నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇప్పటిలో తన దూకుడు తగ్గించేలా లేరు. ఒకసారి వైసీపీకి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడతారు…. మరొకసారి జగన్ కి సోప్ వేస్తారు. ఇక తాజాగా ఏపీని ఊపేస్తున్న టెలిఫోన్ ట్యాపింగ్ అంశంపై కూడా తనదైన శైలిలో ఆయన వాదనను వినిపించారు.
మొదలెట్టింది ఆయనే
అసలు ముందు చంద్రబాబు ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖుల ఫోన్లు ప్రభుత్వం టాపింగ్ చేస్తోంది అని ఆరోపణలు చేయకముందే రఘురామరాజు తన ఫోన్ ట్యాపింగ్ కు గురి అవుతోందని చెప్పడం గమనార్హం. దీనికి సంబంధించి కేంద్ర హోం మినిస్ట్రీ కి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక ఈ అంశంలో ప్రభుత్వం తక్షణం స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గతంలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ను ప్రస్తావించారు. విజయసాయిరెడ్డి ఫోన్ ట్యాప్ చేయకపోతే పార్క్ హయత్ హోటల్లో నిమ్మగడ్డ రమేష్, కామినేని శ్రీనివాస్ సుజనాచౌదరి సమావేశాన్ని ‘దుష్ట చతుష్టయం’ గా అని ఎలా ప్రస్తావించారని.. ఆ నాలుగో వ్యక్తి గురించి ఎలా తెలుసునని ఘాటైన ప్రశ్నల్ని సంధించాడు.
జగన్ మంచోడు కానీ ప్రభుత్వం చెడ్డది
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్…. జగన్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా చెప్పాలంటే జగన్ ముఖం అడ్డంపెట్టుకుని రఘురామరాజు ఎంపీగా గెలిచారు అని అందరూ అంటుంటారు. అలాంటిది ఆయన ఇప్పుడు ఆ పార్టీ పైన తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. ఈ విషయం పక్కన పెడితే జగన్ సమయం ఇస్తే అతనితో అన్ని విషయాలు చర్చిస్తానని…. ఈ ట్యాపింగ్ అంశాలపై బోలెడు అనుమానాలు ఉన్నాయని…. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కారు మీద ఉందన్న రఘురాం.. ఖచ్చితంగా తాను జగన్ ను కలవాల్సిందే అని అంటున్నాడు. జగన్ నడిపిస్తున్న ప్రభుత్వం పైన ఒంటి కాలు పై లేస్తూ మరోపక్క ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఒక మంచి వ్యక్తిగా కొనియాడడం ఏ తరహా రాజకీయమో ఎవరికీ అర్థం కావడం లేదు.
అసలు జగన్ మీకు ఏమవుతారు సార్?
మొదటి నుండి రఘురామరాజు జగన్ విషయంలో జాగ్రత్త వహిస్తూనే ఉన్నారు. అనర్హత వేటు కి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో జగన్ అంటే తనకు ఎంతో అభిమానమని…. నేను అతని అభిమాని లాంటివాడిని చెప్పిన రఘురామరాజు బయటకు వచ్చిన ఒక వీడియోలో మాత్రం “ఎవరి నాయకత్వం మీకు కావాలి…? బొచ్చులో నాయకత్వం” అని అన్నారు. ఇకపోతే న్యాయవ్యవస్థపై టెలిఫోన్ నిఘా ఉన్నట్లు రుజువైతే మాత్రం అది ప్రభుత్వానికి మచ్చగా మారుతుందన్న రాజుగారు ప్రభుత్వంలో ఏ ఒక్కరు తప్పు చేసినా ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇంతకీ అసలు మీకు జగన్ శత్రువా…. పార్టీ అధినేతా.. నియంతా.. లేక ఒక మంచి మనిషా..? అన్నది ముందు చెప్పండి రఘురామరాజు గారు అని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు.