పుల్వామా అనంతర విజయోత్సవాలు కశ్మీరీలకూ, భారత ప్రజాస్వామ్యానికీ గొడ్డలిపెట్టు
ఫిబ్రవరి 14 నాడు జరిగిన పుల్వామా దాడి గురించి భారతదేశం ప్రదర్శించిన విజయోత్సవ అత్యుత్సాహం కశ్మీరీలకూ, భారత ప్రజాస్వామ్యానికీ గొడ్డలిపెట్టు లాంటిది.
ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ 46వ సమావేశానికి గౌరవ అతిధిగా ఆహ్వానం అందటాన్ని భారదేశం ఒక విజయంగా భావిస్తున్నది. ఆ సమావేశంలో కశ్మీర్ గురించి ఎటువంటి ప్రస్తావనా లేకుండా వారు ప్రకటన విడుదల చెయ్యటం అంతకన్నా పెద్ద విజయం.
ఈ విజయానికి ముఖ్య కారకులు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. భారతదేశ మీడియా ఈ సంఘీభావాన్ని ప్రశ్నించనే లేదు. అయినా ఎందుకు ప్రశ్నించాలి? వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్, అల్-అరబ్ వార్తా ఛానల్ సంపాదకుడు, రచయిత, నిరసనకారుడు అయిన జమాల్ కషోగ్గిని గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఇస్తాంబుల్ లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంలో హత్య చేసినట్టు సౌదీ అరేబియా పాలకవర్గం ప్రపంచవ్యాప్తంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నది.
ఆ హత్యకి ఆదేశాలు జారీచేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ని భారతదేశం చాలా ఆప్యాయంగా భారతదేశానికి స్వాగతించింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ వారి ప్రకటనలో కశ్మీర్ గురించి ప్రస్తావనను సౌదీ అరేబియా అడ్డుకోవడం ఆ ఆప్యాయతకి కృతజ్ఞతే.
అంతేకాక సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఈజిప్ట్ దేశాలతో కలిసి “ఉగ్రవాదానికి మద్దతు అందిస్తోంది” అన్న కారణంతో జూన్, 2017 నుండి ఖతార్ దేశాన్ని దిగ్బంధించాయి. “ఈ మద్దతు” ఆరోపణను ఖతార్ ఖండించింది. భూమి, ఆకాశం, సముద్ర మార్గాల దిగ్బంధం ఎత్తివేయాలంటే ఖతార్ నెరవేర్చాల్సిన పదమూడు డిమాండ్ల జాబితాని ఆ దేశాలు జారీ చేశాయి. అందులో ఆరవ డిమాండ్ అల్ జజీరా నెట్వర్క్ని మూసివేయడం. పదకొండవ డిమాండ్ మరొక ఆరు మీడియా సంస్థలను మూసివేయడం.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో ఎక్కువగా నష్టపోయేది మీడియానే. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీడియాలో ఒక గణనీయమైన భాగం నోరు మూయించేసింది. ఆఖరికి ఉగ్రవాదంతో ఎటువంటి సంబంధాలు లేని బ్లాగర్లని కూడా జైలులోకి తోసింది.
ఫిబ్రవరి 22 నాడు కశ్మీర్ లోయలో అతిపెద్ద ఆంగ్ల దినపత్రిక అయిన గ్రేటర్ కశ్మీర్ పత్రికకు గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూ-కశ్మీర్ పరిపాలన యంత్రాంగం ప్రకటనలు ఆపేసింది. అప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటనల జారీలో ఈ పత్రికను బ్లాక్లిస్ట్లో పెట్టింది. కశ్మీర్ రీడర్ దినపత్రికకు కూడా ప్రకటనలు ఆపివేశారు. ఇదే పత్రికని 2016లో ఉవ్వెత్తున చెలరేగిన ప్రజాందోళనప్పుడు మూడు నెలల పాటు నిషేధించారు.
ప్రకటలను ఆపివేయటానికి గల కారణాలను పరిపాలన యంత్రాంగం పేర్కొనలేదు. కాకపోతే భారతదేశ ప్రభుత్వం ప్రోద్బలంతోనే ఇది జరిగింది అనే సంకేతాలు మాత్రం వారు ఇచ్చారు. “ఉగ్రవాదులను, జాతి వ్యతిరేక శక్తులనూ ఆకర్షణీయంగా చూపించే రాడికల్ సమాచారం” ప్రచురణని ఆపేందుకే ఈ చర్య తీసుకున్నారు అని అక్కడ భావిస్తున్నారు.
తొంభయ్యవ దశకంలో హిందీ చిత్ర పరిశ్రమ కశ్మీరీలని రా క్షసులుగా చిత్రించింది. ఈరోజున భారతదేశంలో వివిధ ప్రాంతాలలో చదువు కోసం, పని కోసం నివసిస్తున్న సాధారణ కశ్మీరీల మీద మతవాద గుంపులు దాడి చేసే వాతావరణాన్ని బిజేపి కల్పించింది. ఉగ్రవాదంపై యుద్ధాని తోడుగా కనబడుతున్న విజయోత్సవ అత్యుత్సాహం లేకపోతే ఇటువంటి వాతావరణాన్ని సృష్టించడం సంభవం అయ్యుండేది కాదు.
కశ్మీరీ ప్రజలు అనేక రకాల దురాగతాలకి బాధితులు. వారు వారి భావాలని తెలియచెప్పనివ్వకుండా అనేక రకాలుగా నోరుమూయిస్తున్నారు. ఇప్పుడు తాజాగా విజయోత్సవ వాతావరణం ద్వారా వారిని అణిచివేస్తున్నారు.దీనిని ప్రతిఘటించటం కూడా కష్టసాధ్యం. చర్చలకి ఆస్కారం కల్పించే ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని ఇది ధ్వంసం చేస్తుంది. ఇలాంటి వాతావరణమే మిలిటెంట్ గ్రూపుల రిక్రూట్మెంట్కు ఎంతో అనుకూలంగా ఉంటుంది.
తమ అజెండాలో జాతీయ భద్రతకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం కశ్మీర్ వివాదంతో ముడివేసుకుని ఉన్న రాజకీయ కారణాల గూర్చి చర్చించే అవకాశాన్ని చేతులారా జారవిడుచుకుంది.
ఇందుకు భిన్నంగా పుల్వామా లాంటి ఎన్నో దాడులకి పాల్పడిన నాగా తిరుగుబాటుదారులతో మోదీ ఇష్టపూర్వకంగా చర్చలు జరిపారు.
పుల్వామా దాడికి సంబంధించి భారత ప్రభుత్వం, మీడియా స్పందనలో అత్యంత వ్యధాభరితమైన విషయం ఏమిటంటే ఆ స్పందన, కశ్మీర్ ప్రజల అసంతృప్తికి గల కారణాలని పరిష్కరించాల్సింది పోయి వాటిని ఇంకా సంక్లిష్టం చేసింది.
బిజెపి ప్రభుత్వం ఇండియా భద్రతా సిద్ధాంతాన్ని అమెరికా వారి ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం నుండి అరువు తెచ్చుకుంది. ఇప్పటికి దాదాపుగా రెండు దశాబ్దాల నుండి యుద్ధం చేస్తున్నా కూడా అమెరికా, వారి మిత్రులు ఇప్పటికీ ఉగ్రవాదులను అంతమొందించలేకపోయారు అన్న విషయం బిజెపి బహుశా ఇంకా గ్రహించినట్టు లేదు. అమెరికా వారి అంతులేని యుద్ధం అనేక దేశాలని అస్థిరత్వానికి గురి చెయ్యటం తప్ప సాధించింది ఏమి లేదు.
“ప్రచ్ఛన్న యుద్ధానంతర విజయోత్సవ అత్యుత్సాహం వినాశకర పర్యవసానాలకి దారి తీసింది. చరిత్రకారులు గడిచిన రెండు దశాబ్దాలని [అమెరికా ఆధిపత్యం చలాయించిన] ఏకధ్రువ కాలంగా గుర్తుంచుకోరు. స్వీయ రక్షణ విషయాల గురించి అనవసరంగా, అధికంగా ఆలోచించి బోర్లాపడ్డ విరామసమయంగా మాత్రమే గుర్తుంచుకుంటారు. అతలాకుతలమైన ఆర్ధిక వ్యవస్థతో ఆ విరామ కాలం ఇప్పుడు ముగింపుకు చేరుకుంది, దేశం ఎడతెగని యుద్ధం ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితి కనబడుతోంది” అని చరిత్రకారుడు అండ్రూ జే బాశ్వక్ రాశారు.
ఈనాడు ఒక పక్క క్షీణిస్తున్న ఆర్ధిక పరిస్థితి, మరొకపక్క విజృంభిస్తున్న నిరుద్యోగ సమస్యతో భారతదేశం సతమతం నేపధ్యంలో, పాకిస్థాన్, కశ్మీర్లకు సంబంధించి బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న విధాన నిర్ణయాలు దక్షిణాసియాను అస్థిరత్వం పాలు చేయగలవు.
మే 23న బిజెపి మరొక్కసారి అధికారంలోకి వచ్చి, తన విజయోత్సవ అత్యుత్సాహాన్ని ఇలాగే కొనసాగించగలిగితే పైన పేర్కొన్న ప్రమాదం నిజం అయ్యే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఆ విజయోత్సవ అత్యుత్సాహం కశ్మీరీ ప్రజలని మరింత దూరం చేసి భారతీయ సమాజాన్ని మరింతగా వేరు చేయగలదు.
-నందితా హక్సర్
నందితా హక్సర్ మానవ హక్కుల న్యాయవాది, కార్యకర్త, టీచర్, రచయిత
‘ద స్క్రోల్’ సౌజన్యంతో