గత కొద్ది రోజులుగా ‘వేర్ ఈజ్ కెసిఆర్‘ అనే ఒక హాష్ టాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతూ కనిపిస్తోంది. తెలంగాణలో… మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా ఉద్ధృతి రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే సగటున రోజుకి 1800 కి పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుంటే మరొక వారం రోజుల్లో ఈ సంఖ్య కచ్చితంగా 2000 దాటుతుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య ఎప్పుడూ పెరిగేదే తప్ప ఇప్పుడిప్పుడే తగ్గే పరిస్థితి అయితే ఏ రాష్ట్రంలో లేదు. కానీ తెలంగాణలో ఆ ప్రభుత్వం నియంత్రణ విషయంలో చూపిస్తున్న అజాగ్రత్త మరియు నిర్లక్ష్యం చూసే అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పైన విరుచుకు పడుతున్నారు.
కరోనా సమస్య మొదలైన కొత్తలో కెసిఆర్ కనీసం వారానికి ఒకసారైనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలతో సంభాషించేవారు. అయితే అప్పుడు అసలు రోజుకి 100, 200 కరోనా నిర్థారణ టెస్టులు జరిపితే ఒక 10, 15 కేసులు బయటపడేవి. హైకోర్టు ఏనాడైతే ఖచ్చితంగా అధికస్థాయిలో కరోనా టెస్టులు జరపాల్సిందే అని ఆదేశాలు జారీ చేసిందో…. అప్పుడు మొదలైంది అసలైన కథ. ఒక్కసారిగా కేసుల సంఖ్య తెలంగాణలో చాలా దారుణంగా పెరిగిపోయాయి. అది కూడా రోజుకి అయిదు లేదా ఆరు వేల టెస్టులు చేస్తుంటేనే.
ఇక కేసీఆర్ ప్రెస్ మీట్ లు అప్పటి నుండి పెట్టడం మానేశారు. “సరే ప్రెస్ మీట్ లు పెట్టకపోతే పెట్టకపోయావు కనీసం నిర్థారణ టెస్టుల సంఖ్యను అయినా పెంచండి మహాప్రభో….” అని ప్రజలు మొత్తుకుంటున్నారు. హైకోర్టు వార్నింగ్ ల మీద వార్నింగ్ ఇస్తూనే ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా గత వారం రోజుల్లో రెండు సార్లు రెండు రోజుల చొప్పున తెలంగాణలో టెస్టింగ్ ఆపేశారు.
అయితే అటు వైపు చూస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలో ఏ రాష్ట్రానికి వీలు కాని రీతిలో 10 లక్షల కరోనా టెస్టులు జరిపి అందరితో శభాష్ అనిపించుకుంది. ఇక్కడ పోల్చి చూడడం కాదు కానీ గత కొద్ది రోజుల్లో తెలంగాణలో పాజిటివ్ కేసులు పెరిగిన రేటు…. ఆంధ్రలో పెరిగిన రేట్ ను గమనిస్తే ఎంత తేడా ఉందో అందరికీ అర్థం అవుతుంది. ఇక ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కేసీఆర్ అసలు కనబడకుండా పోవడం… అతని గురించి ఆచూకీ లేకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. అటు నలుగురు ఎమ్మెల్యేలు, రాష్ట్ర హోం మంత్రి మరియు ప్రగతి భవన్ లో 30 మంది ఉద్యోగులు… కరోనా పాజిటివ్ అని తేలడంతో హైదరాబాద్ నుండి ప్రజలు వేరే ఊర్లకు తరలిపోతున్నారు భయంతో.
జగన్ ఒకవైపు కరోనా టెస్టింగ్ తో పాటుగా మరిన్ని సంక్షేమ పథకాలను ఎంతో దిగ్విజయంగా అమలు చేస్తుంటే…. కేసీఆర్ ప్రభుత్వం తలపెడుతున్న ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న వారికి కరోనా పాజిటివ్ అని రావడం తెలంగాణలో దాని యొక్క తీవ్రతను మనకు తెలియజేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టు నుండి పాత సచివాలయం కూల్చివేతకు అనుమతి రాగానే రాత్రికి రాత్రి 1000 మందితో సచివాలయం కూల్చివేత మొదలుపెట్టారు.
అసలు ఈ భవనాన్ని ఒక హాస్పిటల్ గా మార్చి ప్రస్తుతానికి పరిస్థితులు చక్కబడే అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వం అంత త్వరగా కొత్త సచివాలయం నిర్మించాల్సిన అవసరం ఏమిటో అర్థం కావడం లేదని కాంగ్రెస్ నాయకులు విపరీతంగా దుమ్మెత్తిపోస్తుంటే… ప్రజలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కరోనా నియంత్రణలో బెస్ట్ అని.. కేసీఆర్ వరస్ట్ అని విమర్శలు చేస్తున్నారు. మరి ఈ విమర్శలు అన్నింటికీ ధైర్యంగా ముందుకు వచ్చి కేసీఆర్ సమాధానం చెప్పి తెలంగాణ ప్రజల్లో ధైర్యం ఎప్పుడు నింపుతారో చూడాలి.