గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ కీలక అడుగులు వేసింది. దీనిలో సూత్రధారి, పాత్రధారి, ప్రధాన నిందితులుగా భావిస్తున్న స్వప్న సురేష్ ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులందరినీ కూడా ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని విచారణ జరువుతోంది. ఇది కేరళ రాజకీయాన్ని చుట్టేస్తుంది. నిజానికి గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ తాజాగా 30 కిలోల బంగారం త్రివేండ్రం ఎయిర్ పోర్ట్ లో పట్టుబడటం, వాళ్లని వదిలి పెట్టాలని సాక్షాత్తు సీఎం కార్యాలయం నుంచి కస్టమ్స్ అధికారులు ఫోన్ వెళ్లడం అధికారులు సీరియస్ గా పరిగణించి కేసు నమోదు చేయడం, ఆ తర్వాత సీఎం స్పందించి తన పేషీలోని ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయడం, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చాలని కేంద్రానికి లేఖ రాయడం, కేంద్రం కూడా వెంటనే స్పందించి ఎన్ఐఏ ను రంగంలోకి దించడం, ఎన్ఐఏ వెను వెంటనే విచారణ ప్రారంభించి ఈ రోజు స్వప్న సురేష్ ను అరెస్ట్ చేయడం ఇవన్నీ వెంట వెంటనే జరిగాయి. ఇక్కడి వరకు స్పష్టంగానే జరిగింది. కానీ ఇక మీదట జరగనున్నవి రాజకీయ లింకులు, లాబీయింగ్ లు, అసలైన నేర చిట్టా బయటకు వస్తుంది అని అంటున్నారు.
స్వప్న సురేష్ పదవ తరగతి ఫెయిల్ అయ్యారు. కానీ క్రిమినల్ మెంటాలిటీతో తన తండ్రి దుబాయ్ లో సెటిల్ అవడంతో ఈమె కూడా అక్కడి నుంచే తన పయనాన్ని సాగిస్తూ కేరళ సీఎం కార్యాలయంలోని కీలక స్థానానికి చేరుకుంది. చివరికి గోల్డ్ స్మగ్లింగ్ లో ఆరితేరి ఇటు బిజెపి, అటు సిపిఎం నాయకులతో పాటు కొంత మంది ఐఏఎస్ అధికారులను తన వలలో వేసుకుంది. ఇప్పుడు ఎన్ఐఏ రంగంలోకి దిగడంతో ఏ పార్టీ నాయకులు ఎవరెవరు, ఏ స్థాయి అధికారులు చిక్కుకుంటారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే స్వప్న సురేష్ వెనుక బిజెపి ఉందని సిపిఎం ఆరోపిస్తుండగా, సీపీఎం ఉందని బిజెపి ఆరోపిస్తోంది. ఎవరున్నారు? ఎవరి పాత్ర ఏంటి? అనేది ఎన్ఐఏ నిగ్గుతేల్చడానికే రంగంలోకి దిగింది. అయితే ఎన్ ఐ ఏ దర్యాప్తుని రాజకీయ లాబీయింగ్ ఏమైనా శాసిస్తాయా లేదా నిష్కర్షగా విచారణ జరుగుతుందా? అనేది తేలాల్సి ఉంది.
కేరళలో వచ్చే ఏడాది ఏప్రిల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనితో ఇప్పటి నుంచే అక్కడ రాజకీయ ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటున్నారు. ఈసారి తమ సత్తా చాటాలని బిజెపి ఉవ్విళూరుతోంది. కేరళ ప్రజలు ప్రత్యామ్నాయంగా ఇరు పార్టీలకు సమాన అవకాశాలు ఇస్తూ ఉంటారు. కానీ వరుసగా రెండో సారి కూడా తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని పినరయి విజయన్ చాలా జాగ్రత్తగా పరిపాలిస్తూ వచ్చారు. కేరళలో వరదలు వచ్చినప్పుడు కూడా చాకచక్యంగా ఎదుర్కొని మంచి పేరు తెచ్చుకున్నారు. కరోనా వేళలో కూడా మరణాలు తక్కువగా ఉండేలా ఆరోగ్యశాఖ పరుగులు పెట్టించి దేశంలోనే అత్యుత్తమ ఫలితాలు రాబట్టారు. ఈ క్రమంలోనే ఈ బంగారం స్మగ్లింగ్ వ్యవహారం బయట పడటం, సిఎం కార్యాలయానికి లింక్ లు ఉండటం, అటు కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగడంతో కేరళ రాజకీయాలు రసకందాయంగా మారాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పై ఈ వ్యవహారం ఎంత వరకు ప్రభావం చూపిస్తుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?