అపరిచితుల నుండి ఆ వార్త మొదటిసారిగా తెలిసింది. వ్యాపారం పని మీద లదాఖ్ వెళ్ళిన హఫీజుల్లా రేషికి వాళ్ళ నాన్న గులాం నబి రేషి చనిపోయారు అని ఆగస్ట్ 31 నాడు ఉదయం ఎనిమిదిన్నర సమయంలో ఫోన్ వచ్చింది. ఈ ఫోను శ్రీనగర్ లోని ఒక పోలీస్ స్టేషన్ నుండి వచ్చింది.
ఢిల్లీలో నివసిస్తున్న ఆహార విశేషాల రచయిత అయిన ఆయన భార్య మర్యం రేషికి శ్రీనగర్ లోని మరొక పోలీస్ స్టేషన్ నుండి ఆ రోజు ఉదయం ఫోన్ వచ్చింది. ఈ వార్త అప్పటికే ఆవిడకు తెలిసింది. అంతకు ముందే భర్త ఏడుస్తూ ఫోన్ చేశాడు.
ఈ విషయాన్ని ఆవిడ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన రెండు రోజుల తరువాత గుర్గావ్ లో పనిచేస్తున్న అమీర్ ఇస్మాయిల్ నజర్కి ఈ వార్త తెలిసింది. ఇస్మాయిల్ గులాం నబి రేషీ మరో మనమడు. దానితో అతను శ్రీనగర్లో పని చేసే ల్యాండ్ లైన్ ఫోన్ ఉన్న తన స్నేహితుడి ఇంటికి ఫోన్ చేసి, తన ఇంటికి వెళ్ళి ఈ విషయం నిజమో కాదో కనుక్కోమని చెప్పాడు.
కొన్ని వారాలుగా కశ్మీరీలు తమ సన్నిహితుల చావు గురించి ఈ విధంగానే తెలుసుకుంటున్నారు. అపరిచితుల నుండి, వార్తా పత్రికలలో నోటీసుల ద్వారా, ఆందోళనగా వెంట వెంటనే ల్యాండ్ లైన్లకి చేసిన ఫోనుల ద్వారా, కశ్మీర్ లోయ బయట ఉంటే కనుక సామాజిక మాధ్యమంలో పోస్టుల ద్వారా సమాచారం అందుతున్నది.
జమ్మూ కశ్మీర్కి ఉన్న స్వయం ప్రతిపత్తిని తొలగించామని, ఈ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించామని ఆగస్ట్ 5 నాడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే అక్కడి సమాచార వ్యవస్థలు అన్నీ స్తంభింపచేశారు. ల్యాండ్ లైన్ ఫోను కనెక్షన్లు, మొబైల్ ఫోను కనెక్షన్లు, మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ స్తంభింపచేశారు. శ్రీనగర్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ల్యాండ్ లైన్ ఫోనులు పని చేస్తున్నాయి. ఒక నెల పాటు సామాన్య కశ్మీరీలు ఎక్కడికైనా ఫోన్ చేసుకోవాలంటే డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ముందు కానీ స్థానిక పోలీస్ స్టేషన్ ముందు కానీ గంటల కొద్దీ క్యూలో నుంచోవాల్సి వచ్చింది. సెప్టెంబర్ 5 నాటికి మాత్రమే ల్యాండ్ లైన్ సేవలు పునరుద్ధరించారు.
మర్యం రేషి చెప్పినట్టు అత్యవసరం అయితే తప్ప ఫోనులు చేసుకున్న వారు బహు తక్కువ. గంటల కొద్దీ వేచి ఉండాల్సిరావడమే కాకుండా పోలీస్ స్టేషన్లు అన్నిటి ముందూ సిఆర్పిఎఫ్ బలగాలను భారీగా మోహరించారు. అంతే కాక ప్రతి రోజు చాలామందిని అదుపులోకి తీసుకుంటూ పోయారు. అనారోగ్యం గురించిన సమాచారం ఆ మనిషి పరిస్థితి మరీ విషమంగా ఉంటే తప్ప ఎవరికీ చేరవేయ్యలేదు. చావు సంబంధించిన కబురు ఒకవేళ చేరినా కూడా అది ఎప్పుడూ షాకింగ్ వార్తే
శ్రీనగర్లోని సఫా కదల్ ప్రాంతంలో నివసిస్తున్న తమ కుటుంబంతో ఆగస్ట్ 5 నుండి ఆగస్ట్ 31 మధ్య కాలంలో మర్యం రేషి, హఫీజుల్లా రేషి ఒక్క సారి కూడా మాట్లాడలేదు. “మాకొక ల్యాండ్ లైన్ ఉండేది. అయితే దానిని చాలా సంవత్సరాల క్రితమే వదిలేసుకున్నాము” అని మర్యం రేషి చెప్పాడు. “మా ఇంటి పక్క వాళ్ళకి ల్యాండ్ ఫోను ఉంది. అయితే వారి నంబర్ తీసుకోవాలి అని ఆగస్ట్ 5 వరకు మాకు తోచనే లేదు. అయితే అప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది.”
అయితే ఆందోళన చెందకుండా ఉండటానికి వారు శతవిధాల ప్రయత్నించారు. హఫీజుల్లా రేషి తండ్రి గులాం రేషిని ఆయన చనిపోవడానికి నెల ముందు ఈ దంపతులు చూసారు. వృద్ధాప్యంలో ఉండే ఇబ్బందులు మినహా పెద్దగా కంగారు పడాల్సింది ఏమీ లేదు. 82 సంవత్సరాల ఈ ముసలాయనకి పదహారు సంవత్సరాల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. అప్పటినుండి తరుచుగా చెకప్కు వెళుతున్నాడు.
చనిపోవటానికి ఒక నెల ముందు ఆయన ఆరోగ్యం దెబ్బతింది- గుండె కొట్టుకోవడం బాగా తగ్గిపోయింది. అయితే వరసగా ఫోనులు చేసేంత విషమం కాదు. ఆ తరువాత ఆగస్ట్ 31 నాడు ఆకస్మికంగా కుప్పకూలిపోయారు.
సఫా కదల్లో ఆ ఇంటి పక్కనే ఉండే మరో మనవడు ఉమర్ ఇస్మాయిల్ నాజర్ ఈ అరుపులు విని లేచు. “మా తాత శరీరం చల్లపడిపోవటంతో మా బంధువులు ఏడవటం మొదలుపెట్టారు” అని ఆయన చెప్పాడు. కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీ మహారాజ హరి సింగ్ ఆసుపత్రికి ఆయన్ని తీసుకెళ్ళారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు ఆసుపత్రిలో వైద్యులు ధృవీకరించారు.
కశ్మీర్లో ఉన్న ఆ కుటుంబానికి అప్పుడు మొదలయ్యింది అసలైన కష్టం. ఈ మరణవార్తను కశ్మీర్ లోనూ, కశ్మీర్ వెలుపలా నివసిస్తున్న రేషి కుటుంబ సభ్యులకి ఆయన మరణ వార్త చేరవెయ్యటం. హఫీజుల్లాకి ఫోన్ చెయ్యటానికి ఉమర్ మొదట సఫా కదల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అయితే అక్కడ పోలీసులు “సహకరించలేదు”. ఇంట్లో అంత్యక్రియల ఏర్పాట్లకు తాను అవసరం కాబట్టి ఇతర పోలీస్ స్టేషన్లలో ప్రయత్నించడానికి, అలాగే శ్రీనగర్లోని ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న బంధువులకి వ్యక్తిగతంగా తెలియచేయడానికి ఉమర్ తన స్నేహితులని పంపాడు. తరుచుగా నిరసనలు చోటుచేసుకుంటున్న సౌరా లాంటి ప్రాంతాలకి అసలు వెళ్ళటమే కుదరదు.
గులాం నబి రేషి చనిపోయిన ఒకటిన్నర నెల తరువాత కూడా ఆయన మరణ ధృవీకరణ పత్రం ఇవ్వలేదని మర్యం రేషి చెప్పింది. “పురపాలక సంఘం మరణ ధృవీకరణ పత్రాలను ఆన్లైన్లో అందచేస్తుంది. అందువలన నేటికి కూడా ఆ పత్రం మాకింకా అందలేదు” అని ఆవిడ చెప్పింది. “లోయలో ఇంటర్నెట్ పని చెయ్యటం మొదలుపెట్టాక ఇస్తారు బహుశా. ముందు మాకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. అది వచ్చాక ఈ పత్రానికి సంబంధించిన రుసుము కడతాము. కట్టిన తరువాత ఆ పత్రాన్ని వ్యక్తిగతంగా తీసుకోవాలి”.
ఇంటర్నెట్ సేవలు నేటికీ పునరుద్ధరించలేదు. అక్టోబర్ 14 నాడు పోస్ట్ పెయిడ్ మొబైల్ సేవలను పునరుద్ధరించారు. అయితే ఆ వెంటనే దక్షిణ కశ్మీర్లో ఒక దాడి జరగడంతో ఎస్ఎంఎస్ సేవలను కొద్ది గంటల్లోనే మళ్ళీ ఆపేశారు.
సమాచార వ్యవస్థని పూర్తిగా స్తంభింపచెయ్యటంతో లోయలో కొద్దిపాటి దూరాలు కూడా ఎక్కడో అన్నట్లు అనిపిస్తున్నాయి. ఉదాహరణకి సోపోర్ జిల్లాలోని ఇక్బాల్ నగర్కి బందీపూర జిల్లాలోని మద్దేర్కి మధ్య దూరం ముప్పై ఐదు కిలోమీటర్లు. విశ్రాంత ఆచార్యులు మొహమ్మద్ మక్బూల్ భట్ సోపోర్ లో సెప్టెంబర్ 10 నాడు మరణించారు. ఈ వార్త బందీపూర చేరడానికి పట్టిన సమయం మూడు వారాలు. ఎవరైనా మరణించినపుడు సామూహిక సంతాపాలు, కుటుంబ సభ్యులకి అందించే ఓదార్పు వంటి సామాజిక సంప్రదాయాలు అన్నిటికీ భంగం కలిగింది.
భట్ మరణవార్త బయటికి చేరవెయ్యటానికి తమ తాతలు దిగివచ్చారని సోపోర్ లోని భట్ బంధువులు తెలిపారు. “ చివరికి సెప్టెంబర్ 10 నాడే చేరుకోగలిగిన వాళ్ళ సమక్షంలోనే అంత్యక్రియలు నిర్వహించాము” అని ఆయన తెలిపారు. దగ్గరలో నివసిస్తున్న వారు మాత్రమే రాగలిగారు.
అంత్యక్రియలకు అంత తక్కువమంది రావడానికి సోపోర్లో అమలులో ఉన్న సెక్యూరిటీ నిబంధనలు కూడా కారణమని ఆయన అన్నాడు. ఉత్తర కశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో ఉన్న ఈ పట్టణం, దీని చుట్టూ పక్కల ప్రదేశాలు లోయలో ఆందోళనలకి ఎప్పటినుండో ముఖ్య కేంద్రాలు. “ సోపోర్ కశ్మీర్ స్వతంత్ర పోరాటానికి ముఖ్య కేంద్రం అవ్వటం వలన అక్కడ అనేక నిబంధనలు ఉంటాయి. అందుకే చాలా మంది ఈ ప్రాంతాన్ని ఇష్టపడరు. ఈ కారణం చేతనే చాలా మంది రాలేదని తనకు అనిపిస్తున్నట్లు ఆయన చెప్పాడు.
మద్దేర్లో నివసించే యాభై ఐదు సంవత్సరాల కనీజ్ ఫాతిమా తాను, తన కుటుంబ సభ్యులు భట్ అంత్యక్రియలకి వెళ్ళలేకపోయినందుకు మనసుకు చాలా కష్టం కలిగినట్లు చెప్పింది. “మేము అక్కడికి అక్టోబర్ 5 నాడు వెళ్ళాము. సోపోర్ లో నివసిస్తున్న మా బంధువు మమ్మల్ని చూడటానికి బందీపూర వచ్చినప్పుడు మాకు ఈ విషయం చెప్పింది. జరిగిన రోజే కబురు మాకు తెలియచేసే ఏ అవకాశమూ తనకి లేదు.”
ఇలా మరణవార్త చేరడం ఆలస్యం అయిన దాని ఫలితం ఇంకా కొనసాగుతున్న సంతాప సందేశాలు, ఓదార్పులు.
భట్ చనిపోయి నెల రోజులు అయినా ఇప్పటికీ ఈ సంతాపాలు ఆగలేదు అని ఆయన బంధువు ఒకరు చెప్పాడు. “భట్ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. అందుకే నెల రోజుల తర్వాత కూడా ఇప్పటికే జనాలు వస్తూనే ఉన్నారు” అని ఆయన చెప్పాడు. “అందరూ మాకు క్షమాపణలు చెప్పి తమకి ఈ విషయం ఎవరో ఒకరి నోట తెలిసిందని చెబుతున్నారు” అని ఆయన అన్నాడు.
సఫవత్ జర్గార్
ఇప్సితా చక్రవర్తి
‘ద స్క్రోల్’ వెబ్సైట్ సౌజన్యంతో