సీఎం అయినా పీఎం అయినా సొంత గడ్డపై లేదా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంపై ఎంతో అభిమానం ఉంటుంది. ఇక తన నియోజకవర్గం వాడు సీఎం అవుతున్నాడు అంటే ఆ ప్రాంత ప్రజలు అభివృద్ధి విషయంలో ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఇప్పటి వరకు చరిత్రలో ఎవరు సొంత ప్రాంత ప్రజలకు తక్కువ చేసింది అయితే లేదు కానీ ఈ విషయంలో జగన్ కు చంద్రబాబుకు భారీ తేడా ఉంది…
రాజకీయ లబ్ధి పొందడమే తెలివి…!
తాజాగా సీఎం జగన్ తన సొంత జిల్లా అయిన వైఎస్ఆర్ కడప లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో భారీ ఎత్తున వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాజకీయంగా తనకు మంచి అవకాశం ఇచ్చిన నియోజకవర్గం అది కాకుండా తాను పుట్టిపెరిగిన ప్రాంతం కనుక ఎవరైనా అభివృద్ధి చేయాలని భావిస్తారు. ఇక చేసే అభివృద్ధి నుండి పెద్ద ఎత్తున రాజకీయ లబ్ధి పొందాలి అనే ఆలోచన చేసే వారు మాత్రం చాలా తక్కువ. కానీ ఇటువంటి విషయాల్లో జగన్ తెలివితేటలు బాబు అనుభవాన్ని సునాయాసంగా అధిగమించాయి.
అనుభవానికి కాలం చెల్లిందా?
చంద్రబాబు 35 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గంలో విజయం సాధిస్తూనే ఉన్నారు. అక్కడ అనేక అభివృద్ధి పనులు కూడా చేశారు. అయితే జగన్కు పులివెందుల లో ఉన్న సెంటిమెంట్ తో పోలిస్తే చంద్రబాబుకి కుప్పం లో ఉన్న ఆదరణ చాలా తక్కువ. ఇక జగన్ ఈ రేంజ్ లో పులివెందుల ప్రజలను ఆకర్షితులను చేసుకునేందుకు వెనుక ఉన్న ఏకైక కారణం ఒక వ్యూహాత్మక విన్యాసం. ఇది చంద్రబాబు కి అలవాటుగా లేకపోవడం గమనార్హం. అది కూడా 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ……
వరాల జల్లు..!
గతంలో పులివెందుల ప్రజలతో ఎంతో సెంటిమెంట్ గా మాట్లాడిన జగన్ ఈసారి పర్యటనలో దానికి న్యాయం చేస్తూ అక్కడి ప్రజలపై వరాల జల్లు కురిపించారు. అనేక పధకాలను ప్రకటిస్తూ… అంత పెద్ద లిస్టు చదవలేకపోయారు. విద్య, సాగునీరు, పోలీస్ స్టేషన్లు, పరిశ్రమలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు వీటన్నింటికీ కేటాయించిన నిధులు ఇంకా చేస్తున్న పనులన్నింటినీ తిప్పుకోకుండా చెప్పారు. అంతే… పులివెందుల ప్రజలకు కళ్ళల్లో సంతోషం వెల్లివిరిసింది. నిజానికి జగన్ చెప్పిన పథకాలు రెండు మూడు నెలల తర్వాత కానీ ప్రారంభం కావు. ప్రస్తుతానికి ఒకటి అర మాత్రమే జరుగుతున్నాయి. కానీ గుండుగుత్తగా ఏకబిగిన ప్రసంగం చేసిన జగన్ను చూసి ప్రజలు ఫిదా అయ్యారు. కానీ బాబు మాత్రం కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధిని ఎప్పుడో ఒకసారి అభివృద్ధి చేశారు. అతను ప్రసంగించే సభలో జగన్ లాగా జానాలను భావోద్వేగానికి గురి చేయలేకపోయాడు. మరి ఈ విషయంలో బాబు జగన్ ను ఉదాహరణగా తీసుకుని ముందుకు సాగకపోతే సొంత ప్రాంతంలోనే షాక్ తినే పరిస్థితి కూడా రావచ్చు అన్నది రాజకీయ విశ్లేషకుల మాట.