జగన్ రాజకీయాల్లో అడుగు పెట్టిన నాటి నుండి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. 2009 ఎన్నికల్లో జగన్ ఎంపీ అవటం ఆలస్యం తండ్రి వైయస్ చనిపోవడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పొమ్మనలేక పొగ పెట్టి బయటకు పంపించడం, వైస్సార్సీపీ పార్టీ స్థాపించాక జైలు పాలవడం ఇలా వరుసగా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అయినా కానీ ఎక్కడా కూడా వైయస్ జగన్ తగ్గకుండా తల వంచకుండా వైసీపీ పార్టీని అద్భుతంగా తెలుగు రాజకీయాల్లో ఆవిష్కరించారు.
2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు తో పోరాడి గత సార్వత్రిక ఎన్నికల్లో భారీ స్థాయిలో చరిత్రాత్మకమైన విజయాన్ని నమోదు చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ కి మాత్రం ఇంకా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉంటే అధికారంలో ఉన్నవాళ్లు వేస్తున్న రాజకీయ ఎత్తుగడలు… అధికారం వాళ్ళ చేతిలో ఉంది కదా అని చెప్పుకోవచ్చు. కానీ జగన్ అధికారంలోకి వచ్చినా ఎదురు దెబ్బలు తగలడంతో జగన్ కే ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి నెలకొంటుంది. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక న్యాయస్థానాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలకు భయంకరంగా మొట్టి కాయలు మీద మొట్టి కాయలు పడుతూనే ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం, అమరావతి భూముల విషయంలో గాని అలాగే వైసిపి రంగుల విషయంలో గాని జగన్ తీసుకున్న నిర్ణయాలు న్యాయస్థానాలలో అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ పరిణామాలతో ప్రజలలో వైసిపి పార్టీ పలచన పడింది. ఇదిలా ఉండగా తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి మళ్లీ ఆయనకే కేటాయించాలని ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త ఆర్డినెన్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని హైకోర్టు ఆదేశాలు ఇవ్వటంతో న్యాయస్థానంలో జగన్ సర్కార్ కి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఈ విషయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ సర్కార్ కి ఊహించని విధంగా తీర్పు రావటంతో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఏది ఏమైనా జగన్ పొలిటికల్ ప్రయాణం ముందు నుంచి గమనిస్తే ప్రతిపక్షాల నుండైనా అదేవిధంగా న్యాయస్థానాల నుండైనా ఎదురు దెబ్బ తగలటం వెనుక సీక్రెట్ కారణం చూస్తే ముందూ వెనకా ఆలోచించకుండా ఏకపక్ష నిర్ణయాలే అని యదార్థవాది లోకవిరోధి అన్నట్టుగా ఉన్నాయి అని మేధావులు అంటున్నారు. ప్రభుత్వ సలహాదారులను నియమించుకునే విషయంలో జగన్ సరైన జాగ్రత్తలు తీసుకోలేదు అని అందువల్లే పాలనాపరంగా ముందు నుండి న్యాయస్థానాల్లో నిర్ణయాలు నీరుగారి పోతున్నాయి అనే వాదన వినబడుతోంది.