కుటుంబానికి వస్తున్న ఆదాయం, అందుబాటులో ఉన్న వనరులు చూసుకొని ఖర్చు పెడితే అది బాధ్యత. అదే కుటుంబానికి ఆదాయానికి మించి, అందుబాటులో ఉన్న వనరుల పరిధి దాటి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి పంపిణీ లు చేస్తే అది బాధ్యతారాహిత్యం. దానికే సంక్షేమం అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్నారు. ఇది నేడు జగన్ చేస్తున్నది తప్పు అనో, జగన్ కు ముందు చంద్రబాబు చేసింది తప్పు అనో కాదు. రాష్ట్రంలో ఈ పరిస్థితి అలవాటయింది. ప్రజలు బాగా రుచి మరిగారు. నాయకులు బాగా ఇవ్వచూపు తున్నారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత సంక్షేమాన్ని బాగా అలవాటు చేశారు. నిధులకు మించి అందుబాటులో ఉన్న వనరులకు మించి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారు. అవి వాస్తవంగా మంచి ఫలితాలు ఇచ్చాయి. 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు తన పరిధిని తన పరిమితిని వనరులను దాటి ముందుచూపు లేకుండా పూర్తి బాధ్యతారాహిత్యంగా సంక్షేమ పథకాలను మరింతగా అమలు చేశారు. పేదలకు పండుగలు వస్తే పప్పు, బెల్లాలు పంపిణీ చేసినట్లు సంక్షేమ పథకాల పేరిట వివిధ రకాల లబ్ది చేకూర్చారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ కూడా మరింత ముందుకు వెళ్తున్నారు. పరిధిని పూర్తిగా మర్చిపోయి, పరిమితిని, రాష్ట్ర పరిస్థితులు ఏమాత్రం పట్టించుకోకుండా అప్పుల కావడిని ఇంకాస్త ముందుకు తీసుకు వెళ్లి సంక్షేమ జపం తప్ప ఇంకేమి చేయడం లేదు. రాష్ట్రం ఇప్పుడు అప్పుల కుప్పగా తయారు అయ్యింది. నిజానికి 2004 లో చంద్రబాబు అధికారం కోల్పోయిన నాటికి అంటే రాజశేఖర రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే రాష్ట్రం అప్పుల్లో ఉంది. అప్పటి నుంచి అప్పులు పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు గుది బండగా మారాయి. ఈ గుది బండను ఏ మాత్రం లెక్కచేయకుండా జగన్ అప్పులు చేస్తూ, కొత్త అప్పులను వెతుక్కుంటూ, కొత్త అప్పులను పుట్టించుకుంటూ సంక్షేమ కావడిని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ అప్పుల పయనం ప్రమాదకర దిశలో సాగుతున్నట్లు క్రెడిట్ రేటింగ్స్ సంస్థ తాజాగా విడుదల చేసిన లెక్కలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీ రుణ-జీఎస్డీపీ నిష్పత్తి 34.6శాతంకి చేరనున్నట్లు ఆ సంస్థ అంచనా వేసింది. ఇది చాలా అధికమని చెబుతోంది. ఈ నిష్పత్తి 25శాతం వరకే ఉండాలని 14వ ఆర్థిక సంఘం నిర్దేశించింది. దాంతో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు అప్పులు ఎక్కువగా ఉన్నప్పటికీ రుణ-జీఎస్డీపీ నిష్పత్తిని లక్ష్మణ రేఖ పరిధిలోనే ఉంచుకున్నట్లు క్రెడిట్ రేటింగ్స్ సంస్థ పేర్కొంది. ఆ సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం పొరుగు రాష్ట్రమైన తెలంగాణ రుణ-జీఎస్డీపీ నిష్పత్తి 21.4శాతం ఉండగా, ఆంధ్రప్రదేశ్ది అంత కంటే 13.2 శాతం అధికంగా ఉంది.పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్ప్రదేశ్ 28.8శాతం, పశ్చిమ బెంగాల్ 33.3శాతం, రాజస్థాన్ 33.1శాతం లతో పాటు కేరళ 30.1శాతం కంటే ఆంధ్రప్రదేశ్ రుణ-జీఎస్డీపీ నిష్పత్తే 34.6శాతం అధికంగా ఉన్నట్లు రేటింగ్స్ సంస్థ వివరించింది.
అప్పులపై వడ్డీ చెల్లింపుల భారమూ ఏపీపై అధికంగానే ఉన్నది. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 2021 ఆర్థిక సంవత్సరంలో వడ్డీల కింద 12.6శాతం, రుణ చెల్లింపుల కింద 22.5 శాతం ఖర్చు చేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మొత్తం గ్యారెంటీల పరిమాణం రూ.49,442 కోట్లకు చేరింది. తాజా లెక్కల ప్రకారం అత్యధిక రుణభారం ఉన్న రాష్ట్రంగా ఏపీ 6వ స్థానంలో ఉంది.
2020 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్రంపై రూ.3,41,270 కోట్ల రుణ భారం ఉన్నట్లు క్రెడిట్ రేటింగ్స్ సంస్థ పేర్కొంది. రుణభారం పరంగా తెలంగాణ రూ.1,68,725 కోట్లుతో 14వ స్థానంలో ఉన్నట్లు పేర్కొంది.
ఇప్పుడు రాష్ట్రం దాదాపు మూడు లక్షల 41 వేల కోట్లు అప్పుల్లో ఉంది. జగన్ మరో నాలుగు ఏళ్ల పాటు ఇదే తరహా సంక్షేమ పథకాలను కొనసాగించాలంటే సంవత్సరానికి 50 వేల కోట్లు కచ్చితంగా ఖర్చు చేయాల్సిందే. గడిచిన ఐదేళ్లలో కూడా చంద్రబాబు ఇదే చేశారు. ఏటా సగటున 40 వేల కోట్లు పథకాల పేరిట సంక్షేమానికి ఖర్చు పెట్టారు. చంద్రబాబు 2019లో సీఎం గా దిగే సమయానికి రాష్ట్రంపై రెండున్నర లక్షల కోట్ల అప్పు ఉంది. ఇప్పుడు అది కొత్త అప్పు, వడ్డీలు కలుపుకొని 3లక్షల 41వేల కోట్లకు చేరింది. జగన్ ఇప్పుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగించాలంటే..ఏటా మరో 50 వేల కోట్లు అప్పు చేయడం తప్పనిసరి. అంటే 2024 నాటికి దాదాపుగా ఐదున్నర లక్షల కోట్లు అప్పులు రాష్ట్రం నెత్తిపై ఉంటాయి. అప్పులు తీర్చే మార్గం భూములు అమ్మకం తప్ప ఇంకేదీ లేదు. భూములు అమ్మాలన్నా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, రాజకీయ కారణం గాను అది సాధ్యం కావడం లేదు. నాడు నేడు పథకం అమలు కోసం చిన్న పాటి వనరులను అమ్మడానికే ప్రభుత్వం నానా తిప్పలు పడుతోంది. నాడు 2002, 2003 ఆ సమయంలో సంక్షేమ పథకాల అమలుకే చంద్రబాబు కొన్ని భూములను అమ్మచూపారు. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న భూములను అమ్మి అక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ ను డవలప్ చేశారు. ఆ తరువాత అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా సంక్షేమ పథకాల కోసం భూములను అమ్మి ఒక రకంగా మిశ్రమ ఫలితాలు సాధించారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అదే ఫందాలో ఆలోచిస్తున్నప్పటికీ ప్రస్తుత భూములకు అంత విలువ లేక, కొనుగోళ్లకు సిద్ధంగా లేక రాజకీయ కారణాలు, వైషమ్యాలు ఎక్కువ అయిపోయి, వనరులు కూడా ఉపయోగ పడటం లేదు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రాక, ఆదాయం పెరగక, అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది సంక్షేమ కావడి పప్పు బెల్లాల పేరిట పంపిణీ కొనసాగినంత కాలం ఈ అప్పుల భారం ప్రతి నెట్టి పై వేలాడుతూనే ఉంటుంది.