Jagan Cabinet; వైసీపీ ప్రభుత్వం క్యాబినెట్ విస్తరణకు మరో మూడు, నాలుగు నెలల సమయం ఉంది.. కానీ ఇదిగో పేర్లు అంటూ కొన్ని పుకార్లు, ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి.. ఏ జిల్లాలో ఎవరుంటారు..? ఏ సామాజికవర్గం నుండి ఎవరుంటారు..? అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మంత్రి వర్గ మార్పుల విషయంలో పుకార్లకు ప్రాధాన్యమివ్వకుండా ఉన్న సమాచారం మేరకు.. కచ్చితమైన విశ్లేషణలను “న్యూస్ ఆర్బిట్” అందిస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని రెండు జిల్లాల నుండి మంత్రి పదవుల కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. అవేమిటో.., వారెవరో చూద్దాం..
Jagan Cabinet; చిత్తూరు జిల్లా నుండి ముగ్గురు..!
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు. ఇక్కడ వైసీపీ ఒక్క కుప్పం తప్ప అన్ని స్థానాలను గెలుచుకుంది. అందుకే సీఎం జగన్ ఆ జిల్లకు రెండు మంత్రి పదవులు ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో పాటూ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరిని తొలగించడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. పెద్దిరెడ్డి సీనియర్.., పైగా సొంత జిల్లాలో చంద్రబాబుని బలహీనం చేయడంలో బాగా రాజకీయంగా వర్కవుట్ చేస్తున్నారు.. కాబట్టి ఆయన జోలికి వెళ్లకపోవచ్చు. ఇక మిగిలిన నారాయణ స్వామి ఎస్సి సామాజికవర్గం. ఆయనకు పదవీ గండం ఉంది. ఇక ఈ జిల్లా నుండి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగిరి ఎమ్మెల్యే రోజా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఈ ముగ్గురు ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. ఆల్రెడీ ఆ జిల్లా నుండి ఉన్న మంత్రి పెద్దిరెడ్డి కావడంతో మరొకరికి అవకాశాలు లేనట్టే భావించవచ్చు.. కానీ వారు చాలా తీవ్రంగా ఆశిస్తున్నారు. మొదటి క్యాబినెట్ లోనే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. అందుకే ఈ సారి తమ ప్రయత్నాల్లో మళ్ళీ మునిగారు. మంత్రి పదవి కాకపోయినా టీటీడీ చైర్మన్ అయినా ఇవ్వాలంటూ భూమన కోరుతున్నారు. చెవిరెడ్డికి ఇప్పటికే టీటీడీ బోర్డు సభ్యుడిగా ఇచ్చారు. రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ ఇచ్చారు. మరి తదుపరి క్యాబినెట్ లో వీరిని ఏ మేరకు సర్దుబాటు చేస్తారనేది సందేహమే..
కృష్ణా జిల్లా నుండి ముగ్గురు..!!
ఇక కృష్ణా జిల్లా నుండి కూడా ముగ్గురు పోటీ పడుతున్నారు. ఈ జిల్లా నుండి ప్రస్తుతం ఇద్దరు మంత్రులు ఉన్నారు. పేర్ని నాని, కొడాలి నాని ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి ఊడడం ఖాయమేనని తెలుస్తుంది. సామజిక సమీకరణాల నేపథ్యంలో కొడాలి నాని కంటే పేర్ని నానికే ఎక్కువ ముప్పు కనిపిస్తుంది. కొడాలి నానిని తీసేస్తే ఆ సామాజికవర్గంలో మరో బలమైన, వాదన వినిపించగల నాయకుడు లేరు. పేర్ని నానిని తొలగించినా ఈ సామాజికవర్గం నుండి అనేక మంది మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. సో.., పేర్ని నానికే ముప్పు తప్పకపోవచ్చు. ఈ జిల్లా నుండి కొత్తగా కొలుసు పార్ధసారధి, జోగి రమేష్, మేకా వెంకటప్రతాప్ అప్పారావు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఈ ముగ్గురు సీనియర్లు. మేకా వెంకటప్రతాప్ అప్పారావు వరుసగా రెండోసారి గెలిచారు. ఎన్నికలకు ముందు టీడీపీ నుండి వచ్చి.., మంచి ఆధిక్యతతో గెలుపొందారు. పార్థసారధి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. ఈ ముగ్గురు భిన్న సామాజికవర్గాలకు చెందిన నేతలు. అందుకే ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.