ గౌరవాన్ని తీసుకొస్తాయన్న సారు భావన.