Kodali Nani: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రక్షాళనకు సంబంధించి అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. మంత్రివర్గ ప్రక్షాళన ఫిబ్రవరిలో తప్పనిసరిగా ఉంటుంది. నిజానికి మంత్రివర్గ ప్రక్షాళన దసరా కు అనుకున్నారు కానీ అది డిసెంబర్ కు వాయిదా పడింది. డిసెంబర్ నుండి సంక్రాంతికి వచ్చింది. సంక్రాంతి నుండి మార్చి నెలాఖరులోగా జరగబోతుంది అని ఖచ్చితంగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం రోజునే రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మంత్రి మంత్రులను మారుస్తామని చెప్పినప్పటికీ కొన్ని కారణాలు అంటే కరోనా రావడం, మంత్రులు పూర్తి స్థాయిలో పని చేయలేకపోవడం తదితర కారణాల వల్ల వాయిదా పడినట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మార్చి నెలాఖరులోపు మంత్రివర్గ ప్రక్షాళన ఖాయం అని చెప్పవచ్చు. అయితే ఎవరిని మంత్రివర్గంలో ఉంచుతారు..? ఎవరిని తీసేస్తారు..? అనే దానిపై రకరకాల పుకార్లు, ప్రచారాలు జరుగుతున్నాయి.. ముందుగా కొడాలి నాని పేరు ప్రముఖంగా వినిపిస్తుంది…!
Kodali Nani: నాని స్థానంలో మరొకరు సిద్ధం..!?
ప్రస్తుతం మంత్రి వర్గంలో ముగ్గురు నానిలు ఉన్నారు. ఆళ్ల నాని, ఆరోగ్య శాఖ మంత్రి. అలానే ఉప ముఖ్యమంత్రి. పేర్ని నాని. రవాణా, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి. అలానే సమాచార శాఖ మంత్రి. ఇక కొడాలి నాని, పౌరసరఫరాల శాఖ మంత్రి. వీరు ఆయా శాఖలను సక్రమంగా నిర్వహిస్తున్నారా..? లేదా అనేది పక్కన బెడితే ఈ ముగ్గురు కీలక మంత్రులు. వీరిలో కొడాలి నాని అత్యంత కీలకం. ఆయన తన శాఖ గురించి ఎంత వరకు మాట్లాడుతారో తెలియదు కానీ వైసీపీ వాదనను చాలా బలంగా వినిపిస్తారు. జగన్మోహనరెడ్డికి పూర్తిగా కంకణ బద్దుడిగా మాట్లాడతారు. టీడీపీ అంటే విపరీతమైన ధ్వేషంతో మాట్లాడతారు. వ్యక్తిగతంగా తీవ్రమైన కామెంట్స్ చేస్తారు. ఈ ముగ్గురు నానిలో ఎవరిని తీసేస్తారు..? ముందుగా కొడాలి నానికి మంత్రివర్గ బాధ్యతల నుండి తప్పించనున్నట్టు సమాచారం. సామాజిక సమీకరణలో భాగంగా కమ్మ సామాజికవర్గం నుండి ఉన్నది ఒక్క కొడాలి నాని మాత్రమే. ఆర్యవైశ్య సామాజిక వర్గం నుండి ఉన్న ఒకే ఒక మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. క్షత్రియ సామాజికవర్గం నుండి ఉన్న ఒకే ఒక మంత్రి శ్రీరంగనాధరాజు. ఇక రెడ్డి వర్గం నుండి నలుగురు ఉన్నారు. కాపు సామాజికవర్గం నుండి అయిదుగురు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల నుండి ఎక్కువ మంది ఉన్నారు. ఇక కమ్మసామాజికవర్గం నుండి చూసుకుంటే జగన్మోహనరెడ్డి ఒక మంత్రి పదవి కేటాయించారు. మొదటి నుండి కొడాలి నాని సీఎం జగన్ ని నమ్ముకుని ఉండటం వల్ల ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు కమ్మ సామాజికవర్గం నుండి కృష్ణా జిల్లాకే చెందిన ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ఉన్నారు.
* తలశిల రఘురామ కూడా వైసీపీ ఆవిర్భావం నుండి కూడా పార్టీలో కీలకంగా పని చేస్తున్నారు. ప్రారంభంలో జగన్మోహనరెడ్డి ఓదార్పు యాత్ర రూట్ మ్యాప్ మొదలుకుని.., షర్మిల పాదయాత్ర, షెడ్యుల్ రూట్ మ్యాప్, పార్టీ తలపెట్టే ప్రతీ కార్యక్రమాలు, సీఎం కాకమునుపు జగన్ చేపట్టిన పాదయాత్ర వ్యవహారాలు.., ప్రస్తుతం సీఎంగా జగన్ జిల్లాల పర్యటనల వ్యవహారాలన్నిటినీ ఆయనే చూసుకుంటున్నారు. అలానే పోల్ మేనేజ్మెంట్ లో కీలక పాత్ర పోషించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా వైసీపీ తరపున పోటీ చేసిన అభ్యర్ధుల పోల్ మేనెజ్మెంట్ లో కీలక పాత్ర పోషించారు. అంటే పార్టీ ఆవిర్భావం నుండి అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. జగన్మోహనరెడ్డికి సన్నిహితుడు, కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలన్నది జగన్మోహనరెడ్డి ఆలోచన, అందుకే ఆయనకు ఇటీవల ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయనకు మంత్రి పదవిలో తీసుకునేందుకే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని పార్టీ ఉన్నత స్థాయి వర్గాల్లో నడుస్తున్న టాక్. కృష్ణాజిల్లాకే చెందిన తలశిల రఘురామ్ ను మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున అదే జిల్లాలో అదే సామాజికవర్గం నుండి మంత్రిగా ఉన్న కొడాలి నానిని పక్కన పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
కొడాలి మరిన్ని కీలక బాధ్యతలు..!?
అయితే కొడాలి నానికి పార్టీలో అంత కంటే కీలక బాధ్యతలు ఇస్తారని అంటున్నారు. మంత్రివర్గం నుండి తొలగిస్తున్న కీలక మంత్రులకు పార్టీలో కీలక బాధ్యతలు ఇస్తారనేది సమాచారం. వచ్చే ఎన్నికల్లో కీలకంగా బాధ్యతలు నిర్వహించేందుకు పార్టీ పది మంది సీనియర్ తో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నది. ఇది మాత్రం పార్టీ ఉన్నత వర్గాల నుండి అందుతున్న కచ్చితమైన సమాచారం. అంటే ప్రస్తుతానికి కొడాలి నానిని మంత్రి పదవి నుండి తొలగిస్తే పార్టీలో కీలక బాధ్యతలు ఇవ్వబోతున్నది మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?