Kapu Community: ఏపీలో అనేక సామాజికవర్గాలు ఉండొచ్చు.. కానీ ఒక్క సామాజికవర్గానికి మాత్రం సంఖ్యాపరంగా పైచేయి..! దాదాపు 52 లక్షల ఓట్లు.. సుమారుగా 65 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే.. ఆ కీలక సామాజికవర్గం అడుగులు ఇప్పుడు మారుతున్నయ్.. జగన్ చేస్తున్న కొన్ని తప్పుల కారణంగా దూరంగా జరుగుతున్నాయ్.. అలా అని చంద్రబాబుకి దగ్గరవ్వడం లేదు.. గతంలో ఆయనకి చేసిన తప్పులు, పాపాల ఫలితంగా అటూ వెళ్లడం లేదు. ప్రస్తుతం గాలిలో ఉన్నాయి. న్యూట్రల్ గా మారాయి.. ఆ వర్గం, ఆ ఓట్లు, ఆ సీట్లు, ఆ నేతలు గురించి కాస్త లోతుగా..
టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాపు సామాజికవర్గం రాబోయే రోజుల్లో రాజకీయంగా అత్యంత కీలకం కాబోతున్నది అని ఆయన వ్యాఖ్యానించారు.. ఆ వ్యాఖ్యలను కాసేపు పక్కన పెడదాం.. “అదే సమావేశంలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు భిన్నంగా మాట్లాడారు. ఒక్కటిగా రాజకీయ అడుగులు వేయడం సాధ్యం కాకపోవచ్చని, దారులు వేరుగా ఉన్నా.., ఐక్యంగా ప్రగతి కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.. రెండు నెలల ముందు పవన్ కళ్యాణ్ కూడా “కాపు, తెలగ, బలిజ సామాజికవర్గాలు ఐక్యంగా ఉంటె ప్రభుత్వ ఏర్పాటు సులువవుతుందని వ్యాఖ్యానించారు.. అంతకు ముందు వంగవీటి రాధాకృష్ణ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు.. అంటే కాపు సామాజికవర్గం కీలక ఎంతలు అడపాదడపా తమ ఐక్యత, తమ రాజకీయం గురించి కొత్త తరహాలో కామెంట్లు చేయడం ఇటీవల కాలంలో ఎక్కువయింది..! ఈ వ్యాఖ్యలపై ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషణలు చేస్తున్నారు. అయితే గంటా శ్రీనివాసరావు, తోట త్రిమూర్తులు, ఇతర కాపు నేతలు ఈ విధంగా మాట్లాడటం కొత్తేమి కాదు. ఎప్పటి నుండో కాపు సామాజికవర్గం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందనీ, కాపు సామాజికవర్గం రాజకీయంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఎప్పటి నుండో చెప్పుకుంటున్నారు..!
Kapu Community: స్ట్రాటజీ ఏమైనా ఉందా..!?
వాస్తవానికి ఆ సామాజికవర్గంలో అంతర్గతంగా ఏమి జరుగుతుంది..? వాళ్ల స్ట్రాటజీలు ఏమిటి..? అనేది పరిశీలన చేస్తే.. కాపు, బలిజ, తెలగ మూడు ఉప కులాలను కాపు సామాజికవర్గంగానే పరిగణిస్తారు. రాష్ట్రంలో ఈ సామాజికవర్గ ఓటింగ్ సుమారుగా 13 శాతం ఉంది. అంటే సుమారు 53 లక్షల ఓటింగ్ ఉంది. ఈ సామాజికవర్గానికి దాదాపు 60 నుండి 65 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే సామర్ద్యం ఉంది. ఆయా నియోజకవర్గాల్లో 50 నుండి 70 వేల వరకూ కాపు సామాజిక వర్గ ఓటింగ్ ఉంది. రెడ్డి సామాజివర్గానికి చూసుకుంటే 35 నుండి 40 నియోజకవర్గాల్లోనే పట్టు ఉంది. అదే విధంగా కమ్మ సామాజికవర్గాన్ని 30 నియోజకవర్గాల్లో మాత్రమే గెలుపు ఓటములను శాసించే పరిస్థితి ఉంది. కానీ… అత్యధికంగా కాపు సామాజికవర్గానికి ఎక్కువ ఓటింగ్ ఉండి, ఎక్కువ నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే సామర్ద్యం ఉన్నా కూడా పాలక దశకు ఎందుకు చేరుకోలేకపోతున్నాము..? అన్న భావన ఆ వర్గాల పెద్దల్లో ఎప్పటి నుండో నెలకొని ఉంది. గంటా శ్రీనివాసరావు, తోట త్రిమూర్తులు, ఆమంచి కృష్ణమోహన్, వంగవీటి రాధ తదితర ఆ సామాజికవర్గ నేతల్లో ఎప్పటికప్పుడు ఇదే మాట్లాడుకుంటుంటారు. వాళ్లు ఇప్పుడు అందరూ ఒక పార్టీలోకి రావడం సాధ్యమా అంటే అది అయ్యే పని కాదు…!
Kapu Community: అప్పట్లోనే టీడీపీకి వ్యతిరేకంగా ఒక చర్చ..!
2019 ఎన్నికలు జరిగిన తరువాత జూన్ 20న కాకినాడలో తోట త్రిమూర్తులు నివాసంలో టీడీపీకి చెందిన కాపు సామాజికవర్గ నేతల సమావేశం జరిగిన విషయం చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. అనాటి సమావేశంలో ఏలూరు మాజీ ఎమ్మెల్యే, దివంగత బడేటి బుజ్జి, మాజీ ఎమ్మెల్యేలు కదిరి బాబూరావు, తోట త్రిమూర్తులు, బొండా ఉమా సహా దాదాపు 20 మంది ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ చేసుకున్నారు. మెజార్టీ కాపు సామాజికవర్గం వైసీపీ పక్కన ఉండటం వల్లనే ఆ పార్టీ గెలిచింది అని ఒక అంచనాకు వచ్చారు. ఆ తరువాత టీడీపీలో ఉండటం వల్ల ఉపయోగం లేదని భావంచిన తోట త్రిమూర్తులు, కదిరి బాబూరావు, చలమశెట్టి సునీల్ తదితర నాయకులు వైసీపీలో చేరిపోయారు. అటు వైసీపీ, మరో పక్క టీడీపీలో, కొందరు పవన్ కళ్యాణ్ జనసేనలో కాపు సామాజికవర్గ నేతలు ఉన్నారు. ఇప్పుడు ఆ సామాజికవర్గ నేతలు అందరూ ఐక్యంగా రావడం సాధ్యమేనా..? జగన్మోహనరెడ్డి పాలన కాపు సామాజికవర్గాన్ని అంతగా మెప్పించడం లేదు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో కాపు సామాజికవర్గంలో 60 నుండి 70 శాతం వరకూ వైసీపీకే ఓట్లు వేశారు. కాపు సామాజికవర్గం అధికంగా ఉండే చాలా నియోజకవర్గాల్లో వైసీపీ మంచి మెజార్టీతో గెలిచింది. ఇదే అందుకు ఉదాహరణ.
జగన్ కు దూరంగా..!?
వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత గత కొంత కాలంగా ఆ సామాజికవర్గం జగన్ కు దూరం అవుతోంది. జగన్మోహనరెడ్డి మన మాజికవర్గానికి చేసింది ఏమీ లేదు అన్న భావన వారిలో ఉన్నట్లు సమాచారం..? కాపులకు అవసరమైన డిమాండ్లు.., ఇతర ఉద్దేపణలు జగన్ నుండి ఏమీ అందడం లేదు. గత టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు, ప్రస్తుత ప్రభుత్వం కూడా చేస్తుంది ఏమీ లేదు.. అని వాళ్లలో అంతర్గత ఆవేదన ఉన్నట్టు స్పష్టమవుతుంది.. కాపుల విషయానికి వస్తే టీడీపీ అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిన ఒకటే అన్న ధోరణికి వచ్చేస్తున్నారుట. కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు మూడు పార్టీల్లో డివైడ్ అయినప్పటికీ ఆ సామాజికవర్గ ఓటర్లు మాత్రం న్యూట్రల్ గా ఉండిపోయారు. టీడీపీని నమ్మలేక, అటు జగన్మోహనరెడ్డి వద్దకు వెళ్లలేకపోతున్నారు. ఈ రెండు పార్టీలు కాకుండా ఉన్నది పవన్ కళ్యాణ్ జనసేన ఉన్నా అసలు నిలకడ లేని పవన్ ను నమ్మి ఆ పార్టీలోకి వెళ్లలేని పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం. అందుకే కాపు సామాజికవర్గ ఓటు బ్యాంక్ చాలా వరకు న్యూట్రల్ గా ఉండిపోయాయనేది ఓ అంచనా.. కొందరు నాయకులు అయితే టీడీపీకి అనుబంధంగా చేర్చాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది వేచి చూడాలి. ముఖ్యంగా జనసేన, టీడీపీ పొత్తు ఉంటే ఈ కూటమి వైపే దాదాపు 70 శాతంకుపైగా నేతలు చేరాలని అంతర్గతంగా చర్చలు, ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా చంద్రబాబు వద్ద కొన్ని ప్రత్యేక డిమాండ్లు పెట్టే ఆలోచన ఉందట. మేము ఇంత మంది నాయకులు వస్తున్నాం, మాకు ఇన్ని స్థానాలు కేటాయించాలి తదితర డిమాండ్లను చేయనున్నారుట. టీడీపీ జనసేన పొత్తు ఉంటేనే ఈ చర్చలు, వ్యవహారాలు ఉంటాయి. వాళ్ల మధ్య పొత్తు లేకపోతే ఎవరి దారి వాళ్లదే అన్నట్లుగా సాగే అవకాశం ఉంది. జనసేన, టీడీపీ పొత్తుల ఆధారంగా వీరి యాక్షన్ ప్లాన్ ఉండబోతున్నది అన్నది విశ్వసనీయ సమాచారం..!