అక్కడ నిర్ణయమే “సుప్రీం” అంటూ..!!
అధికారులతో రివ్యూలో సర్కారు వ్యూహం ఖరారు..
నిమ్మగడ్డ రమేష్ ను ఎన్నికల కమిషనర్ గా కొనసాగించే విషయంలో ఇంకా జగన్ సర్కార్ వెనకడుగు వేయటం లేదు. ఇప్పటికే హైకోర్టు తీర్పు..స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ..కోర్టు ధిక్కరణ పిటీషన్ విచారణ లో భాగంగా..గవర్నర్ ను కలవాలని రమేష్ కుమార్ కు సూచన…హైకోర్టు ఉత్తర్వుల మేరకు నడుచుకోవాలని ప్రభుత్వానికి తాజాగా గవర్నర్ ఆదేశం.
దీని పైనే ముఖ్యమంత్రి జగన్ అడ్వకేట్ జనరల్ తో పాటుగా ముఖ్య అధికారులతో సుదీర్ఘ మంతనాలు జరిపినట్లు సమాచారం.మంత్రుల ప్రమాణ స్వీకారం ముగిసిన తరువాత సైతం జగన్ ఇదే అంశం పైన గవర్నర్ తో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలోనే హైకోర్టు తాజా సూచనలు..గవర్నర్ ఇచ్చిన ఆదేశాల అమలులో తమ వాదనను జగన్ బిశ్వభూషన్ ముందుంచారు. ఇక, ప్రభుత్వంలోని ముఖ్యుల వాదన గమనిస్తే తాము గవర్నర్ ను ధిక్కరించటం లేదని చెబుతూనే..ఆదేశాలు అమలు పైన మాత్రం స్పష్టత ఇవ్వటం లేదు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి మూడ్ ను పరిశీలించిన వారు మాత్రం ఆయన ఆలోచన ఏంటనేది పరోక్షంగా చెబుతున్నారు. దీంతో..24 లేదా 25వ తేదీన రమేష్ కుమార్ విషయంలో తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
గవర్నర్ ఆదేశాలపై కీలక చర్చలు…
నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనను కలిసిన తరువాత గవర్నర్ దీని పైన కొందరు న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నట్లుగా సమాచారం. ఆ వెంటనే రమేష్ కమార్ విషయంలో హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ను అమలు చేయాలంటూ ప్రభుత్వానికి సూచిస్తూ గవర్నర్ లేఖ రాసారు. దీని ద్వారా హైకోర్టు గతంలో ప్రభుత్వం ఎన్నికల మార్గదర్శకాల పేరుతో జారీ చేసిన ఆర్దినెన్స్ ను రద్దు చేయటంతో పాటుగా రమేష్ కుమార్ ను కొనసాగించాలని ఆ సమయంలో స్పష్టంగా తీర్పు ఇచ్చింది. దీని పైన ప్రభుత్వం సుప్రీంకు వెళ్లటంతో ఆ ఆదేశాలు అమలు కాలేదు. ఇక కోర్టు ధిక్కరణ పిటీషన్ పైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ సుప్రీంలో ప్రభుత్వం మరో పిటీషన్ దాఖలు చేసింది. ఇంతలోనే గవర్నర్ ఈ ఆదేశాలిచ్చారు. ఇదే అంశం పైన మంత్రివర్గ విస్తరణ తరువాత ముఖ్యమంత్రి తమ వాదనను గవర్నర్ కు వివరించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పుపై తాము సుప్రీం కోర్టుకు వెళ్లగా..హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటీషన్ విచారణ..సూచనలు సరి కాదని ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. దీంతో..వైసీపీ నేతలు సైతం తాము గవర్నర్ కు వ్యతిరేకం కాదని..తమకకు గౌరవం ఉందని చెబుతూనే ఆదేశాల అమలులో మాత్రం ఏం చేయాలనే దాని పైన కీలక చర్చలు నిర్వహించినట్లు సమాచారం.
సుప్రీం నిర్ణయం..అదే ఫైనల్…
రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ల పైన ఈ నెల 24న సుప్రీంలో విచారణ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. హైకోర్టు తీర్పు పైన అప్పీల్ తో పాటుగా..కోర్టు ధిక్కరణ పిటీషన్ లో హై కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండా చూడాలని కోరటంతో..సుప్రీంలో వచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి ప్రభుత్వంలోని ముఖ్య అధికారులతో నిర్వహించిన రివ్యూలోనూ ఇదే రకమైన సంకేతాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో గవర్నర్ ఆదేశాలు ధిక్కరించారనే నెపం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశంలోనూ ఇదే రకమైన సంకేతాలు ఇచ్చారు. అయితే, గవర్నర్ సైతం హైకోర్టు ఆదేశాల మేరకు వ్యవహరించాలని సూచించారని..హైకోర్టు తీర్పులోనూ కీలక అంశాలు ఉన్నాయనే అంశాన్ని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. దీన పైనా తాము సుప్రీంలో దాఖలు చేసిన పిటీషన్లో పేర్కొన్నామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో..ప్రభుత్వ ఆలోచనలు గమనిస్తే..సుప్రీం కోర్టులో జరిగే విచారణ.. వచ్చే మార్గదర్శకాలను ఫైనల్ గా భావించి తుది నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో..శుక్రవారం ఈ వ్యవహారం ఒక కొలిక్కొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.