రాజకీయం అంటే నిలకడ ఉండాలి. రాజకీయం అంటే నేర్పు ఉండాలి. అవి లేకపోతే నేర్చుకోవడమైన ఉండాలి..! మన “పీకే”లో ఇవేమైనా ఉన్నాయా..? పీకే అలియాస్ పవన్ కళ్యాణ్ లోనే..! ఎన్నికలు ఎక్కడ..? ఆయన మీటింగులు ఎక్కడ..? అజెండా ఏమిటి..? అభ్యర్థుల సంగతి ఏమిటి..? బీజేపీతో సరైన అవగాహన లేకుండా ఆ ప్రకటనలు ఏమిటి..? పార్టీ పరిస్థితి ఏమిటి..!? ఏమిటో పార్టీలో ఈ గందరగోళం..!!
గ్రేటర్ విషయంలో తిక్క పనులు..!
పీకే ఎవ్వరికీ అర్ధం కాడు. నిజమే. ఎవరికీ అర్ధం కాకపోతే లేదు, కనీసం ఆయనకైనా అర్ధమవుతున్నాడా..? లేదా అనేదే పెద్ద ప్రశ్న..! గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికలు ఉన్నాయి. ఆల్రెడీ టీఆరెస్, కాంగ్రెస్, బీజేపీ, చివరాఖరికి టీడీపీ కూడా అభ్యర్థుల జాబితా ప్రకటించేసింది. నామినేషన్లు మొదలయ్యాయి. కానీ జనసేన పరిస్థితి ఏమిటి..? పోటీ చేస్తాం అని ప్రకటించారు. బీజేపీతో పొత్తు ఉండదని మొదట తేల్చారు. మళ్ళీ నిన్న మాత్రం బీజేపీ తమతో సంప్రదిస్తుంది, పొత్తు ఉండే అవకాశం ఉంది అని భిన్న ప్రకటన ఇచ్చారు. అదే సమయంలో బీజేపీ నుండి మేము ఎవ్వరితో పొత్తు లేదు, సింగిల్ గానే పోటీ అని తేల్చేశారు. ఇవన్నీ చూస్తే తిక్కగా లేదా..? సాధారణ అభిమానికి కాదు.., జనసేన కార్యకర్తకు కూడా అదే తిక్క కలుగుతుంది. కాకపోతే పీకే మత్తులో ఆ తిక్క బయటకు రాదు. ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకుంటున్నప్పుడు.., ఉనికి చాటుకోవాలి అనుకుంటున్నప్పుడు.., బీజేపీతో పొత్తు లేదనుకున్నప్పుడు అభ్యర్థుల ఎంపికపై ఎందుకు చర్చలు జరపడం లేదు..!?
ఎన్నికలు అక్కడ..! రాజకీయం ఇక్కడ..!!
గ్రేటర్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల విషయంలో జనసేన తీవ్ర గందరగోళంలో ఉంది. అభ్యర్థుల ప్రకటన లేదు, సమీక్షలు లేవు, సంప్రదింపులు లేవు. అక్కడ వెంటనే ఇవన్నీ పూర్తి చేసి, అభ్యర్థులను రంగంలోకి దించాల్సిన అధినేత ఏపీలో రాజకీయాలు మొదలెట్టారు. ఏపీలో అమరావతిపై ప్రకటనలు చేస్తున్నారు. ఇక్కడ జిల్లాల వారీగా పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. అమరావతి విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. సుదీర్ఘ షూటింగులు, చాతుర్మాస దీక్ష తర్వాత పవనుడు రాజకీయం మొదలెట్టారు.. కానీ అదేదో గ్రేటర్ పై దృష్టి పెట్టి.., సమీక్ష చేసి.., అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి.., అక్కడ తమ పని ఏదో చేసుకోవచ్చుగా…! అది కాకుండా ఏపీలో అమరావతి విషయంలో మళ్ళీ ఈ ప్రసంగాలు ఎందుకు..? అమరావతి ఏమి కొత్త గొడవ, కొత్త పాట కాదు కదా..!? ఇది 11 నెలల నుండి ఉంది, మరో కొన్ని నెలలు ఉంటుంది. కానీ గ్రేటర్ లో ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లకు రెండు, మూడు రోజులే గడువు ఉంది. కానీ.., గ్రేటర్ ని వాదులేసి.. ఏపీలో చద్ది పాట అందుకున్నారు. అందుకే నిలకడ, నేర్పు విషయంలో అనేక సందేహాలు వ్యక్తమయ్యేది..! పైగా.. గ్రేటర్ లో పోటీ అంటే ప్రధాన పార్టీగా ఉన్న టీఆరెస్ ని ఎదుర్కోవాలి. అంటే కేసీఆర్, కేటీఆర్ లను విమర్శించాలి. అది పవన్ చేయడం లేదు. కనీసం వరద సాయంలో టీఆరెస్ విఫలంపైనా చిన్న మాట కూడా మాట్లాడలేదు. పైగా పనిగా పెట్టుకుని మరీ ఏపీ వచ్చి, జగన్ ని విమర్శిస్తున్నారు. దీన్ని ఏమనుకోవాలి..!?
బీజేపీ బాగానే వాడుకుంటుందిగా..!!
ఇక్కడ బీజేపీ కూడా ఓ సారి చర్చించుకోవాలి. పార్టీల పొత్తు అంటే రెండు పార్టీలకు సమ ప్రాధాన్యత, సమ అవకాశాలు, సమ బలం ఉండాలి. కానీ బీజేపీతో జనసేన పొత్తులో బీజేపీ చేతికి పవన్ ఒక ఆయుధంగా మారారు తప్ప .., పవనుడికి అవసరమైన రాజకీయ సహకారం మాత్రం బీజేపీ నుండి లేదు. గ్రేటర్ లో జనసేన పార్టీ నిర్మాణమే లేదు. కేవలం పవన్ అభిమానులు, అభిమాన సంఘాలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళే పార్టీ కార్యకర్తలుగా, అభిమానులుగా మారారు. కానీ అక్కడ పోటీకి సై అంటూ జనసేన ప్రకటించింది అంటే బీజేపీ తోడుగా ఉంటుందనే నమ్మకమే. కానీ బీజేపీకి గ్రేటర్ లో వేరే పార్టీల అవసరం లేదు. వారే అక్కడ బలంగా ఉన్నామనే భ్రమలో ఉన్నారు. కనీసం 40 సీట్లు.., గరిష్టంగా 70 సీట్లు గెలుస్తామంటూ లెక్కలు వేస్తున్నారు. ఈ జనసేన అవసరం లేదనుకున్న తెలంగాణ బీజేపీ పెద్దలు అక్కడ ఈ పార్టీని పట్టించుకోవడం లేదు. ఏపీలో మాత్రం బీజేపీకి జెండాలు మోసే కార్యకర్తలు లేరు కాబట్టి.. ఇక్కడ జనసేన అవసరం ఉందన్నమాట..! అందుకే బీజేపీ బాగానే వాడుకుంటుందిగా అనేది..!!