ఇరవై మందికి పైగా అతి మితవాద పార్టీలకి చెందిన ఐరోపా పార్లమెంట్ సభ్యులని కశ్మీర్ “ప్రైవేటు పర్యటన” కోసం తీసుకువచ్చిన జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ తప్పుడు ఆలోచన భారతదేశాన్ని, ఇక్కడి ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాల ముందు చిన్నబుచ్చే ఘోరమైన సెల్ఫ్గోల్. అంతేకాకుండా ఈ చర్య వల్ల భారతదేశానికి మిత్రదేశాల కన్నా శత్రుదేశాలు ఎక్కువవుతాయి.
ప్రభుత్వ ప్రచారం సంగతి అటుంచితే ఈ వారం చేపట్టిన ఈ పర్యటన మూర్ఖత్వానికి పరాకాష్ట. ఇలా ఎందుకు అంటున్నానంటే ఈ విహారయాత్ర సఫలం అయ్యి, వచ్చిన సభ్యులు మోదీ కశ్మీర్ విధానాలని ప్రశంసించవచ్చు. కశ్మీరీ పాత్రికేయులని రానీయకుండా జరిపిన ఒక “రిగ్గిడ్” పత్రికా సమావేశంలో ఇదే చేసినట్టున్నారు కొంతమంది ఎంపీలు. అయితే ఈ పర్యటనకి వచ్చిన వారిలో ఎక్కువమంది ఎంపీలు తమ తమ దేశాలలో మానవ హక్కులు అంటే ఏ మాత్రం గౌరవం లేని, పరదేశీయుల పట్ల ద్వేషం వెళ్లగక్కే రాజకీయ నాయకులగానే ప్రసిద్ధి. అటువంటి వారితో కితాబు ఇప్పించుకోవడం ఫీల్ గుడ్, ఇన్క్రెడిబిల్ ఇండియా ప్రచారంతో పొంతన లేని పని.
ఈ వచ్చినవారందరూ విదేశీయులపై విద్వేషం చిమ్మే జాత్యహంకార పార్టీలకి చెందిన సభ్యులు. ఈ పార్టీలకు కూడా బిజెపి, ఆరెస్సెస్ లాగా ముస్లింల పట్ల ద్వేషభావం ఉండవచ్చు. అయితే ఇక్కడ ఒక మాట చెబుతున్నాను. మీరు హిందుత్వ మద్దతుదారులు అయినా సరే మీరు కూడా ఇటువంటి పార్టీలతో అంటకాగడం ఇష్టపడరు. మైనారిటీల మీద ఐరోపాలో ఉండే ద్వేషం ఎటువంటి భయంకరమైన రూపమైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను నాజీల గురించి మాట్లాడటం లేదు- ఇప్పుడు ఐరోపాలో బలం పుంజుకుంటున్న మితవాద వర్గాలలో కొన్నిటినీ ఐరోపా మీడియా కూడా నాజీలతో పోలుస్తున్నది. నార్వే రాజధాని ఓస్లోలో 2011లో పదుల సంఖ్యలో జనాలని హతమార్చిన విదేశీ ద్వేషి యాండర్స్ బ్రీవిక్ విడుదల చేసిన “మానిఫెస్టో” ఎవరికైనా గుర్తుందా? అలాగే “భారతదేశంలో జాతీయవాదులు జరిపే అంతర్యుద్ధానికీ, దేశం నుండి ముస్లింలను తరిమివెయ్యటానికి” అతను ఎలా మద్దతు ప్రకటించాడో గుర్తుందా?
ఈ విషయాలని పక్కన పెట్టి మిగతా విషయాలలోకి వస్తాను. ఎందుకంటే ఈ పర్యటన ఎంత మూర్ఖమైనదో మనకి మొదటే పూర్తి స్పష్టత ఉండాలి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కశ్మీర్ విషయాన్ని “అంతర్జాతీయం” చేస్తున్నారని కొంతమంది తెలియక చేస్తున్న ఫిర్యాదు గురించి నేను మాట్లాడటం లేదు. కశ్మీర్ భారతదేశం అంతరంగిక విషయం అని చెప్పడానికీ, అదే సమయంలో విదేశీ ప్రజా ప్రతినిధులను, పాత్రికేయులను, పరిశోధకులను కశ్మీర్ సందర్శించేందుకు అనుమతించడానికీ మధ్య ఎటువంటి వైరుధ్యం లేదు. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఒక రాష్ట్రం మొత్తాన్ని- లేదా కేంద్ర పాలిత ప్రాంతం- బయట ప్రపంచం నుండి దాచిపెట్టే హక్కు ప్రజాస్వామ్య దేశాలకి లేదు. అందుకనే ఐరోపా పార్లమెంట్ సభ్యులు కశ్మీర్ వెళ్ళటం మంచిదేనని నేను అనుకుంటున్నాను. విదేశీ దౌత్యవేత్తలను, విదేశీ పాత్రికేయులను కూడా కశ్మీర్ వెళ్ళటానికి, అక్కడ తమకి నచ్చిన వారిని కలవటానికి- ఐరోపా సభ్యులకి ఈ అదృష్టం లేకపోయే- మోదీ ప్రభుత్వం ఒప్పుకుంటుంది అని నేను ఆశిస్తున్నాను.
ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే ప్రతిపక్ష నాయకులు, యశ్వంత్ సిన్హా, సందీప్ పాండే లాంటి పౌర సమాజం నాయకులు కశ్మీర్ వెళ్తే వారిని అక్కడ విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకుని, అటునుంచి అటే విమానంలో తిప్పి పంపుతున్నారు. అదే ప్రభుత్వం ఐరోపా పార్లమెంట్ సభ్యులని కశ్మీర్ తీసుకువెళ్లటంలో ఎక్కడలేని ఉత్సాహాన్ని చూపించింది. స్వయానా జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రైన కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ కశ్మీర్ వెళ్ళటానికి సుప్రీం కోర్టుని అభ్యర్ధించాల్సి వచ్చింది. సిపిఎం ప్రధాన కార్యదర్శికి కూడా ఇదే గతి పట్టింది.
నిర్ఘాంతపరిచే విషయమేమిటంటే ఇటువంటి దుర్మార్గపు నిబంధనలను కొట్టిపారేయాల్సిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనమే వీటికి మరికొన్ని నిబంధనలను చేర్చింది. ఏచూరి సీతారాంను కశ్మీర్ వెళ్ళనిస్తున్నది కేవలం తన పార్టీ సభ్యుడైన యూసఫ్ తారిగమిని పరామర్శించడానికి మాత్రమేనని, అది కాక ఇంకేమన్నా చేస్తే ( బహుశా కోర్టు వారి ఉద్దేశం సామాన్య కశ్మీరీలని కలవటం కానీ, స్థానిక పాత్రికేయులతో మాట్లడటం అయ్యుండొచ్చు) కోర్టు ధిక్కారణకి పాల్పడినట్టేనని న్యాయమూర్తులు ఆయనతో అన్నారు.
గత మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు సీతారం ఏచూరి, తరిగామి
అంటే భారతదేశ పార్లమెంట్ సభ్యులు, ప్రతిపక్ష నాయకులూ సుప్రీం కోర్టు అనుమతి ఉంటే తప్ప కశ్మీర్ వెళ్ళకూడదన్నమాట. ఒక వేళ అనుమతితో వెళ్ళినా అక్కడ స్థానికులతో మాత్రం మాట్లాడకూడదు. అటువంటి పరిస్థితుల్లో ఐరోపా సభ్యుల బృందం కశ్మీర్ సందర్శించటానికి మాత్రం ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేకపోయింది.
ఇక్కడ ఏం జరుగుతున్నదీ కొంచెం కంగాళీగా ఉంది. తమ కశ్మీర్ విధానం అంతర్జాతీయ మీడియాలో తీవ్ర విమర్శకి గురవ్వటంతో గౌరవప్రదంగా అగుపించే కొంతమంది విదేశీయులని తీసుకువచ్చి కశ్మీర్ లో పరిస్థితి “సాధారణంగానే” ఉందని చెప్పేందుకు ప్రధాన మంత్రి కార్యాలయం- ముఖ్యంగా తాను చాలా గొప్ప గూఢచారినని భ్రమించే అజిత్ దోవల్ – ప్రయత్నించింది. కశ్మీర్ లో సమస్య “ఇస్లామిక్ తీవ్రవాదమే” కాని కశ్మీరీల ప్రాధమిక హక్కుల హననం కాదన్న కథనాన్ని ఆ యూరోపియన్ ఎంపీలు నమ్మే అవకాశం ఎక్కువ కాబట్టి ఇందుకు వారిని ఎంచుకున్నారు.
దానికోసం వాళ్ళు బ్రస్సెల్స్ లో ఉమెన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ థింక్ ట్యాంక్ సంస్థని సంప్రదించారు. ఈ సంస్థని ఇండియాలో పుట్టి బ్రిటన్లో నివసిస్తున్న వ్యాపారవేత్త మాడి శర్మ నిర్వహిస్తున్నారు. ఈవిడతో దోవల్, అతని గణానికి ఇంతకుముందే పరిచయాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఎంపిక చేసిన కొంతమంది ఐరోపా పార్లమెంట్ సభ్యులకి ఢిల్లీ, కశ్మీర్ పర్యటించడానికి శర్మ ఆహ్వానం పంపించింది. దీనికయ్యే ఖర్చులన్నీ ఢిల్లీ చిరునామా కలిగిన ఒక స్వచ్చంద సంస్థ పెట్టుకుంటుంది అని చెప్పింది. యుకె లిబరల్ డెమొక్రాట్స్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు క్రిస్ డేవిస్ కి శర్మ పంపిన ఆహ్వానంలో ఒక భాగం ఇది.
“ ప్రధాన మంత్రి మోదీతో నేను ఒక ప్రతిష్టాత్మకమైన విఐపి సమావేశం నిర్వహిస్తున్నాను. ఆ సమావేశానికి సంబంధించిన ఆహ్వానం మీకు అందచెయ్యటం నా అదృష్టంగా భావిస్తున్నాను.
మీకు తెలిసే ఉంటుంది మొన్న జరిగిన ఎన్నికలలో మోదీ భారీ విజయం సాధించారు. దేశం కోసం, దేశ ప్రజల కోసం తన వృద్ధి, అభివృద్ధి పధాన్ని కొనసాగించదలుచుకున్నారు.
ఆ నేపధ్యంలో ఐరోపా సమాఖ్యలో ప్రభావవంతమైన నిర్ణయాధికారాలు కలిగిన వారిని కలవటానికి మోదీ ఉత్సాహం చూపిస్తున్నారు. ఢిల్లీ వచ్చి మోదీని కలవటానికి మీకు కుదురుతుందా అని కనుక్కుందామని ఇది రాస్తున్నాను. ప్రధాన మంత్రితో సమావేశం అక్టోబర్ 28 నాడు ఉంటుంది, కశ్మీర్ పర్యటన అక్టోబర్ 29 నాడు ,అక్టోబర్ 30 నాడు పత్రికా సమావేశం ఉంటుంది.
ఐరోపాలో వివిధ దేశాలకూ, వివిధ పార్టీలకీ చెందిన వారు ఈ పర్యటనలో పాల్గొంటారు( ప్రయాణం ఖర్చులు, అక్కడా ఉండేదానికి అయ్యే ఖర్చు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాన్-ఎల్లయిడ్ స్టడీస్ వారు భరిస్తారు). మీరు మా విఐపి అతిధిగా ఇందులో పాల్గొంటున్నారు తప్ప ఐరోపా పార్లమెంట్ సభ్యుల అధికారిక స్థాయిలో కాదు.”
ఈ లేఖ చూసి డేవిస్కి అనుమానం వచ్చింది. ది వైర్ విలేకరి దేవిరూప మిత్రతో మాట్లాడుతూ వీళ్ళ గురించి తానెప్పుడూ విననేలేదని చెప్పారు. వారికి తాను ఇచ్చిన జవాబుని మరుసటి రోజు మిత్రకు పంపించారు.
“మీ ఆహ్వానానికి కృతజ్ఞతలు. ఈ ఆహ్వానాన్ని మన్నించడం నాకు సంతోషమే. అయితే ఒక షరతు మీద. కశ్మీర్ పర్యటనలో నాకు నచ్చిన చోటకి వెళ్లి, నేను మాట్లడాలి అనుకున్నవారితో మాట్లాడే అవకాశం నాకు ఉండాలి. నాతో పాటు సైనిక దళాల వారు కానీ, పోలీసు వారు కానీ, భద్రతా దళాలు వారు కానీ ఎవ్వరూ ఉండకూడదు. నేను వెళ్ళేటప్పుడు పాత్రికేయులతో, టెలివిజన్ బృందంతో వెళ్తాను.
ఈ పూర్తి గ్యారంటీని రాతపూర్వకంగా ఇవ్వగలరు. అప్పుడు మనం పర్యటన వివరాలు చర్చిద్దాము.”
కశ్మీర్ సందర్శనకు షరతులు పెట్టి ఆహ్వానం పోగొట్టుకున్న ఇంగ్లండ్ లిబరల్ డెమొక్రాట్ ఎంపీ క్రిస్ డేవీస్
ఈ జవాబు చూసిన తర్వాత ఊగిసలాడటం మాడి శర్మ వంతయింది. “పర్యటన గురించి చర్చించేందుకు” మొదట డేవిస్ని కలవటానికి ఒప్పుకుంది. అయితే రెండు రోజుల తరువాత ఆయనకు ఈ విధంగా రాసింది.
“మరింతమంది సభ్యులని నేను తీసుకువెళ్ళలేను అని చెప్పటానికి చింతిస్తున్నాను…ఇండియా నుండి తిరిగివచ్చాక సమయం చూసుకుని భవిష్యత్తులో ఎప్పుడైనా పర్యటన పెట్టుకోవచ్చేమో చర్చించడానికి మీ కార్యాలయానికి వస్తాను.”
వెనక నుండి ఇదంతా నడిపిస్తున్న వారు గట్టిగా కోరుకున్నది ఏమిటంటే ఈ విహారయాత్రకి వచ్చిన వారెవ్వరూ కశ్మీర్లో ఎవరంటేవారితో మాట్లాడకూడదు అని. అందకే డేవిస్ని వద్దనుకున్నారు.
చివరికి శర్మ ఇరవై ఏడు మంది సభ్యుల బృందాన్ని ఢిల్లీ తీసుకువచ్చింది. వాళ్ళు మోదీని కలిశారు, దోవల్ ఏర్పాటు చేసిన లంచ్కు వెళ్ళారు, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఏర్పాటు చేసిన డిన్నర్కి హాజరయ్యారు. మంగళవారం నాడు శ్రీనగర్లో ఉన్నారు. ఇంకా సరిగ్గా చెప్పుకోవాలంటే ఇదే శ్రీనగర్ అని చెప్పి ఏదో ఒక దిక్కుమాలిన గ్రామానికి తీసుకువెళ్ళారు. ఈ పర్యటనతో మాడి శర్మకు లింకు ఎలా కుదిరింది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాన్-ఎలైన్డ్ స్టడీస్కి (ఈ సంస్థ వెబ్సైటులో “కార్యక్రమాలు” ట్యాబ్ కింద 1998 నుండి ఏ కార్యక్రమం చేసినట్లు చూపడం లేదు.) ఆవిడకి ఏంటి సంబంధం అని అడుగుతూ ది వైర్ పంపిన ప్రశ్నలకి మాడి శర్మ జవాబు ఇవ్వలేదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాన్-ఎలైన్డ్ స్టడీస్ వాళ్ళు కూడా మీడియా ప్రశ్నలకి జవాబు ఇవ్వలేదు.
మోదీ, దోవల్కు అర్ధం కానిది ఏమిటంటే ప్రజాస్వామ్యాలు ఇలాంటి ముందే అంతా నిర్ణయం అయిపోయే పర్యటనలు ఏర్పాటు చెయ్యవు. ఎవరైనా గానీ తమకు నచ్చినట్టుగా వెళ్లడానికీ, తమకు నచ్చినవి చూడడానికీ, తమకు కావలసినవి వినడానికీ ఏర్పాట్లు చేస్తాయి. వారు స్వదేశీయులైనా, విదేశీయులైనా.
కశ్మీర్ లో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి అని ప్రపంచంతో చెప్పించాలంటే ఉత్తమ మార్గం కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేలా చెయ్యటం. ఉదాహరణకి ఇంటర్నెట్ సదుపాయం పునరుద్ధరించడం, ప్రజలను తిరగనివ్వటం, పరస్పరం మాట్లాడుకోనివ్వడం, రాజకీయ ఖైదీలు అందరినీ విడుదల చెయ్యటం, నిజమైన ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు, వాటి నాయకులు ఎలా పని చేసుకుంటారో అలా చేసుకోనివ్వడం.
కానీ ఈ ప్రభుత్వం అవేమీ చెయ్యదు. కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితి గురించి ఇంకొక సంవత్సరం పాటు మాట్లాడను అని బాండ్ రాసిస్తేనే రాజకీయ నాయకులకి స్వేఛ్చ. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి అంటే ఇదేనా?
ఈ పర్యటన నుండి వైదొలగిన బ్రిటిష్ సభ్యుడు డేవిస్ మాటలని చివరగా చెబుతాను. “ఇండియా పార్లమెంట్ సభ్యులని కశ్మీర్ వెళ్ళనివ్వటం లేదని నాకు ఈ రోజే తెలిసింది” అని ఆయన ది వైర్తో అన్నారు. “ ఇదే నిజమైతే కనుక ఇది ప్రజాస్వామ్యం మీద ప్రత్యక్ష దాడి. నాకు చాలా నిరాశగా ఉంది. ఇండియా గొప్ప దేశం. ఆ దేశం ఇంతకన్నా మెరుగ్గా వ్యవహరిస్తుంది అని మేము ఆశిస్తాము.”
సామన్య కశ్మీరీలు ఇదే మాట మొదటి నుండి చెబుతున్నారు. ఇప్పుడు ఒక ఐరోపా పార్లమెంట్ సభ్యుడు కూడా చెప్పాడు కాబట్టి- ప్రభుత్వానికి వాళ్ళే కదా ముఖ్యం- ఇప్పటికైనా మోదీ చెవిన బెడతారా?
-సిద్ధార్ధ వరదరాజన్
‘ద వైర్‘ వెబ్సైట్ సౌజన్యంతో