Jangareddygudem Deaths: పశ్చిమ గోదావారి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇటీవల వరుసగా దాదాపు 25 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. మొదట రెండురోజుల వ్యవధిలో 16 మంది.. ఆ తర్వాత మరో రెండు రోజుల్లో మరో 9 మంది.. మొత్తం 25 మందికిపైగా మృతి చెందారు.. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా దీనిపై అటు అసెంబ్లీలో, ఇటు బయట ఆందోళన చేస్తోంది. కల్తీ సారా మరణాలపై ఉభయ సభల్లో చర్చ జరగాలని టీడీపీ పట్టుబడుతూ ఆందోళన చేస్తోంది. అయితే ఇవన్నీ సహజమరణాలేననీ, టీడీపీ కావాలనే శవరాజకీయాలు చేస్తోందని అధికార పక్షం పేర్కొంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ వాళ్లు చెబుతున్నది వాస్తవమా.. అధికార పక్షం చెబుతున్నది కరెక్టా అనే విషయాలను తెలుసుకుని ప్రజలకు అందించేందుకు “న్యూస్ ఆర్బిట్” టీమ్ క్షేత్ర స్థాయిలో పర్యటించి బాధిత కుటుంబాలతో మాట్లాడి అందిస్తున్న కథనం ఇదీ.
Jangareddygudem Deaths: ఒక్కొక్కరిదీ ఒక్కో కథ..!
* మడిచర్ల అప్పారావు. ఈయన వయసు 51 సంవత్సరాలు. ఇతను జంగారెడ్డిగూడెంలోని గాంధీ బొమ్మ వీధిలో ఉంటారు. చేపల మార్కెట్ లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి చాలా కాలం నుండి మద్యం సేవించే అలవాటు ఉండేది. అయితే మద్యం రేట్లు పెరిగిపోవడంతో తక్కువ ధరకు లభించే సారాను సేవిస్తున్నాడు. పని ఉన్నా లేకపోయినా రోజు నాటు సారా తాగుతూ ఉండేవాడు. ఈ నెల 10వ తేదీన సారా తాగిన తరువాత అతనికి వాంతులు అయ్యాయ. కల్లు తేలేశాడు, అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈనెల 9న మంగళవారం ఉదయం 9 గంటలకు ఆసుపత్రికి తీసుకువెళ్లగా 9.45 గంటలకే ఆయన చనిపోయాడు. చనిపోవడానికి ముందు ఆయనకు అప్పుడప్పుడు జ్వరం, జలుబు లాంటి వచ్చాయే కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఏమీ లేవు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేవు అని అప్పారావు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. “మా నాన్న తాగిన నాటుసారాలో ఆ రోజు ఏదో కల్తీ జరిగి ఉంటుంది. రోజూ సారా తాగుతారు. ఎప్పుడూ ఏమి కాలేదు. ఆరోజు ఏదో కలిసి ఉంటుంది.. ఆయనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు” అని అప్పారావు కుమార్తె రాజేశ్వరి, భార్య కూడా చెప్తున్నారు..!
* బండారు శ్రీనివాస్, ఇతని వయసు కేవలం 49 సంవత్సరాలు. తాపీపనికి వెళ్తుంటాడు.. పని ఉన్నా, లేకపోయినా నాటుసారా మాత్రం తాగడం నిత్యం అలవాటు.. ఈ నెల 10న కూడా సాయంత్రం బాగా తాగి ఇంటికి వచ్చాడని. రాత్రి బాగా తేడా చేసి.. వాంతులు అయ్యాయని.. అంతలోనే ఆసుపత్రికి తీసుకెళ్ళేసరికి మరణించాడని ఆయన భార్య లక్ష్మి చెప్తున్నారు.. “చాలా చురుకుగా ఉంటారు. ఏ నాడూ ఆరోగ్య సమస్యలు రాలేదు.. నాటు సారా తాగడం వల్లనే నూటికి నూరు శాతం మృతి చెందారు. వైద్యులు కూడా సారా తేడా చేసింది అని మాతో చెప్పారు. మేము ప్రభుత్వ అధికారులకు ఆ విషయమే చెప్పాము” అని అతని భార్య, కుమారుడు, కోడలు చెబుతున్నారు.
* వెంపల అనిల్ కుమార్, ఇతని వయసు కేవలం 37 సంవత్సరాలు..! ఎటువంటి అనారోగ్యం లేదు. జంగారెడ్డిగూడెంలో ఉప్పలిమెట్ట ప్రాంతంలో నివాసం ఉంటే అనిల్ కుమార్ బైక్ మెకానిక్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అనిల్ కుమార్ తండ్రి, ఇద్దరు సోదరులు కూడా బైక్ మెకానిక్ లుగానే పని చేస్తున్నారు. అనిల్ కుమార్ కు చాలా కాలంగా మద్యం అలవాటు ఉండేది. అయితే మద్యం రేట్లు పెరిగిన తరువాత ఆరు నెలల కిందట నుండి నాటు సారాకు అలవాటు పడ్డాడు. అలా నాటు సారాకు బానిస అయ్యాడు. రోజు మాదిరిగానే ఈ నెల 11వ తేదీ నాటు సారా తాగాడు. మరుసటి రోజు తెల్లవారుఝామున లేచి కళ్లు తిరుగుతూ, వాంతులు చేసుకున్నాడు.. కుటుంబ సభ్యులు గుర్తించే సరికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇలా జంగారెడ్డిగూడెంలో దాదాపు 25 మందికిపైగా చనిపోయారు. వాళ్ల మృతితో ఆ కుటుంబాలు జీవనాధారాన్ని కోల్పోయాయి. అందరూ ఇదే తరహా కారణాలు, లక్షణాలు చెప్తున్నారు. మరణించిన అందరూ ముందు రోజు నాటుసారా తాగిన వారేనని ఆ కుటుంబ సభ్యులే వెల్లడిస్తున్నారు..! కానీ ప్రభుత్వం ఇవి సహజ మరణాలుగా తేల్చేయడంతో ఎటువంటి పరిహారం అందే పరిస్థితి లేదు. టీడీపీ మాత్రం బాధిత కుటుంబాలకు లక్ష చొప్పున పరిహారాన్ని అందించాయి. ఆ కుటుంబాలు అధారాన్ని కోల్పోయి ఆర్తనాధాలు చేస్తున్నాయి. కుటుంబ పోషణ ఎలా అని ఆవేదన చెందుతున్నాయి..!