ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ‘జల వివాదం‘ గత కొద్ది నెలలుగా హాట్ టాపిక్ గా నడుస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కు జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో దానివల్ల తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతం ఎడారిగా మారిపోతుందని కెసిఆర్ ఆరోపించడంతో ఈ వివాదం కారుచిచ్చులా రగులుకొని ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కేంద్రం అపెక్స్ కౌన్సిల్ భేటీని నిర్వహించనుంది. అయితే ఈ వివాదం ఇక్కడితో ఆగాలి అంటే ఎవరో ఒకరు వాదనలో నెగ్గల్సిందే. ఎవరూ వెనక్కి తగ్గరు. మరి అందుకు కేసీఆర్ ఇప్పుడు రెడీగా ఉన్నాడా..? మరి జగన్మోహన్రెడ్డి పరిస్థితి ఏమిటి? అసలు కేసీఆర్ దగ్గర ఉన్న పాయింట్లు ఏమిటి?
ఇదీ కేసీఆర్ పంతం
తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం పర్థం లేని, నిరాధారమైన, అనవసర రాద్ధాంతం చేస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంభిస్తున్నదని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇది వరకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో పూర్తి వాస్తవాలు, సంపూర్ణ సమాచారం ముందు పెట్టి సమర్థ వంతంగా వాదనలను వినిపించాలని నిర్ణయించారు. ఇటు ఆంధప్రదేశ్ ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి గట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
మనం మాట్లాడితే వారు నోరెత్తకూడదు
అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో ఇవాళ జలవనరుల శాఖ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పూర్వాపరాలను క్షుణ్ణంగ పరిశీలించారు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభిప్రాయాలపై చర్చించారు. అలాగే ప్రతీసారి కేసిఆర్ చెబుతున్నది ఒక్కటే…! “తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థం లేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తున్నది. అపెక్స్ కమిటీ సమావేశంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం నోరు మూయించేలా, వారి అర్థ రహిత వాదనలను తిప్పికొట్టేలా సమాధానం చెబుదాం. తెలంగాణ ప్రాజెక్టుల గురించి మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కల్పిద్దాం’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
కేంద్రానికీ డోస్ రెడీ..!
తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా తప్పిదమే. తెలంగాణ రాష్ట్రానికున్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే నీటి కేటాయింపులు జరిగి, అనుమతులు పొంది, ఖర్చు కూడా జరిగిన ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏమాత్రం సరికాదని కేసీఆర్ అంటున్నాడు. “శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే విషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతర పెడుతున్నది. వాస్తవానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నింపిన తర్వాతనే మిగిలిన ప్రాజెక్టులు నింపాలి.
అసలు శ్రీశైలం ప్రాజెక్టు నీటి పారుదల ప్రాజెక్టు కాదు, అది జల విద్యుత్ ప్రాజెక్టు. ఇన్ని వాస్తవాలు పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసం కాదు. ఒక రాష్ట్రంగా తెలంగాణకు కూడా హక్కులుంటాయి. తనకున్న హక్కు ప్రకారం ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఈ విషయంలో రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరించడం తగదు. కేంద్ర వైఖరిని కూడా యావత్ దేశానికి తెలిసేలా చేస్తాం. అన్ని వాస్తవాలు వెల్లడిస్తాం,” ఇవే కేసీఆర్ మాటలట.
మరి కేసీఆర్ ఇక్క డ ఇంత సన్నధంగా ఉంటే అటు జగన్ నుండి కౌంటర్స్ వస్తాయా…?