Justice Kanagaraj: జస్టిస్ కనగరాజ్ పేరు విన్నారు కదా.. గత ఏడాది నుండి మన రాష్ట్ర ప్రజలకు ఆయన పేరు సుపరితమైంది. ఎందుకంటే కరోనా లాక్ డౌన్ కఠినంగా అమలు అవుతున్న వేళ కూడా తమిళనాడు నుండి జస్టిస్ కనగరాజ్ ను రప్పించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) సీటులో కూర్చొబెట్టారు ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించేందుకు సీఎం వైఎస్ జగన్.. ప్రత్యేకంగా తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసి పదవీ విరమణ అయిన జస్టిస్ కనగరాజ్ ను తీసుకువచ్చారు. జస్టిస్ కనగరాజ్ వయసు 75కిపైగా ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి ఒక సారి దెబ్బతింటే ఆలోచన చేస్తారు రెండవ సారి దెబ్బతినకుండా కానీ జస్టిస్ కనగరాజ్ రెండు సార్లు పరాభవానికి గురైయ్యారు. రాష్ట్ర స్థాయిలో ఉన్నత హోదాలో పని చేసిన ఓ వ్యక్తి రెండు సార్లు పరాభవానికి గురి కావడంతో ఆయన ఏమని ఆలోచిస్తారు. దీనికి ఏమైనా పరిష్కారం కనుగొంటారా లేక ఈ ప్రభుత్వం తనను అవమానించింది అని భావిస్తారా చూడాలి. ఆయన ఆలోచన ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు కీలకం.
Justice Kanagaraj: రెండు పదవులు తెలిసే ఊడిపోయాయి..!?
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించడానికి జస్టిస్ కనగరాజును ఎన్నికల కమిషనర్ గా నియమించారు వైఎస్ జగన్. కానీ ఇది చెల్లదు అని ప్రభుత్వానికి తెలుసు. న్యాయకోవిదుడైన జస్టిస్ కనగరాజ్ గారికి తెలుసు. కానీ ఏదో ఒక ప్రయత్నం చేశారు. గాలిలో దీపం పెట్టారు. అది గాలికి ఆరిపోయింది అన్నట్లు ఆయన ఎస్ఈసీ పదవి మూడునాళ్ల ముచ్చట అయ్యింది. మళ్లీ రమేష్ కుమార్ ఎస్ఈసీ కుర్చీలో కుర్చున్నారు. అయితే ఎస్ఈసీ పదవి పోతేనేమీ ఇంకేమైనా ఆ పెద్దాయనకు పదవి ఇద్దామని ఆలోచించిన ఏపి సీఎం వైఎస్ జగన్…నాలుగైదు నెలల క్రితం మరో కీలక పదవి ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ అథారిటీ (పీసీఏ) చైర్మన్ గా జస్టిస్ కనగరాజ్ ను జగన్ సర్కార్ నియమించింది. అయితే ఈ నియామకంలోనూ జగన్ సర్కార్ నిబంధనలను తుంగలో తొక్కారు. తెలిసే తప్పు చేశారు. 65 సంవత్సరాల పైబడి వ్యక్తి ఈ పోస్టుకు అనర్హుడు అని స్పష్టంగా సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ లో పేర్కొనబడి ఉంది. అది తెలిసి కూడా 75 సంవత్సరాలు పైబడి ఉన్న జస్టిస్ కనగరాజ్ ను జగన్ నియమించారు. ఇటువంటి వాటిలో ప్రతిపక్షాలు ఊరుకోవు కదా, కోర్టులు ఊరుకోవు. ఓ న్యాయవాది ఈయన నియామకంపై హైకోర్టును ఆశ్రయిస్తే నిబంధనల ప్రకారం నియామకం లేదంటూ ఆ జివోను కొట్టేసింది. దీంతో ఆయనకు ఈ పదవీ ఊడినట్లు అయ్యింది.
మరో కొత్త పదవి అవకాశం.. కానీ..!?
ఏడాది కాలంలోనే జస్టిస్ కనగరాజ్ తొలుత ఎస్ఈసీ పదవి, ఇప్పుడు పీసీఏ పదవీ కోల్పోయారు. ఈ రెండు సార్లు పదవి పోవడానికి ఏపి ప్రభుత్వమే కారణం. తెలిసీ ఆయన కూడా దీనిలో చిక్కుకున్నారు. ఇప్పటికీ జస్టిస్ కనగరాజ్ గారికి ఏదైనా పదవి ఇవ్వాలంటే ప్రభుత్వం ఇవ్వవచ్చు. అది సీఎం జగన్ చేతిలో ఉంటుంది. ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజున టెండర్లు అన్నీ పారదర్శకంగా జరిగేందుకు న్యాయనిపుణుల సమక్షంలో అయ్యేలా చూస్తామని చెప్పారు. ఇప్పుడు దానికి ఒక కార్పోరేషన్ లాంటిది ఏర్పాటు చేసి చైర్మన్ గా నియమించవచ్చు. అంటే టెండర్స్ అబ్జర్వేషన్ కమిటీ అనో లేక కమిటీ అనో ఒక దానిని ఏర్పాటు చేసి ఏపిలో వంద కోట్లకు పైబడి ఏ టెండర్ అయినా ఈ కమిటీ పరిశీలన చేస్తుందని చెప్పవచ్చు. రెండు సార్లు ఈ పెద్దాయన పరాభవాన్ని ఎదుర్కొన్నారు కాబట్టి ఇప్పుడు ఈ కొత్త పదవి ఏమైనా సృష్టించి పదవి ఇస్తారా లేక ఒక సారీ చెప్పి ఏమి అనుకోవద్దు అని తమిళనాడుకు తిరుగు ప్రయాణం చేయిస్తారా అనేది వేచి చూడాలి.