ఆర్థికంగా సంపన్నమైన రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకే లాక్ డౌన్ ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన ఇష్టం వచ్చినన్ని రోజులు పొడిగించుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఎలాగోలాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవచ్చు కానీ ముందు ప్రజల ప్రాణాలు ముఖ్యం అని ఆయన చాలా గట్టిగానే ఉన్నాడు. అయితే కేంద్ర ప్రభుత్వం మరొక రెండు వారాలు లాక్ పొడిగిస్తున్నట్లు చెప్పిన తర్వాత కొత్తగా ప్రవేశపెట్టిన సడలింపుల కింద మద్యపానాన్ని విక్రయించడం మొదలుపెట్టొచ్చు అని తెలియజేసిన సంగతి తెలిసిందే.
నిన్నటి నుంచి దాదాపు అన్ని రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక్క షాపు కూడా తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వలేదు. కానీ కొన్ని పత్రికలు మాత్రం పాలకుడి అభిప్రాయానికి భిన్నంగా మద్యం షాపులు తెరవాలి అన్నది ప్రజల అభిప్రాయం అన్న ముద్ర వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.
సదరు పత్రిక వాదన ఏమిటంటే మద్యం షాపులు తెరిచేందుకు ఏపీ, మహారాష్ట్ర మరియు కర్నాటక ప్రభుత్వాలు అనుమతిని ఇచ్చారని అయితే తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆంక్షల వల్ల మద్యం ఇక్కడ పొంగిపొర్లే అవకాశం ఉందట. అదే కనుక జరిగితే రాష్ట్రంలో జనం జేబులు గుల్ల అయిపోవడం ఖాయమని…. అధిక రేట్లకు ఇక్కడ విక్రయిస్తారు అని వారు భవిష్యత్తును చెప్పేశారు. అదే కాకుండా దీని వల్ల కల్తీ మద్యం ప్రవేశించి ప్రజల ప్రాణాలకు ముప్పు తేవచ్చు అని మరియు గుడుంబా బట్టీలు కూడా అప్పుడే మొదలైపోయాయని కళ్ళకు కట్టినట్లుగా వార్తల్లో ప్రచురించారు. ఇటువంటి వార్తలతో ప్రజల్లో కొద్దిగా అసహనాన్ని రగిల్చి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారి అజెండా ఏమో.
అంతేకాకుండా ఆమధ్య లిక్కర్ షాపులపై ఒక ప్రశ్న అడిగిన పాపానికి ఒక జర్నలిస్ట్ పై కేసీఆర్ విరుచుకుపడిన తీరు మనకి తెలిసిందే. ఇక పక్క రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతూ తమ రాష్ట్రంలోని పత్రికలే ప్రభుత్వ మద్యం పై తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతున్నట్టు వార్తలు రాస్తూ ఉంటే సీఎం గారు మాత్రం ఏం చేస్తారు. ఈరోజు సాయంత్రం ఒక అత్యవసర మీటింగ్ కు ఆదేశించి గ్రీన్, ఆరెంజ్ మరియు రెడ్ జోన్ లలో మద్యం విక్రయాల విషయంపై నిర్ణయం తీసుకోబోతున్నారు. చివరికి అతి త్వరలోనే తెలంగాణలో కూడా మద్యం విక్రయాలు మొదలైపోతాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరి అంత మంది గొంతు మీద కత్తి పెట్టినట్లు వ్యవహరిస్తే ఎంత సీఎం అయినా ఏం చేస్తాడు లే…!