Janasena party: ఇండియాలో రాజకీయ పార్టీలు – న్యూస్ చానెళ్లు మధ్య మాంచి చుట్టరికం ఉంటుంది. పార్టీలకు న్యూస్ ఛానళ్ళే భజన బృందం.. ఆ చానెళ్లకు పార్టీలే ప్రాణదాతలు..! ఈ చుట్టరికం పోతే.., రెండు వ్యవస్థలూ చిన్నబోతాయి. ఒకదానికొకటి అలా ఇనుము – అయస్కాంతం లా అతుక్కుని ఉండాల్సిందే. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా ఎందుకంటే..!? రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా ఈ కొత్త సూత్రం పట్టేసారు. ఎప్పుడో దశాబ్దాల కిందట పార్టీగా అవతరించిన టీడీపీకి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వంటి సొంత ఇంటి భజంత్రీ బృందాలు ఉన్నాయి.. వైసీపీకి సాక్షి అనే ఒక కరపత్రం ఉండగా.., టీవీ 9, ఎన్టీవీ రూపంలో పెయిడ్ భజన బృందాలున్నాయి. టీఆరెస్ కి నమస్తే తెలంగాణ, టీ న్యూస్ రూపంలో సొంత భజన బ్యాచ్ ఒకటి ఉండగా.., టెన్ టీవీ, టీవీ 9 రూపంలో మరో రెండు పెయిడ్ బ్యాచ్ లు ఉన్నాయి. మరి జనసేనకు, బీజేపీకి లేకపోతే ఎలా..!?
Janasena party: జనసేన ముచ్చటగా మూడోది..!!
బీజేపీకి తెలంగాణాలో వెలుగు పత్రిక, వీ 6 ఛానెల్ సొంతంగా ఉండగా.., ఇటీవల రాజ్ న్యూస్ కూడా భజన చేస్తుంది. ఇక ఏపీలో మాత్రం బీజేపీకి అనుకూలంగా ఏ ఛానెల్ లేదు. అప్పుడప్పుడు టీవీ 5 , మహా న్యూస్ భజనలు చేస్తుంటాయి. జనసేన విషయానికి వస్తే ఆ పార్టీ ఏర్పాటై ఇప్పటికి ఏడేళ్లు మాత్రమే అవుతుంది. కానీ అప్పుడే మూడో ఛానెల్ ఏర్పాటుకి బేరాలు జరుగుతున్నాయి.
* జనసేన పార్టీకి అనుకూలంగా మొదటి నుండి 99 టీవీ పుట్టింది, ఇప్పటికీ భజన చేస్తుంది. కానీ సత్త లేక, నిర్వహణ సరిగా లేక, సబ్జెక్టు లేక ఆ ఛానెల్ ని ఎవరూ పట్టించుకోవడం లేదు. జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఆ ఛానెల్ చూడడానికి ఇష్టపడడం లేదు. అలా తోట చంద్రశేఖర్ ఆ ఛానెల్ తో కొంత దెబ్బతిన్నారు..
* 99 టీవీ ఏమి ఉద్ధరించలేకపోవడంతో జనసేనకి అనుకూలంగా ప్రైమ్ 9 న్యూస్ అనే మరో ఛానెల్ పుట్టుకొచ్చింది. ఇది కొంత ప్రయత్నాలు చేస్తుంది. కానీ దీనిలో కూడా తర్గతంగా సబ్జెక్టు లేదు. బలమైన కథనాలు ఇవ్వగలిగే వ్యవస్థని తయారు చేసుకోలేదు. దీంతో ఇది అంతంతమాత్రంగానే నడుస్తుంది.
* ఇక ఈ రెండు చాలవని.. జనసేన కీలక నేతలు మూడో ఛానెల్ కోసం ప్రయత్నాలు ఆరంభించారు. పుష్కర కాలం కిందట ఆరంభమై మొదట్లో వెలిగి.. మధ్యలో ఆరి.. మళ్ళీ వెలిగి.. మళ్ళీ ఆరి.. ఇలా చీకటి వెలుగుల మధ్య నడుస్తున్న “మహా న్యూస్” అందరికీ తెలిసిందే. ఆ మధ్య పరకాల ప్రభాకర్ దీనిలో వాటా కొనుగోలు చేసి.. మళ్ళీ కుదరక వెళ్లిపోయారు. ఈ ఛానెల్ ప్రస్తుతం డల్ గానే ఉంది. న్యూస్ ఛానెళ్ళకి అసలు రోజులు బాలేవు. ఆ ఛానెల్ కూడా లాభాల్లో లేదు. అదే బాటలో ఈ ఛానెల్ మరింత దిగువున ఉంది. అందుకె ఈ ఛానెల్ కోసం జనసేన బృందం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మహా న్యూస్ లో రోజుకి రెండు గంటల పాటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు కార్యక్రమాలు వేస్తున్నారు. జనసేన కూడా రోజులో కొన్ని గంటల పాటూ వేయడమో.. లేదా పూర్తిగా ఛానెల్ కొనేయడమో అనే ప్రతిపాదనల్లో ఉంది. అయితే మహా న్యూస్ యాజమాన్యం మాత్రం దీనికి సిద్ధంగా లేనట్టు తెలుస్తుంది. ఉన్నంతలో ఉన్నతంగా నడిపించాలని కొత్త ఆలోచనలు చేస్తుంది..! ఈ బేరాలు, సంప్రదింపులు, చర్చలు ఏ మేరకు ఫలితాన్నిస్తాయి అనేది ప్రస్తుతానికి సందేహమే..!!