కొద్ది వారాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని ఊపేసిన ఈఎస్ఐ స్కామ్ ఇప్పుడు మళ్లీ ఒక్కసారిగా ఒక హాట్ టాపిక్ గా మారింది. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పర్సనల్ సెక్రెటరీ మురళీమోహన్ ను ఏసీబీ అరెస్టు చేయడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ స్కామ్ లో లో మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ తర్వాత టిడిపి శ్రేణులన్నీ ఒక్కసారిగా కంగారు పడ్డాయి. కానీ క్రమంగా విచారణా వేగం తగ్గింది. అయినా ఎప్పుడూ దూకుడుగా వ్యవహరించే జగన్ ఈ విషయంలో మాత్రం ఇలా ఆచితూచి ఎందుకు అడుగు వేస్తున్నారు మరియు పాము ని దెబ్బ కొట్టే అవకాశాన్ని కాదని పొద చుట్టూ ఎందుకు జాగారం చేస్తున్నారు?
ఎదురుదాడి ఫలించినట్లే….
ఎప్పుడైతే అచ్చెన్నాయుడు అరెస్ట్ జరిగిందో ఒక్కసారిగా తెదేపా శ్రేణులు ఎదురుదాడి మొదలుపెట్టారు. ఇదంతా కక్షసాధింపు కోసమే అన్నది వారి వాదన.ఆరోహ్య సమస్యతో ఆసుపత్రిలో చేరి అక్కడినుండి జైలుకు తర్వాత హైకోర్టు మరియు ఎన్నోసార్లు పిటిషన్లు, ఇంకా విచారణల నడుమ అచ్చెన్నాయుడిని చివరికి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దీన్ని కారణంగా చూపిస్తూ టిడిపి వారు కొల్లు రవీంద్ర అరెస్టు అయిన వెంటనే వైసిపి ప్రభుత్వం బీసీల పై అరాచకం చేస్తోందని…. వారి పాలనలో బీసీలు నష్టపోయినంత ఏ సామాజికవర్గం నష్టపోలేదని నొక్కి వక్కాణించింది. ఇక ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో అచ్చెన్నతో సహా పది మందిని అరెస్టు చేసిన ఏసీబీ విచారణ మాత్రం ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రిని కానీ మాజీ ఎమ్మెల్యేని కానీ బయటికి ఎందుకు లాగలేకపోతోంది అనే అనుమానాలు వస్తున్నాయి లేదా ఇప్పుడు ఎలాంటి అడుగు వేస్తే అది తప్పటడుగుగా మారే అవకాశం ఉంది అని భయపడుతున్నారా?
ఆధారాలు ఇంకా లేకనే..?
సాధారణంగా ఏ అవినీతి నిరోధక శాఖ ఇన్వెస్టిగేషన్ అయినా పక్క ఆధారాలతోనే మొదలవుతుంది. సరే ముందు వారికి రిపోర్టులు వచ్చిన తర్వాత అందుకు సంబంధించిన వ్యక్తులు తీసుకొని విచారణ జరిపిన కొద్ది సమయంలోనే మిగతా విషయాలన్నీ కూపీ లాగుతారు. వారికి అందుకు సంబంధించిన అద్భుతమైన ట్రైనింగ్ కూడా ఉంటుంది. కానీ అచ్చెన్నాయుడు ఇన్ని రోజులు బెయిల్ను పొందలేకపోయాడు అంటే కేసు ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో అచ్చెన్నాయుడు పెద్దగా పేర్లు బయటపెట్టకపోవడం చూస్తుంటే మిగతా వారిని అరెస్టు చేసేందుకు మరియు వారిను అరెస్టు చేసినప్పుడు మిగతా వాళ్ల నోర్లు ముగించేందుకు తగినన్ని ఆధారాలు లేవని టిడిపి వర్గాలు చెప్పుకుంటున్నాయి. అంతేకాకుండా ఏసీబీ అధికారులు టార్గెట్ చేసిన మంత్రులు, రాజకీయ నాయకులు మరియు ఉద్యోగులను మినహాయిస్తే మిగతా వారి పాత్ర ఎంత అన్నది అనుమానంగానే ఉంది. ఒక స్కామ్ జరిగేటప్పుడు అందుకు సంబంధించిన అధికారులు మరియు వ్యక్తులు, రాజకీయవేత్తలు కలిపి కనీసం 10 నుంచి 20 మధ్యలో ఉంటారు. అయితే ఏసీబీ వారు మాత్రం గంటల తరబడి విచారణ జరుగుపుతుప్పటికీ ఏమీ బయటికి లాగలేకపోవడం గమనార్హం.
చివరికైనా అసలు దెబ్బ కొడతారా?
నిజమో అబద్ధమో ఈఎస్ఐ స్కాం లో నేరం నిరూపితమైతే కోర్టుకు కేసు ట్రయల్ వరకు కు వెళ్లి సదరు నేరస్తులకు శిక్ష పడితే టిడిపి క్యాడర్ సమూలంగా నాశనం అవుతుంది అన్నది వాస్తవం. అయితే ఇక్కడ జగన్ ఏ విషయానికి సంశయిస్తున్నారో అర్థం కావడం లేదు కానీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పర్సనల్ సెక్రటరీ మురళీమోహన్ అరెస్టు తర్వాత టిడిపి వారు బాగా అలెర్ట్ అయిపోయారు. ఇప్పటికే మాజీ మంత్రి తనయుడు పితాని వెంకట సురేష్ పై సెర్చ్ నోటీసు జారి చేశారు. అయితే ఎప్పుడో ముందు జాగ్రత్తగా హైకోర్టులో సురేష్ మరియు మురళి యాంటిసిపేటరీ బెయిల్ కోసం అభ్యర్థించారు. దీని తర్వాత ఏసీబీ కేసుని వేగవంతం చేసింది. ఇకపోతే వారిని హుటాహుటిన అరెస్టు చేసేందుకు తగిన ఆధారాలు కూడా పెట్టుకున్న ఏసీబీ అధికారులు ఇన్ని రోజులు ఇంత జాప్యం ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఏ కేసులో అయినా ఎంత త్వరగా దెబ్బ కొడితే ఫలితం అంత రెట్టింపు ఉంటుంది. మరి కనీస తొందరపాటు లేకుండా ఇంత ఆలస్యం దేనికి…? వెనుక మర్మం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు.
దీనిలో పితాని పాత్ర ఏమిటి?
అచ్చెన్నాయుడు కార్మిక శాఖమంత్రిగా బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత పితాని సత్యనారాయణ మంత్రి పదవిని చేపట్టారు. అయితే మందుల కొనుగోళ్లలో పితాని కుమారుడి జోక్యం ఉందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. సరైన ఆధారాలు లభించిన తర్వాతనే పితాని కుమారుడు సురేష్ ను అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు రెడీ అయిపోయారంటున్నారు. వీరి తరువాత మాజీ మంత్రి పితాని పై ఫోకస్ ఉంటుందా లేక ఆయన చుట్టూ ఉన్నవారు ఊచలు లెక్కపెడతారా అన్నది వేచి చూడాలి. ఈ ఎస్ ఐ స్కామ్ మందుల కొనుగోళ్ళలో వీరిద్దరి పాత్ర నిర్ధారించుకున్న తరువాతే ఎసిబి అరెస్ట్ లకు రంగం సిద్ధం చేసిందని వీరిని విచారిస్తే మరికొన్ని కీలక అంశాలు లభిస్తాయని భావిస్తున్నాయి దర్యాప్తు బృందాలు.