Jio TV : ఏపీ ఫైబర్ నెట్ అంటే అందరికీ గుర్తుండే ఉంటుంది..! ఇంటింటికీ ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్, సెటప్ బాక్స్, 250 పైగా చానెళ్లు… అన్నిటినీ రూ. 200 కి అందించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. గత టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టుకి రూపకల్పన చేసి.. ఎంతో గొప్పగా దీన్ని ఆవిష్కరించారు. వైసీపీ వచ్చాక కూడా బాగానే ఉంది అనుకుంటున్నాం..! కానీ నాటి తప్పులు, నేటి నిర్లక్ష్యం వెరసి ఈ ప్రాజెక్టుకి తుప్పు పట్టేలా కనిపిస్తుంది. రిలయన్స్ జియో రూపంలో ఈ ప్రాజెక్టుకి పెద్ద గండం రాబోతుంది..!!
Jio TV : ఫైబర్ నెట్ విస్తృతి బాగానే ఉన్నా..!?
2017 లో తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభించి.. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా 24000 కిలోమీటర్లు మేర ఫైబర్ ఆప్టిక్ కేబుల్ లాగి, 6 వేల పల్లెలకు చెందిన 970000 ఇళ్లకు.. కనెక్షన్ ఇచ్చారు. అంటే రెండున్నరేళ్లలో ప్రగతి బాగానే ఉంది. రాష్ట్రంలోని దాదాపు 10 శాతం ఇళ్లకు కనెక్షన్ ఇచ్చారు. దీన్ని ఇంకా ప్రమోట్ చేస్తే.., ప్రైవేట్ సేవల్లా బాగా విస్తరిస్తే.., రాష్ట్ర వ్యాప్తంగా 25 శాతం ఇళ్లకు కనెక్షన్ ఇవ్వవచ్చు. ఇది ప్రభుత్వ ప్రాజెక్టు.. ప్రభుత్వానికే మంచిది. యాడ్లు కోసం బయట కంపెనీలకు ధారాళంగా నగదు ఇచ్చుకునే పని ఉండదు.
నాటి తప్పులు… నేటికీ వెంటాడుతూనే..!!
చంద్రబాబు హయాంలో ఈ ప్రాజెక్టు కేటాయింపులోనే పెద్ద అవినీతి ఆరోపణలు వచ్చాయి. మొత్తం రూ. 1500 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుని.. అప్పటి మంత్రి లోకేష్ కి సన్నిహితంగా ఉండే ఓ కంపెనీకి కట్టబెట్టారు అనే ఆరోపణలు ఉన్నాయి. బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి టెండర్ ఇచ్చి, రూ. 334 కోట్లు మేరకు అవినీతికి పాల్పడ్డారని కొన్ని ఆధారావాలు కూడా బయటపడ్డాయి. ఈ స్కామ్ పై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ ప్రభుత్వం కోరింది. అక్కడితో విషయం అలా ఉండగా…
* చంద్రబాబు హయాంలో రావడం.., ఆపై అనేక అవినీతి ఆరోపణలు ఉండడంతో వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని పెద్దగా సీరియస్ తీసుకోలేదు. ప్రమోట్ చేయట్లేదు. ఆ గ్యాప్ ని చూసుకున్న జియో ఏపిలోకి అడుగు పెడుతుంది.
జియో వస్తే..! ఏపీలో ఏమవుతుంది..!?
జియో సిమ్.. జియో ఫోన్ ఎలా అయితే జనాల్ని బానిసలుగా మార్చేసిందో… జియో టీవీ కూడా అదే తీరున రాబోతుంది. ఇంటి ముందే స్మార్ట్ టీవీ, బ్రాడ్ బ్యాండ్, ల్యాండ్ లైన్ ఫోన్, మొబైల్ ఫోన్, వైఫై అన్నీ ఉంటాయి. 5 జీ సేవలు అందనున్నాయి. ఇప్పుడున్న ఏపీ ఫైబర్ నెట్, కొన్ని ప్రైవేట్ నెట్ ల కంటే 5 రేట్లు వేగం పెరగనుంది. వేగం ఎక్కువ, ధర తక్కువ… అనే జియో సూత్రానికి మాల్లో టీవీల వాళ్ళు కూడా అతుక్కుపోవడం ఖాయమే. అంటే… ఏపీ ఫైబర్ నెట్ కి అతిపెద్ద గండం ఉంది. నాటి జియో సిమ్ వలన బిఎసెనెల్ , ఎయిర్సెల్ , యూనినార్, డొకోమో వంటి కంపెనీలు మూసుకున్నారు. ఇప్పుడు జియో టీవీతో సేమ్ గండం ఏపీ ఫైబర్ నెట్, ఇతర బ్రాడ్ బ్యాండ్ సేవలకు పొంచి వుంది..!!
(ఇక ఈ జియో టీవీ/ ఫైబర్ నెట్ విస్తరణకు రాష్ట్రంలోని ఏ సంస్థలతో ఎలా ఒప్పందం చేసుకుంటున్నారు..? జియో మాస్టర్ మోసం/ బెదిరింపు ఎలా ఉంది..? అనేది వచ్చే కథనంలో చూద్దాం..!)