Jagan Letter: “పొద్దున్నే ఒక వార్త. కొవాక్జిన్ తయారు చేసిన సాంకేతిక ఫార్ములాని దేశంలోని ఇతర ఫార్మా కంపెనీలకు ఇవ్వమని చెప్పండి. పేటెంట్ హక్కులకు భంగం లేకుండా, జాగ్రత్తగా చూసుకుని ఇతర కంపెనీలు కూడా వాక్జిన్ తయారు చేస్తే దేశానికి అవసరమైన టీకాలు త్వరగా వస్తాయి. కేవలం భరత్ బయోటెక్ మాత్రమే తయారు చేయాలి అంటే.. ఇప్పట్లో అవ్వదు” ఇదీ సీఎం జగన్ ప్రధాని మోడీకి రాసిన లేఖ సారాంశం. దీనిలో చాలా లోతులున్నాయి. దీనికి మోడీ అంగీకరిస్తే పరిణామాలు ఒకలా ఉంటాయి.. అంగీకరించకపోతే జగన్ వేరే మార్గాన్ని ఎంచుకుంటారేమో..!? నిజానికి జగన్ రాసిన లేఖ కారణాలు, పరిణామాలు ఓ సారి చూసుకుంటే..!
Jagan Letter: ఉద్దేశం మంచిదే..!? కాకపోతే..!!
భరత్ బయోటెక్ ఫార్మా కంపెనీ సామర్ధ్యం ఎంత..!? రోజుకి ఎన్ని వాక్సిన్లు ఉత్పత్తి చేయగలదు..!? ఇలా చేసుకుంటూ వెళ్తే దేశానికి అవసరమైన వాక్సిన్ డోసులు ఎప్పటికి అందించగలదు..!? ఇవే మనకు కీలకం. భరత్ బయోటెక్ ప్రస్తుతం నెలకు సగటున 15 మిలియన్ల (కోటిన్నర) డోసులు మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది. ఆగష్టు నాటికి 60 మిలియన్ల (ఆరు కోట్లు) డోసుల ఉత్పత్తి సామర్ధ్యానికి పెంచాలనేది కేంద్రం లక్ష్యం. ఇది జరిగితేనే దేశానికి సరిపడా మొత్తం వాక్సిన్లు వచ్చే ఏడాది మార్చి నాటికి సిద్ధమయ్యే వీలుంది. కానీ నెలకు ఆరు కోట్లు ఉత్పత్తి అంత సులువు కాదు. పెట్టుబడి పెట్టినా దానికి తగిన యంత్రాంగం, సిబ్బంది, యంత్రాలు, సాంకేతికత, ముడి పదార్ధాలు ఉండకపోవచ్చు. అందుకే ఈ సాంకేతిక ఫార్ములాని ఇతర ఫార్మా కంపెనీలకు ఇస్తే వారు కూడా ఉత్పత్తి మోడల్ పెడితే దేశంలో నెలకు 20 కోట్ల డోసులు ఉత్పత్తి జరిగితే దేశం మొత్తం ఆరునెలల్లో వాక్సిన్ వేసేయొచ్చు. ఇదే జగన్ ఉద్దేశం. కానీ మరో రాజకీయ మెలిక ఉంది..!
రామోజీ వ్యాపార మూలాల్లోకి వెళ్తారా..!?
కొవాక్జిన్ అంటే భరత్ బయోటెక్ వారిది. భరత్ బయోటెక్ అంటే ఈనాడు రామోజీ కుమారుడు కిరణ్ వియ్యంకుడిది. ఆ కంపెనీ సీఈఓ ఆయనే. కొవాక్జిన్ ప్రాజెక్టులో రామోజీ సంస్థలు కూడా భారీగా పెట్టుబడి పెట్టాయని మరో ప్రచారం కూడా ఉంది. జగన్ కీ రామోజీ కి అప్పటి నుండో పడదు. సో.. ఇప్పుడు ఈ లేఖ ద్వారా మోడీని విన్నవించడం ద్వారా కొవాక్జిన్ కి నష్టపరిచేలా జగన్ వ్యవహరించారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిలో మొదటి ఉద్దేశం మాత్రం వాక్సిన్లు ఉత్పత్తి పెంచడమే. దేశానికి సరిపడా ఉత్పత్తి రావడమే. ఆ తర్వాత రాజకీయాలు, నష్టాలు చూసుకోవాలి. ఒకవేళ కొవాక్జిన్ ఫార్ములాని బయటకు ఇవ్వాల్సి వస్తే ఆ కంపెనీలు వారికి వచ్చే ఆదాయంలో భరత్ బయోటెక్ కి కూడా షేర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్క లేఖ ద్వారా జగన్ జాతీయా స్థాయిలో ఒక పెద్ద చర్చకు దారితీసేలా చేసారు. దీనిపై మోడీ ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారింది..!