కరోనా ప్రబలిన మొదట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పైన చాలా విమర్శలు వచ్చాయి. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో అతనిని పోచి చాలా దారుణమైన రీతిలో పాలనను కొనసాగిస్తున్నారని…. ప్రజల పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. అయితే జగన్ మాత్రం ఏ మాత్రం తడబాటు లేకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూపోయాడు.
ఇకపోతే మొదట్లో జగన్ కరోనా మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది అని మరియు దానితో కలిసి జీవించాల్సిన రోజులు ముందు ఉన్నాయని ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేసుకుంటే అప్పుడు పచ్చ బ్యాచ్ విపరీతమైన గగ్గోలు పెట్టింది. అసలు సహజీవనం అనే మాటను జగన్ ఎలా అంటారు అని ఎగిరెగిరి పడ్డారు. పచ్చ చొక్కా లోపల దాచి పెట్టి పైకి ఎర్ర చొక్కాలు.. కాషాయం చొక్కాలు ధరించిన వాళ్లు కూడా జగన్ మాటలకు రుసరుసలాడారు.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమూ అదే మాటే చెప్పింది. కరోనాతో కలిసి జీవించడాన్ని నేర్చుకోవాలని ప్రజలకు సూచించింది. మే 17 తర్వాత పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ విధంగా స్పందించడం గమనార్హం. కరోనాతో లాక్ డౌన్ ను ఇంకా పొడిగిస్తూ పోవడం జరిగే పని కాదనే విషయం కేంద్రానికి పూర్తిగా అర్థం అవుతున్నట్టుగా ఉంది. మరి ఇప్పుడేమంటారు? వీళ్లందరి కన్నా ముందు జగన్ ఇదే మాటే చెబితే, వెర్రిమాటలు మాట్లాడినట్టుగా ఇప్పుడూ మాట్లాడతారా! మాట్లాడగలరా?
ఇక ఆ విషయం పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్రంలో రోజూ నమోదు అవుతున్న కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు ముందునుండి ఈ విషయమై ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. ఇక ముందు నుండి ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ డేంజర్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రోజుకి 10 అంతకన్నా తక్కువ కేసులు నమోదు అవుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో కనీసం 50 కేసులు నమోదు కావడం తో అంతా జగన్ పై ఫైర్ అయ్యారు. అయితే లోపల అసలు నిజం ఏంటో ప్రజలకు తెలుసు. సోషల్ మీడియా ద్వారా నిజం వారి కళ్ళముందు కనపడుతూ ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకి 3 వేల నుండి 5 వేల మధ్య కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతూ ఉంటే తెలంగాణలో మాత్రం రోజుకి 150 నుండి 200 మధ్యలో మాత్రమే నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని పలువురు పాత్రికేయులు మరియు ప్రజలు నిలదీసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రోజుకి ఎన్ని టెస్టులు జరుగుతున్నాయో చూపించడం కూడా మానేసింది. సాధ్యమైనన్ని ఎక్కువ పరీక్షలు చేస్తూ ఎంతోమంది కరోనా బాధితులను బయటకు తీసుకు వచ్చి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నందుకు ప్రశంసించడం పోయి అసలు పారదర్శకత లేని ప్రభుత్వం తో పోల్చి విమర్శించడం ఏమిటనే భావనలో ప్రజలు ఉన్నారు.
అలాగే విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులకు ఏపీ ప్రభుత్వం కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించిన తర్వాత కూడా చంద్రబాబు కోటి రూపాయలు సరిపోవని అంతకు రెండు రెట్లు మూడు రెట్లు ఇవ్వాలని అడగడం తెలుగుదేశం పార్టీ వారి దయనీయమైన పరిస్థితి తెలియజేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అసలు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవ్వనంత మొత్తాన్ని జగన్ ప్రకటించినప్పటికీ చింతిస్తూ ఉంటే వారు ఇలా మాట్లాడడం చివరికి జగన్ హైలెట్ చేసినట్లే అవుతోంది.
ఏదేమైనా తెలుగుదేశం పార్టీ వర్గాల తీరు వల్ల జగన్ లోని దార్శానికత మరింతగా బయటపడుతున్నట్టుగా ఉంది!