(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
జనసేన – బిజెపి పొత్తు..ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ? పవన్ కళ్యాణ్ చరిష్మా ముందు బిజెపి చరిష్మా ఏ మాత్రం ? జనసేన కార్యకర్తల బలం, ఓట్ల బలం ముందు బిజెపి కార్యకర్తల బలం, సంస్థాగత పథం ఏ మాత్రం ? కానీ జనసేనను బిజెపి ఎందుకు డామినేట్ చేస్తుంది?. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాయిస్ కంటే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వాయిస్ ఎందుకు బలంగా వినిపిస్తోంది?. జనసేన, బీజేపి కూటమి కలిసి ఏదైనా ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతుంటే బిజెపి జెండాలు ముందు వరుసలో కనిపించి జనసేన జండాలు ఎందుకు వెనుకబడుతున్నాయి?. ఇవన్నీ జనసేన సగటు అభిమాని మదిలో మెదులుతున్న ప్రశ్నలు. చూస్తూ చూస్తూనే బలోపేతం అవ్వాల్సిన తరుణంలో తమ అధినేత బిజెపితో పొత్తు పెట్టుకుని చేయరాని తప్పు చేశారు అని జనసేనలో చాలా మంది నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారుట.
సంస్థాగత నిర్మాణం మొదలు పెట్టి ఉంటే ఈ పాటికి ఎక్కడో…
పవన్ కళ్యాణ్కు పార్టీ నిర్మాణంపై అవగాహన బాగానే ఉంది. ప్రజా రాజ్యం పార్టీలో తన అన్న రాజకీయ వైఫల్యాన్ని దగ్గరగా చూసిన పవన్ కళ్యాణ్ వాటి నుండి నేర్చుకున్న పాఠం ద్వారా జనసేన పార్టీని స్థాపించారు. అందుకే పార్టీ స్థాపించిన వెంటనే ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయలేదు. 2014లో కేవలం పొత్తుల వరకే పరిమితమైన ఆయన 2019 నాటికి మాత్రం పోటీలోకి వచ్చారు. సరే అనుకోని ఓటమి ఎదురైనా పార్టీకి ఆరు శాతం ఓట్లు పడ్డాయి అంటే ఒక రకంగా పాజిటివ్గా తీసుకోవాల్సిన అంశమే. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టడం కూడా మంచి పరిణామమే. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి వైసీపీ పూర్తిగా టీడీపీని టార్గెట్ చేస్తున్న తరుణంలో ఆ రెండు పార్టీలు కొట్టుకు చస్తాయి మనం బలపడదాం అన్న ఆలోచన జనసేనలో ప్రత్యక్షంగా ఉండి ఉంటే సంస్థాగత నిర్మాణానికి ఇదే సరైన సమయం అయి ఉండేది. పార్టీ సిద్ధాంతాలు, విధి విధానాలతో పాటు నియోజకవర్గాల వారిగా మూడు నాలుగు ఏళ్లకు ముందే కన్వీనర్లను ఏర్పాటు చేయడం, నియోజకవర్గ బాధ్యతలను వాళ్ళకు అప్పగించి ప్రజా పోరాటాలు, ప్రత్యక్ష పోరాటాలు చేయిస్తుండటం ద్వారా పార్టీ సంస్థాగత నిర్మాణం మూడేళ్ల పాటు గట్టిగా ఉండేది. ఆ తరువాత ఎన్నికల సమయానికి పొత్తుల గురించి ఆలోచించి అప్పుడు బిజెపి, టిడిపి వాళ్లకు నచ్చిన పార్టీతో పొత్తు పెట్టుకుంటే జనసేన బలం, బలగం మొత్తం ఈ మూడేళ్లలో బలపడి రెట్టింపు అయి ఎదుటి పార్టీలను డామినేట్ చేసే స్థాయికి చేరేది అని జనసేన పార్టీలో ఎక్కువ మంది అనుకుంటున్న మాట. కానీ పవన్ కళ్యాణ్ సలహాదారులు కానీ, పవన్ కళ్యాణ్ కు వస్తున్న ఆలోచనలు రాజకీయంగా తప్పుదోవ పట్టిస్తున్నాయనేది అంతర్మధనం చెందుతున్నారు.
కోటరీ దెబ్బకొడుతున్నట్లేనా..
రాజకీయాల్లో కీలక నాయకులకు కోటరీ ఏర్పడటం సహజమే. టిడిపి అధినేత చంద్రబాబుకు చుట్టూ నలుగురు ఐదుగురు కోటరీ నాయకులు ఉంటారు. గాలి వార్తలను, లేనిపోని అంశాలను ఉన్నవీ లేనివీ నూరిపోసి ఆయనకు చెబితే వాటిని ఆయన నమ్మేసి పార్టీని ఆయనకు ఆయనే దెబ్బతీస్తుంటారు. సేమ్ అదే తరహాలో వైసీపీ అధినేత, సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆయనకు తెలియకుండానే ఆయన వద్ద ఒక కోటరీ ఏర్పాటు అయ్యింది. జగన్ కూడా ఏమైనా అయినా అయితే వాళ్లతో మాట్లాడండి విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వంటి నాయకులకు బాధ్యతలు అప్పగించారు. తను నేరుగా కలవకుండా ఈ ద్వితీయ శ్రేణి నాయకులను కలవడం ద్వారా ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా మంది ఇప్పటికే నొచ్చుకుంటున్నారు. అంటే తనకు తెలియకుండానే జగన్ చుట్టూ కూడా ఒక కోటరీ ఏర్పాటు అయ్యిందనేది వాస్తవం. సరే చంద్రబాబు, జగన్ అంటే కాకలుతిరిగిన రాజకీయ నాయకులు. పవన్ కళ్యాణ్ కూడా ఈ దశలోనే కోటరీని ఏర్పాటు చేసుకోవడం, వారి మాట దాటి బయటకు రాలేకపోవడం పవన్ కళ్యాణ్ కు పెద్దలోపంగా పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. నాదేండ్ల మనోహర్, తోట చంద్రశేఖర్, హరిప్రసాద్ (మీడియా సమన్వయకర్త) వంటి నాయకులు పార్టీని తప్పుదోవ పట్టించడంలో ముందు వరుసలో ఉన్నారు అనేది జనసేనలో క్షేత్ర స్థాయి నుండి వస్తున్న మాట. పవన్ కళ్యాణ్ ను నేరుగా కలవాలన్నా, పార్టీ తరపున ఏదైనా విన్నవించుకోవాలన్నా వీళ్లలో ఎవరికైనా చెబితే వీళ్లు పవన్ కళ్యాణ్ కు చెప్పాలి. అంతే తప్ప నేరుగా చెప్పే అవకాశం ఉండదు, రాదు. అంటే సంప్రదాయ రాజకీయాల కోటరీలను పవన్ కళ్యాణ్ కూడా కొనసాగిస్తూ తన కంటిని తానే పొడుచుకుంటున్నారని పార్టీవర్గాల్లోనే అంతర్గత చర్చ జరుగుతోంది.